‘‘నన్ను వేధించకూడదు, కొట్టకూడదు, లొంగుబాటుకు సహకరిస్తే.. రూ.కోటి ఇస్తా’’
బోధన్ వాణిజ్యపన్నుల కుంభకోణంలో కర్త కర్మ క్రియగా వ్యవహరించిన సునీల్ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. దీంతో వీస్తుగొలిపే వాస్తవాలెన్నో వెలుగులోకి వస్తున్నాయి.
హైదరాబాద్: విచారణ పేరుతో నన్ను వేధించ కూడదు.. ఎట్టిపరిస్థితుల్లోనూ కొట్టకూడదు.. న్యాయస్థానంలో లొంగిపోయేందుకు సహకరించాలి. ఈ మాత్రం చేస్తే చాలు రూ.కోటి ఇస్తా. ఇదీ బోధన్ వాణిజ్యపన్నుల కుంభకోణంలో ప్రధాన నిందితుడు సునీల్ దర్యాప్తు సంస్థ సీఐడీ అధికారులకు ఎరవేసిన మొత్తం.
ఈ కుంభకోణంలో కర్త కర్మ క్రియగా వ్యవహరించిన సునీల్ ఎట్టకేలకు అరెస్టయ్యాడు. దీంతో వీస్తుగొలిపే వాస్తవాలెన్నో వెలుగులోకి వస్తున్నాయి. నకిలీ పత్రాలతో గడిచిన మూడేళ్ళ కాలంలోనే రూ.70 కోట్లు కొల్లగొట్టిన సునీల్ అధికారులను ప్రలోభపెట్టడం, వారి బాగోగులు చూడటంలో ఆరితేరాడు.
సునీల్తో మిలాఖత్ అయిన ఆరోపణలపై ఇప్పటికే సీఐడీ డీఎస్పీ విజయ్కుమార్ సస్పెండ్ కాగా మరికొందరి పాత్ర కూడా ఉండి ఉండొచ్చని అధికారులు అనుమానిస్తున్నారు.
మరోవైపు కుంభకోణానికి పాల్పడటానికి, అధికారులను మచ్చిక చేసుకోవడానికి సునీల్ ప్రత్యేక వ్యవస్థనే ఏర్పాటు చేశారు. ప్రస్తుతానికి బోధన్ సర్కిల్ వరకే పరిమితం అయిన సీఐడీ అధికారులు ప్రభుత్వం కోరితే మిగతా ప్రాంతాల్లోనూ దర్యాప్తు జరిపేందుకు సిద్ధమవుతున్నారు.
నిందితులతో లాలూచీ పడ్డట్లు వచ్చిన ఆరోపణలపై బోధన్ వాణిజ్యపన్నుల కుంభకోణం దర్యాప్తు అధికారి విజయ్కుమార్ సస్పెండ్ కావడం చర్చనీయాంశంగా మారింది. అసలు ఈ కుంభకోణం జరిగిందే వాణిజ్యపన్నుల అధికారులను ప్రలోభపెట్టడం ద్వారా.
60-40 శాతం వాటాలు..
జరుగుతున్న అవకతవకలు బయటపడకుండా చూడటంతోపాటు అందుకు సహకరించేలా ప్రధాన నిందితుడు ప్రభుత్వ అధికారులను లొంగదీసుకునే వాడు. ఇందుకు ప్రతిగా వచ్చే ఆదాయంలో 60 శాతం వారికి పంచి పెట్టేవాడు. మిగతా 40 శాతం తన వాటాగా తీసుకునేవాడు.
గత మూడేళ్ళ కాలంలోనే ఇలా రూ.70 కోట్లు నొక్కేసినట్లు అధికారులు గుర్తించారు. ఇందుకోసం సునీల్ ఒక కార్యాలయమే ఏర్పాటు చేశాడు. నకిలీ పత్రాలు తయారు చేసే వ్యవహారం సునీల్ అనుచరుడు విశాల్ చూసేవాడు. మరో అనుచరుడు రామలింగం అధికారులతో మధ్యవర్తిత్వం నెరిపేవాడు.
కుంభకోణంలో సహకరించడానికి అధికారులను ప్రలోభపెట్టినట్లే ఈ కుంభకోణం బయటపడ్డ తర్వాత దాన్ని దర్యాప్తు చేస్తున్న అధికారులను కూడా విజయవంతంగా ప్రలోభపెట్టడం గమనార్హం.
దర్యాప్తు తీరుపై అనుమానం...
ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ కేసులో దర్యాప్తు మందకొడిగా సాగుతుండటంతో అధికారులకు అనుమానం రావడంతో అసలు విషయం వెలుగులోకి వచ్చింది. ఏకంగా దర్యాప్తు అధికారినే లొంగదీసుకున్నట్లు తెలుసుకొని కంగుతిన్నారు.
తన కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తుండటంతో ఏదో ఒకరోజు తాను దొరక్క తప్పదని భావించిన సునీల్ తన పట్ల కఠినంగా వ్యవహరించకుండా చూస్తే చాలు కోరినంత డబ్బు ఇస్తానని రామలింగం ద్వారా బేరసారాలు సాగించాడు. అంతేతప్ప దర్యాప్తులో వెల్లడయిన ఆధారాలు మాత్రం చెక్కు చెదరలేదని సీఐడీ ఉన్నతాధికారులు వెల్లడించారు.
సీఎం పర్యవేక్షణతో అధికారుల్లో వణుకు...
సునీల్ ప్రలోభాలకు లొంగిపోయిన విజయ్కుమార్తో పాటు మరికొందరిపైనా వేటుపడే అవకాశం ఉంది. ఈ కేసును స్వయంగా ముఖ్యమంత్రి పర్యవేక్షిస్తుండటంతో సీఐడీ అధికారులు కూడా వణికిపోతున్నారు.
అయితే ప్రస్తుతానికి తాము బోధన్ సర్కిల్ వరకే పరిమితమయ్యామనీ, ఇదే తరహా కుంభకోణం మిగతా ప్రాంతాల్లోనూ జరగడానికి అవకాశం ఉందని, ప్రభుత్వం ఆదేశిస్తే అయా ప్రాంతాల్లోనూ దర్యాప్తు జరుపుతామని సీఐడీ అధికారులు చెబుతున్నారు.