వంద సందేహాలకు ఒక్క సమాధానం చెప్పిన ఇద్దరు చంద్రులు..!!
ఒక్క జవాబు తో వంద ప్రశ్నలను తిప్పికొట్టాయి ఆ రెండు పార్టీలు. రెండు తెలుగు రాష్ట్రాల్లో ఏ పార్టీ ఏ గట్టున నిలుస్తుంది అన్న ప్రశ్నలకు నిన్నటి వరకు సమాధానం దొరకని చిక్కుప్రశ్నలా ఉండేది. కాని రాజ్యసభ డిప్మూటీ ఛైర్మన్ ఎన్నిక తెలుగు రాష్ట్రాల భవిష్యత్ ప్రస్థానాన్ని తేటతెల్లం చేసింది. జాతీయ పార్టీలైన బీజెపి, కాంగ్రెస్ లతో తెలగు రాష్ట్రాల అదికార పార్టీలు ఏ విధంగా, ఎవరితో జట్టు కడతాయన్న సందేహాలకు సమాధానం ఇచ్చేసాయి. ఇక జాతీయ పార్టీలతో జట్టుకట్టి, 2019ఎన్నికల్లో ఎందుకు ఆయా పార్టీలతో కలిసి ముందుకు వెళ్లాల్సివస్తోందో ప్రజలకు వివరించి ఓట్లు దండుకోవడమే తరువాయి. ఇంతకి రెండు తెలుగు రాష్ట్రాలు ఎవరు ఏ గట్టుకు వెళ్తున్నారో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం..!!
రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నిక..! బహిర్గతం చేసిన తెలుగు ముఖ్యమంత్రుల నైజం..!!
ఎన్నికల్లో శాశ్వత మిత్రులు గాని, శాశ్వత శత్రువులు గాని ఉండరు అనడానికి నేటి రాజకీయ పార్టీల పోకడలే పెద్ద ఉదాహరణ. ఏ ప్రాంతీయ పార్టీ ఎప్పుడు, ఎందుకు, ఎక్కడ ఏ జాతీయ పార్టీతో పొత్తు పెట్టుకుంటుందో, ఎందుకు అప్పటివరకూ మిత్రపక్షంగా ఉండి శత్రువులుగా మారిపోతారో చెప్పడం కష్టంగా మారుతోంది. తెలుగు రాష్ట్రాల విషయానికి వస్తే అదే అంశం ఇంకాస్త రసకందాయంగా తోస్తోంది. తెలంగాణ కల సాకారం చేసిన పార్టీగా కాంగ్రెస్ పార్టీని వేయి నోళ్లతో పొగిడిన గులాబీ పార్టీ సోనియా గాంధీని దేవతగా అభివర్ణించింది. ఇక విభజనతో నష్టపోకుండా ప్రత్యేక హోదా కోసం కాంగ్రేస్ తో పోరాటం చేసిన భారతీయ జనతా పార్టీని అభినందించింది తెలుగుదేశం పార్టీ. అంతే కాకుండా బీజేపితో పోత్తు పెట్టుకుని రాష్ట్రంలో, కేంద్రంలో మిత్రపక్షాలుగా అదికారాన్ని పంచుకున్నాయి. కాలక్రమంలో అవే రెండు పార్టీలు బద్ద శత్రువులుగా మారిపోయాయి.
రాజకీయాల్లో పాత మిత్రులు కొత్త శత్రువులు..! కొత్త మిత్రులు ఒకప్పటి శత్రువులే..!!
ఇక శరతులు లేకుండా తెలంగాణ ఇచ్చిన కాంగ్రెస్ పార్టీ పైన తెలంగాణ రాష్ట్ర సమితి కొద్దికాలం క్రుతజ్ఞతా భావంతో ఉన్నప్పటికి కాల క్రమేణా కాంగ్రెస్ పార్టీని కట్టగట్టి అటక మీద పెట్టినంత పని చేసింది గులాబీ పార్టీ. తాజాగా జరిగిన రాజ్యసభ డిప్యూటి ఛైర్మన్ ఎన్నికలో ఎవరికి ఏ పార్టీ దగ్గరైందో, ఎవరు ఏ పార్టీతో కలిసి ముందుకు వెళ్లారో స్పష్టత ఇచ్చేసారు. ఐతే రెండు తెలుగు రాష్ట్రాల అదికార పార్టీలు మాత్రం జాతీయ పార్టీలకు ఎందుకు మద్దత్తు తెలుపుతున్నారో, అప్పటి వరకూ మిత్రులుగా ఉన్న పార్టీలను శత్రువులుగా ఎందుకు భావించాల్సి వస్తుందో అనే అంశాన్ని మాత్రం ప్రజలకు వివరించాల్సిఉంటుంది. జాతీయ పార్టీలతో పొత్తు అంశంలో రాజకీయ ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయా? రాష్ట్ర ప్రయోజనాలు ముడిపడి ఉన్నాయా అనే విషయాన్ని ప్రజలకు సవివరంగా తెలపపాల్సిన బాద్యత రెండు తెలుగు రాష్ట్రాల్లోని అదికార పార్టీలపై ఉంది.
