కారులో దళిత మహిళా నేతకు నో సీట్.. ఆ ఇద్దరు రావులే కారణమా?
హైదరాబాద్ : ఎన్నికల వేళ సాఫీగా సాగుతుందనుకుంటున్న కారు ప్రయాణంలో అడ్డంకులు తప్పడం లేదు. అభ్యర్థులను ప్రకటించి ప్రచారపర్వంలో దూసుకెళుతున్న కారులో అసంతృప్తుల నిరసనలు సెగలు కక్కుతున్నాయి. టికెట్ దక్కని ఆశావహులు పార్టీకి రాం రాం అంటున్నారు. మరో పార్టీ చెంత చేరి పంతం నెగ్గించుకుంటున్నారు. అదే కోవలో చొప్పదండి సిట్టింగ్ ఎమ్మెల్యే బొడిగె శోభ ఒకరు. దళిత మహిళా నేతను కాబట్టే ఆ ఇద్దరు రావులు తనకు టీఆర్ఎస్ టికెట్ రాకుండా అడ్డుపడ్డారని ఆరోపించడం చర్చానీయాంశమైంది. అంతేకాదు కారు వీడి కాషాయదళంలో చేరేందుకు సిద్ధమైపోయారు.
కరీంనగర్ జిల్లాలోని చొప్పదండి నియోజకవర్గం ఎస్సీ రిజర్వ్డ్ కేటగిరీ. 2014 ఎన్నికల్లో అక్కడినుంచి టీఆర్ఎస్ తరపున పోటీచేసిన బొడిగె శోభ విజయం సాధించారు. అయితే ఈసారి ఎన్నికల్లో ఆమెకు టీఆర్ఎస్ నుంచి చేదు అనుభవం ఎదురైంది. శోభ స్థానంలో శొంకె రవిశంకర్ కు టికెట్ కేటాయించారు గులాబీ బాస్. మొదట్నుంచి కూడా టికెట్ తనకే దక్కుతుందని నమ్మిన శోభ ఆశలు ఫలించకపోవడంతో తన రూట్ మార్చారు.
టీఆర్ఎస్ వద్దంది.. బీజేపీ రమ్మంది
కారు వీడి కమలం గూటికి చేరేందుకు సిద్ధమైన శోభ సంచలన కామెంట్ చేశారు. టీఆర్ఎస్ టికెట్ తనకు రాకపోవడానికి సంతోష్ రావు, రవీందర్ రావులే కారణమని మండిపడ్డారు. ఈ వ్యాఖ్యలు ఇప్పుడు రాజకీయ వర్గాల్లో దుమారం రేపుతున్నాయి. దళిత మహిళా నేతను కావడంతోనే తనకు టికెట్ రాకుండా అడ్డుపడ్డారన్న శోభ.. బీజేపీ పార్టీలో చేరుతున్నట్లు ప్రకటించారు.
తొలి జాబితాలో తన పేరు లేని కారణంగా రెండో లిస్టులోనైనా చోటు దక్కుతుందని భావించిన శోభకు నిరాశే మిగిలింది. బుధవారం రిలీజ్ చేసిన రెండో జాబితాలో తన పేరు డిక్లేర్ చేయకపోవడంతో అసంతృప్తికి లోనయ్యారు. సిట్టింగ్ ఎమ్మెల్యేగా ఉన్నప్పటికీ తనను విస్మరించడమేంటని చివరివరకు టికెట్ కోసం ప్రయత్నాలు చేశారు. అయితే అధిష్టానం నుంచి స్పందన కరువైంది.
ఇటు కారు అటు కమలం..! ముందస్తు ప్లాన్
చివరకు తనకు ఇలాంటి అనుభవం ఎదురుకావొచ్చేమోనని గ్రహించిన శోభ అటు బీజేపీ నేతలతో టచ్ లో ఉన్నారు. బుధవారం నాడు బీజేపీ మూడో జాబితా అంటూ ఢిల్లీ పెద్దల ఆమోదం కోసం వెళ్లిన లిస్టులో శోభ పేరు కనిపించడం అందర్నీ ఆశ్చర్యానికి గురిచేసింది. అటు పార్టీ తీర్థం పుచ్చుకోకముందే ఆమె పేరు బీజేపీ లిస్టులో చేరడం చర్చానీయాంశమైంది.
గురువారం మీడియాతో మాట్లాడిన శోభ బీజేపీలో చేరుతున్నట్లు ధృవీకరించారు. టీఆర్ఎస్ ను నమ్ముకుని పనిచేస్తే టికెట్ రాకపోవడం హాస్యాస్పదంగా ఉందన్నారు. చొప్పదండిలో కమలం గుర్తుపై పోటీ చేసి విజయకేతనం ఎగురవేస్తానని ధీమా వ్యక్తం చేశారు.
విరాళాలు- ఖర్చులు: టీఆర్ఎస్ పార్టీకి విరాళాలు ఎంతొచ్చాయి ...ఎంత ఖర్చు చేసింది..?
వివాదాల్లో శోభ..! అందుకే టికెట్ రాలేదా?
2014 ఎన్నికల్లో గెలిచిన నాటి నుంచి శోభపై పలు ఆరోపణలు వినిపించాయి. వివాదస్పద అంశాల్లో ఆమె పేరు తలదూర్చారనే విమర్శలున్నాయి. దీంతో ఆమెకు టికెటిస్తే పార్టీకి నష్టమని నియోజకవర్గ నేతలు అధినేత కేసీఆర్ కు సూచించిన సందర్భాలున్నాయి. రావులకే మర్యాద ఇస్తారా? మమ్మల్ని లెక్క చేయరా అంటూ అధికారులను బెదిరించారనే ఆరోపణలు అప్పట్లో బాగా వినిపించాయి. ఈ విషయంలో కేసీఆర్ కూడా కొంత గుర్రుగా ఉన్నట్లు సమాచారం. అంతేకాదు పార్టీ నేతలను లెక్కచేయకుండా అవమానిస్తున్నారనే విమర్శలతో గులాబీ బాస్ కు చాలానే ఫిర్యాదులు అందాయట. అందుకే టికెట్ ఇవ్వలేదని తెలుస్తోంది.
చొప్పదండి నాదే.. కమలంతో గెలుస్తా..!
ఈసారి ఎన్నికల్లో తనకు టికెట్ ఇవ్వకుండా టీఆర్ఎస్ అవమానించిందనేది శోభ ప్రధాన ఆరోపణ. దానికి తగిన ప్రతీకారం తీర్చుకుంటానని ఛాలెంజ్ చేశారు. ఆరు నూరైనా చొప్పదండి తనదేనంటూ వ్యాఖ్యలు చేశారు. కమలం గుర్తుతో గెలిచి అసెంబ్లీలో మరోసారి అడుగుపెడతానంటూ శపథం చేశారు. అంతేకాదు తనతో పాటు నియోజకవర్గంలోని టీఆర్ఎస్ క్యాడర్ ను కమలం గూటికి చేరుస్తానంటూ ఆ పార్టీ అధిష్టానానికి హెచ్చరికలు జారీచేశారు.