ఆయుత చండీయాగంపై రేవంత్ రెడ్డి వ్యాఖ్య, కేసు పెట్టాలని లాయర్లు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు లోకకల్యాణార్థం నిర్వహించిన ఆయుత చండీయాగం పైన విమర్శలు చేసిన తెలుగుదేశం పార్టీ శాసన సభ్యుడు రేవంత్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలని తెలంగాణ లాయర్ల జేఏసీ పోలీసులకు సోమవారం నాడు ఫిర్యాదు చేసింది.
కెసిఆర్ లోకకల్యాణం కోసం ఆయుత చండీయాగం నిర్వహించారని, అలాంటి కెసిఆర్ పైన రేవంత్ విమర్శలు సరికాదని వారు అన్నారు. వంద ఎలుకలను తిన్న పిల్లి యాత్రలకు వెళ్లినట్లు కెసిఆర్ యాగం నిర్వహిస్తున్నారని రేవంత్ రెడ్డి అన్నారని మండిపడ్డారు.
కెసిఆర్ నిర్వహించిన చండీయాగం పైన విమర్శలు చేయడం ద్వారా రేవంత్ రెడ్డి ఓ వర్గాన్ని కించపరిచారని వారు అందులో పేర్కొన్నారు. కెసిఆర్ నిర్వహించిన యాగం పైన రేవంత్ రెడ్డి ఈ నెల 26వ తేదీన విమర్శలు చేశారని చెప్పారు.
రేవంత్ రెడ్డి పైన కేసు నమోదు చేయాలని వారు బంజారాహిల్స్ పోలీసు స్టేషన్లో ఫిర్యాదు చేశారు. అతని పైన సెక్షన్ 295ఏ తదితరాల కింద కేసు నమోదు చేయాలన్నారు. దీని పైన తాము లీగల్ ఒపీనియన్ తీసుకుంటామని పోలీసులు చెప్పారు.