వచ్చే ఎన్నికల్లో దోస్తీ ఖరారు చేసిన రాజ్యసభ ఎన్నిక..
గత కొంత కాలంగా ఎన్డీయేతో విభేదిస్తున్న టీడీపీ క్రమక్రమంగా కాంగ్రెస్ కు దగ్గర అవుతూ వస్తోంది. కొద్ది రోజుల నుంచి ఏపీ ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు కాంగ్రెస్ పై ప్రశంసల వర్షం కురిపిస్తూ వస్తున్నారు. వచ్చే ఎన్నికల్లో ఆ పార్టీ తెలంగాణతో పాటు ఏపీలో కూడా కాంగ్రెస్ తో పొత్తు పెట్టుకునేందుకు రెడీ అవుతున్నట్లు రాజకీయ వర్గాల్లో జోరుగా ప్రచారం సాగుతోంది. అందుకు అనుగుణంగానే అన్నట్లు రాజ్యసభలో ఆ పార్టీ తీరు ఉంది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక పలు అంశాలపై క్లారిటీ ఇచ్చేసింది. ఈ ఎన్నిక ద్వారా ఎవరు ఎటువైపు ఉన్నారో స్పష్టంగా తేలిపోయినట్లు అయింది. ఎన్డీయే నుంచి బయటకు వచ్చిన తెలుగుదేశం పార్టీ రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నికలో కాంగ్రెస్ అభ్యర్ధి హరిప్రసాద్ కు ఓటు వేసింది.
రాజకీయ ప్రయోజనాలా..? రాష్ట్ర ప్రయోజనాలా..? వివరణ ఇవ్వాల్సిన అంసరం ఉంది.
అయితే కొద్ది రోజుల క్రితం అసలు బిజెపి, కాంగ్రెస్ కు వ్యతిరేకంగా ఫెడరల్ ఫ్రంట్ పెట్టి దేశానికి దశ..దిశా చూపిస్తానని ప్రకటించిన తెలంగాణ ముఖ్యమంత్రి కెసీఆర్ బిజెపికి దగ్గర అయినట్లు ఈ ఎన్నికతో స్పష్టంగా తేలిపోయింది. రాజ్యసభ డిప్యూటీ ఛైర్మన్ ఎన్నిక విషయంలోనూ అదే స్పష్టమైంది. ఎన్డీయే బలపర్చిన అభ్యర్ధికే టీఆర్ఎస్ సభ్యులు ఓటు వేశారు. దీంతో కెసీఆర్ ఎటువైపు ఉన్నది స్పష్టమైపోయిందనే అభిప్రాయం వ్యక్తం అవుతోంది. భవిష్యత్ రాజకీయాలకు ఇవి సంకేతాలుగా నిలిచే అవకాశం ఉందని భావిస్తున్నారు. హరివంశ్ నారాయణ్ జెడీయూ ఎంపీ అయిన అధికార ఎన్డీయే బలపర్చిన అభ్యర్ధి కావటంతో బిజెపికి మద్దతు ఇచ్చినట్లు అయింది.దీంతో తెలుగు రాష్ట్రాలకు చెందిన టీడీపీ కాంగ్రెస్ తో జట్టుకట్టగా, టీఆర్ఎస్ బిజెపితో కలసినట్లు అయింది. టీఆర్ఎస్ మద్దతు ఇఛ్చిన అభ్యర్ధి గెలవగా, టీడీపీ మద్దతు ఇఛ్చిన అభ్యర్ధి పరాజయం పాలయ్యారు. టీఆర్ఎస్, టీడిపి పార్టీలు మద్దత్తు ఇచ్చిన అభ్యర్థులు గెలిచారా,,? ఓడారా అన్న విషయం కాసేపు పక్కన పెడితే ఆయా పార్టీల భవిష్యత్ ప్రణాళికను మాత్రం రాజ్యసభ ఎన్నిక తేట తెల్లం చేసిందని చెప్పొచ్చు.