స్వగ్రామానికి శరత్ మృతదేహం: పేరెంట్స్, బంధువులు, మిత్రులు కన్నీరుమున్నీరు
వరంగల్: అమెరికాలో ఉన్మాది కాల్పుల్లో మృతి చెందిన వరంగల్ విద్యార్థి శరత్ మృతదేహం వరంగల్లోని కరీమాబాద్ చేరుకుంది. కాసేపట్లో అంత్యక్రియలు నిర్వహించనున్నారు. విగతజీవిగా మారిన కొడుకును చూసి తల్లిదండ్రులు, బంధువులు కన్నీరుమున్నీరు అయ్యారు. శరత్ను చూసి స్నేహితులు, చుట్టుపక్కల వారు కంటతడి పెట్టారు. అక్కడ విషాదఛాయలు అలుముకున్నాయి.
Recommended Video
చోరీకి వచ్చి శరత్ను కాల్చాడు, ఫ్యామిలీ కన్నీరుమున్నీరు: ఫ్యామిలీకి కేటీఆర్ పరామర్శ
బుధవారం రాత్రి శరత్ మృతదేహం అమెరికా నుంచి శంషాబాద్ విమానాశ్రయంకు చేరుకున్న తర్వాత కుటుంబ సభ్యులకు అప్పగించారు. శరత్కు రాజకీయ నాయకులు నివాళులు అర్పించారు. ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహరి, వరంగల్ రూరల్ కలెక్టర్ హరిత తదితరులు శరత్ కుటుంబాన్ని పరామర్శించారు.
శరత్ మృతదేహం బుధవారం రాత్రి పదిన్నర గంటల సమయంలో శంషాబాద్ విమానాశ్రయానికి చేరుకుంది. తెలంగాణ ప్రభుత్వం తరఫున ఎమ్మెల్యే ప్రకాశ్ గౌడ్, ఎమ్మెల్సీలు శంభీపూర్ రాజు, నరేందర్ రెడ్డి విమానాశ్రయానికి చేరుకుని శరత్ భౌతికకాయానికి నివాళులర్పించారు. ఘటన జరిగిన నాటి నుంచి కేంద్రంతో సంప్రదింపులు జరుపుతూ శరత్ మృతదేహాన్ని త్వరగా తీసుకొచ్చేందుకు కృషి చేసిన ఎంపీ బండారు దత్తాత్రేయ అక్కడకు చేరుకుని శ్రద్ధాంజలి ఘటించారు.
విదేశాల్లోని తెలుగువారి భద్రతపై కేంద్రం చర్యలు తీసుకుంటుందని, ఈ మేరకు విదేశాంగ మంత్రి సుష్మాస్వరాజ్ హామీ ఇచ్చారని చెప్పారు. శరత్ బంధువులు, వివిధ పార్టీల నేతలు నివాళులర్పించిన తర్వాత భౌతికకాయాన్ని వరంగల్ తరలించారు.