తెలంగాణలో తిరగబెడుతున్న పాత రోగం.. కరోనాతో చచ్చినా సరే.. అదే కావాలంటున్నారు..
అసలే మత్తుకు అలవాటైన ప్రాణాలు.. ఆపై 21 రోజుల లాక్ డౌన్.. ఎటూ కదలక ఇంట్లో కూర్చొంటే డీ-ఎడిక్షన్ సెంటర్లో కూర్చొన్నట్టే భావిస్తున్నారు. పోలీసులు తన్నినా సరే.. రోడ్ల పైకి వెళ్లి కల్లు దుకాణాల ముందు బారులు తీరుతున్నారు. కరోనా సంగతి దేవుడెరుగు.. రోజుకు గుక్కెడు మత్తు కల్లు లేకపోతే ప్రాణం బేజారు అని వాపోతున్నారు. రెక్కాడితే గానీ డొక్కాడనీ కుటుంబాలు ఇలా మాయదారి కల్లుకు చిన్నాభిన్నం అవుతున్నాయి. కరోనా ఎఫెక్ట్తో రోగం తిరగబెట్టడంతో ఆ కుటుంబాలకు కొత్త టెన్షన్ పట్టుకుంది.
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాలో
ఉమ్మడి నిజామాబాద్ జిల్లాల్లో మత్తు కల్లుకు డిమాండ్ ఎక్కువ. బోధన్,ఆర్మూర్,దోమకొండ, బీబీపేట్, రాజంపేట్, మాచారెడ్డి,భిక్కనూరు,రేంజర్ల,బిర్కూర్ సహా తదితర గ్రామాల్లో కల్లుబట్టీలు ఉన్నాయి. అయితే ఇక్కడ సప్లై చేసేది చెట్టు నుంచి దించిన కల్లు కాదు, కల్తీ కల్లు. రసాయనాలు కలిపి తయారుచేసే ఈ కల్తీ కల్లుకు బానిసలైనవారు కోకొల్లలు. నిత్యం చుక్క పడనిదే వీళ్లకు రోజు గడవదు. లేదంటే పరిస్థితి ఆగామాగమే. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి ఘటనలు బయటపడ్డాయి. కల్లుబట్టీలు బంద్ చేసినప్పుడల్లా జనం మానసిక రోగుల్లా కల్లు కోసం తపించేవారు. శరీరం వణికిపోయేది.. కొంతమంది నిలబడ్డ చోటే కూలిపోయేవారు. ఆసుపత్రులకు తీసుకెళ్లి చికిత్స చేయించినా సరే.. తిరిగొచ్చాక మళ్లీ మత్తు కల్లే కావాలంటారు.
కల్లుబట్టీల వద్ద గుమిగూడి..
తాజాగా లాక్ డౌన్ నేపథ్యంలో మరోసారి అదే పరిస్థితి ఎదురైంది. రోగం మళ్లీ తిరగబెట్టింది. 21 రోజుల పాటు సుదీర్ఘంగా ఇంట్లోనే ఉండాల్సిన పరిస్థితి రావడంతో మత్తు బానిసలకు కాళ్లు,చేతులు ఆడటం లేదు. ఇంట్లోనే ఉన్నా.. డీఎడిక్షన్ సెంటర్లో ఉన్నట్టుగా భావిస్తున్నారు. దీంతో కరోనాతో ప్రాణం పోయినా సరే.. కల్లు కావాలంటూ కల్లుబట్టీల వద్దకు వస్తున్నారు. కల్లు ప్రియులంతా పెద్ద సంఖ్యలో అక్కడ గుమిగూడుతుండటంతో ప్రభుత్వం విధించిన లాక్ డౌన్ ఆదేశాలకు భంగం కలుగుతోంది. పైగా ఎవరూ మాస్కులు ధరించడం గానీ,సోషల్ డిస్టెన్స్ గానీ పాటించడం లేదు. పోలీసులు రంగంలోకి దిగి చెదరగొట్టే ప్రయత్నం చేసినా.. కల్లే తమకు శరణ్యం అంటున్నారు. రేంజర్ల గ్రామంలో ఈ పరిస్థితిని అదుపు చేసేందుకు స్వయంగా సర్పంచే కల్లు దుకాణం ఓపెన్ చేయించి కల్లు ప్రియులకు సీసా కల్లును ప్యాకెట్లలో పంపిణీ చేసినట్టు తెలుస్తోంది.
తెరవాలంటున్న మహిళలు
తమ ఇళ్లల్లో కల్లుకు బానిసలైన మగవాళ్లు లాక్ డౌన్ కారణంగా తల్లడిల్లుతున్నారని అక్కడి మహిళలు చెబుతున్నారు. పిచ్చి పట్టినట్టుగా ప్రవర్తిస్తూ చెట్లెక్కడం,పుట్టలెక్కడం చేస్తున్నారన్నారు. కూరగాయాలు అమ్ముకునే,కూలీ నాలీ చేసుకునే తాము.. వాళ్లనే గమనిస్తూ కూర్చొంటే రోజు గడవదని అంటున్నారు. కాబట్టి ప్రభుత్వమే ప్రతీ రోజూ ఉదయం ఒక రెండు గంటలు,సాయంత్రం ఒక రెండు గంటలు కల్లు దుకాణాలు ఓపెన్ చేయాలని డిమాండ్ చేస్తున్నారు. ప్రపంచమంతా కరోనా భయానికి బెంబేలెత్తుతున్న వేళ.. ఇక్కడి మహిళల డిమాండ్ను అమాయకత్వం అనుకోవాలో.. లేక అక్కడి మగవాళ్లను అలా కల్లుకు బానిసలయ్యేలా చేసిన ప్రభుత్వాలనే నిందించాలో తెలియని పరిస్థితి నెలకొంది.
ఎవరిది తప్పు..
సాధారణంగా తాటిచెట్లు,ఈత చెట్ల నుంచి తీసే కల్లుకు బట్టీల్లో అమ్మే సీసా కల్లుకు చాలా తేడా ఉంటుంది. ఇక్కడే విక్రయించే కల్లులో కల్లులో డైజోఫామ్, క్లోరోఫామ్, ఆల్ఫడాజో లాంటి రసాయన పదార్థాలను కలుపుతారు. దాంతో అది సేవించినవారికి తీవ్రమైన మత్తు ఎక్కుతుంది. ఒక్కసారి దానికి అలవాటుపడ్డారంటే చాలామంది బానిసలైపోతారు. అలా ఆ అలవాటు మానుకోలేక.. ఒక్కసారిగా మానేస్తే మానసికంగా విపరీత పరిణామాలకు దారితీసి అల్లాడుతుంటారు. ఇప్పుడు నిజామాబాద్ జిల్లాలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. మరి,అధికారులు,ప్రభుత్వం దీనిపై ఎలా స్పందిస్తుందో వేచి చూడాలి.