21 రోజుల తర్వాత శవమై తేలి: వైరస్ లక్షణాలతో గాంధీలో చేరిక, తర్వాత మిస్సింగ్, అచేతనంగా..
కరోనా వైరస్ కేసులతో గజ గజ వణుకుతుంటే.. గాంధీ ఆస్పత్రి సిబ్బంది నిర్లక్ష్యం కొట్టొచ్చినట్టు కనిపించింది. వైరస్ లక్షణాలతో ఆస్పత్రిలో చేరిన రోగి ఒకరు 21 రోజుల తర్వాత శవామై తేలారు. దీనిపై సర్వత్రా విమర్శలు వ్యక్తమవుతున్నాయి. ఘటనపై విచారణ జరుపుతున్నామని, ఎంక్వైరీలో నిజ నిజాలు తేలతాయని పోలీసు అధికారులు చెబుతున్నారు.
మే 30వ తేదీ..
ధూల్పేటకు చెందిన నరేంద్ర సింగ్ (39) గత నెలలో అస్వస్థతకు గురయ్యాడు. శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది.. జలుబు, జ్వరం రావడంతో గతనెల 30వ తేదీన ఆస్పత్రికి వచ్చాడు. తొలుత ఉస్మానియా ఆస్పత్రికి వెళ్లగా.. అక్కడి నుంచి కింగ్ కోఠి ఆస్పత్రికి అటు నుంచి గాంధీ ఆస్పత్రికి తీసుకొచ్చారు. కరోనా వైరస్ లక్షణాలతో చికిత్స అందించారు. అయితే తర్వాత అతని ఆచూకీ తెలియరాలేదు. దీంతో ధూల్పేటకు చెందిన బలరాం.. సూచన మేరకు కుటుంబసభ్యులు ఈ నెల 6వ తేదీన ఫిర్యాదు చేశారు. కేసు విచారిస్తోండగా.. అతను చనిపోయాడని తెలిసింది.
6వ తేదీన కంప్లైంట్..
ఫ్యామిలీ మెంబర్స్ ఫిర్యాదుతో మంగళ్ హట్ పోలీసులు కేసు విచారణ చేపట్టారు. గాంధీలో ఒక మృతదేహన్ని గుర్తించారు. దీంతో కుటుంబసభ్యులను కూడా అక్కడికి పిలిచారు. వారు శవాన్ని చూసి నరేందర్ సింగ్ అని గుర్తించారు. దీంతో అతను కనిపించకుండా పోయి గాంధీలో ఎలా కనిపించడనే సందేహం తలెత్తుతోంది. అతనికి కరోనా వైరస్ ఉందా అనే అంశంపై కూడా స్పష్టత లేదు అని పోలీసులు తెలిపారు. ఘటనపై సీఐడీతో విచారణ జరిపించాలని ఎంబీటీ పార్టీ ప్రభుత్వాన్ని డిమాండ్ చేసింది.
సహకరించని సిబ్బంది
కేసు విచారణలో భాగంగా తమకు గాంధీ సిబ్బంది నుంచి కూడా సహాయ నిరాకరణ ఎదురైందని పోలీసులు తెలిపారు. సిబ్బంది సహాకరించలేదు అని.. సీసీటీవీ ఫుటేజీ కూడా చూడలేని పరిస్థితి అని పేర్కొన్నారు. అయితే నరేందర్ సింగ్ తమ ఆస్పత్రిలో చేరలేదు అని గాంధీ ఆస్పత్రి వర్గాలు పేర్కొన్నాయి. కానీ 30వ తేదీన ఔట్ పేషంట్ వార్డులో చేర్చినట్టు పోలీసులు చెబుతున్నారు. దీనిపై గాంధీ ఆస్పత్రిని వివరణ కోరగా స్పందించేందుకు యజమాన్యం నిరాకరించింది. దీంతో నరేందర్ సింగ్ మృతి మిస్టరీగా మారింది. అతను ఎప్పుడు, ఎలా చనిపోయారనే ప్రశ్నలు సశేషంగా మిగిలాయి.