ఇదేం స్వేచ్ఛ, మాలో ఐక్యతను పెంచింది: కంచ ఐలయ్యకు రోశయ్య వార్నింగ్
తాను రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకంపై ఆర్యవైశ్యులు నానా హడావుడి చేస్తున్నారని, నన్ను చంపుతానని బెదిరిస్తున్నారని రచయిత కంచ ఐలయ్య ఆదివారం అన్నారు. తనకు ఏమైనా వారే బాధ్యులన్నారు.
హైదరాబాద్/మచిలీపట్నం: తాను రాసిన సామాజిక స్మగ్లర్లు కోమటోళ్లు పుస్తకంపై ఆర్యవైశ్యులు నానా హడావుడి చేస్తున్నారని, నన్ను చంపుతానని బెదిరిస్తున్నారని రచయిత కంచ ఐలయ్య ఆదివారం అన్నారు. తనకు ఏమైనా వారే బాధ్యులన్నారు.
డేరాబాబా కంటే దేశద్రోహి: టిజి, కవిత, అధినేతలకు షాక్.. కంచ ఐలయ్యపై ఒక్కటైన టిడిపి-వైసిపి!
చేతగాని వాళ్లుగా భావించొద్దు
కంచ ఐలయ్య వ్యాఖ్యలపై తమిళనాడు మాజీ గవర్నర్, సమైక్య ఏపీ మాజీ సీఎం కొణిజేటి రోశయ్య తవ్రంగా స్పందించారు. ఆర్యవైశ్యులు చేతకాని వారిగా భావించవద్దని హెచ్చరించారు. ఓ కులాన్ని ఉద్దేశించి అనుచిత వ్యాఖ్యలు చేయడమే కాకుండా, సమర్థించుకోవడం గర్హణీయమన్నారు.
కంచ ఐలయ్య పుస్తకంపై ఖండన
వైశ్యులను ఉద్దేశించి కంచ ఐలయ్య తన పుస్తకంలో రాసిన వ్యాఖ్యలను ఖండిస్తున్నట్లు రోశయ్య చెప్పారు. విజయవాడ, మచిలీపట్నంలలో నిర్వహించిన ఉపకార వేతన పంపిణీ కార్యాక్రమాల్లో ఆయన ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా మాట్లాడారు.
ఇదేం భావప్రకటనా స్వేచ్ఛ
భావ ప్రకటన స్వేచ్ఛ పేరుతో వ్యక్తిగత భావాలను కులాలకు ఆపాదించడం సహేతుకం కాదని రోశయ్య అన్నారు. మాటల వల్ల వ్యవహారాన్ని భ్రస్టు పట్టించడం ఎందుకని భావించి, తాము జాగ్రత్తగా మాట్లాడితే చేతకానితనంగా అనుకోవడం సరికాదని చెప్పారు. అలా ఎవరైనా వ్యవహరిస్తే మంచిది కాదనే విషయాన్ని గ్రహించాలన్నారు.
వైశ్యుల్లో ఐక్యతను మరింత పెంచింది
కంచ ఐలయ్య వైశ్యులపై రాసిన వివాదాస్పద పుస్తకం, వ్యాఖ్యలు ఉభయ రాష్ట్రాల్లో ఉన్న వైశ్యుల ఆగ్రహాన్ని చవిచూడటంతో పాటు వారిలో ఐక్యతను మరింతగా పెంచాయని రోశయ్య అన్నారు. ఎవరి మీదనైనా కోపతాపాలు ఉంటే వ్యక్తిగత విమర్శలు చేయాలే తప్ప ఒక సామాజిక వర్గాన్ని టార్గెట్ చేసి అనుచిత వ్యాఖ్యలు చేయడం ఐలయ్య వంటి వారికి తగదన్నారు.
కంచ ఐలయ్య మారుతారని భావించా
ఆర్యవైశ్యుల మనోభావాలను దెబ్బతిసేలా పుస్తకం రాయటంతో పాటు కించపర్చేలా వ్యాఖ్యలు చేసిన ఐలయ్య ధోరణి మార్చుకుంటారని తాను వేచి చూశానని రోశయ్య అన్నారు. కానీ ఆయన ధోరణిలో మార్పు రాకపోవడం బాధాకరమన్నారు. ఇప్పటివరకు ఐలయ్య వర్సెస్ వైశ్యులుగా ఉన్న వివాదం నేడు కులాల మధ్య అంతరాన్ని పెంచేలా మారిందని ఆందోళన వ్యక్తం చేశారు.
అందరూ ఖండిస్తున్నారు
ఐలయ్య వ్యాఖ్యలను ఉభయ తెలుగు రాష్ట్రాల వైశ్యులతో పాటు తమిళనాడు, కర్ణాటకలోని వైశ్యులు సైతం తీవ్రంగా ఖండిస్తున్నారని రోశయ్య అన్నారు. వైశ్యులపై చేసిన వ్యాఖ్యలను ఉపసంహరించుకుని హుందాతనాన్ని కాపాడుకోవాలని తాను ఓ స్నేహితునిగా ఐలయ్యకు విజ్ఞప్తి చేస్తున్నానని హితవు పలికారు. ఐలయ్య తీరు సరిగా లేదని ఏపీ ఆర్యవైశ్య మహాసభ అధ్యక్షులు వెంకటేశ్వర్లు అన్నారు. ఓ సామాజిక వర్గాన్ని కించపరిచేలా పుస్తకం రాసే హక్కు ఆయనకు ఎవరిచ్చారని ప్రశ్నించారు. ఐలయ్య బహిరంగ క్షమాపణ చెప్పాలని, లేదంటే భారత్ బందుకు పిలుపునిస్తామని హెచ్చరించారు.