బాబు వద్ద ఇంటర్న్షిప్, సోనియా వద్ద అప్రెంటిస్, మాకు తలవంచాలని మజ్లిస్ అంటోంది: కేసీఆర్పై మోడీ
మహబూబ్ నగర్: పాలమూరు ప్రజలకు నా నమస్కారాలు అంటూ ప్రధాని నరేంద్ర మోడీ మహబూబ్ నగర్ జిల్లా బహిరంగ సభలో తెలుగులో మాట్లాడారు. నిజామాబాద్ జిల్లాలో ప్రచారం అనంతరం పాలమూరులో పాల్గొన్నారు. తెలంగాణ అమరవీరులకు నివాళులు అర్పించారు. అనంతరం మాట్లాడారు. ఇక్కడి బహిరంగ సభకు వచ్చిన వారికి తాను మొదట క్షమాపణలు చెబుతున్నానని, ఎందుకంటే సభ ప్రాంగణం చిన్నగా ఉందని చెప్పారు.
పాలమూరు అనే పేరు పాలు, పెరుగు నుంచి వచ్చిందని, ఈ రెండింటి సంగమం ఈ పేరు అని చెప్పారు. పూర్వాకాలంలో ఇక్కడ అతిథిలు వచ్చి నీళ్లు అడిగితే పాలు ఇచ్చే గొప్ప పరిస్థితి ఉండెనని చెప్పారు. అలాంటి పాలమూరు ఎందుకు వెనుకబడిందో గుర్తించాలన్నారు. ఏడు దశాబ్దాల పాటు పాలించిన వారిని అడగాల్సి ఉందన్నారు. పాలమూరు వలసప్రాంతంగా మారిందని ఆవేదన వ్యక్తం చేశారు. ఇప్పుడు మిమ్మల్ని ఎండలో నిలబెట్టానని, అందుకు బదులుగా అభివృద్ధిని చూపిస్తానన్నారు.
తెలంగాణ ఎన్నికలు: ఏ సర్వే ఏం చెబుతోంది, వారికి ఊహించని షాక్ తప్పదా?
వారిది డబ్ల్యుడబ్ల్యుఎఫ్ వంటి నకిలీ పోరాటం
తెలంగాణ ఒక్క కుటుంబం చేసిన ప్రయత్నం వల్ల రాలేదని మోడీ చెప్పారు. ఒకే కుటుంబం వల్ల తెలంగాణ వచ్చిందని చెప్పడం అబద్దమని అన్నారు. ఎంతోమంది యువత ప్రాణత్యాగం చేశారని చెప్పారు. పాలమూరు వెనుకబాటుపై కాంగ్రెస్, తెరాస, టీడీపీలను నిలదీయాలని చెప్పారు. ఈ నాలుగున్నరేళ్ల పాటు కుటుంబ పాలన సాగిందన్నారు. కాంగ్రెస్, తెరాస ఒక్కటేనని, స్వభావం ఒక్కటేనని చెప్పారు. వీరి పోరాటం డబ్ల్యుడబ్ల్యుఎఫ్ వంటి నకిలీ పోరాటం అన్నారు. ఇరు పార్టీల పాలనలో ఏమీ తేడా లేదన్నారు.
కుటుంబ వారసత్వ రాజకీయాలను అంతం చేయాలి
టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండు పార్టీలు కూడా కుల రాజకీయాలు చేస్తాయని, ఓటు బ్యాంకు రాజకీయాలు చేస్తున్నాయని మోడీ అన్నారు. రెండు పార్టీల తీరు అన్నకు, తమ్ముడికి మధ్య ఉన్న పోరులా కనిపిస్తోందన్నారు. తెలంగాణను నాలుగున్నరేళ్లుగా ఓ కుటుంబం కబ్జా చేసిందన్నారు. కేంద్రంలో ఓ కుటుంబం నాలుగైదు దశాబ్దాలుగా పాలన చేస్తే, ఇప్పుడు తెలంగాణలో ఓ కుటుంబం చేతిలో బందీ అయిందని ఆరోపించారు. కుటుంబ వారసత్వ రాజకీయాలను అంతే చేయాలి.
మాకు తలవంచాలని మజ్లిస్ చెబుతోంది
అధికారంలో ఎవరు ఉన్నా తమకు తల వంచాల్సిందేనని మజ్లిస్ పార్టీ చెబుతోందని నరేంద్ర మోడీ అన్నారు. ఇటీవల అక్బరుద్దీన్ ఓవైసీ మాట్లాడాతూ.. వైయస్ రాజశేఖర రెడ్డి అయినా, కేసీఆర్ అయినా తమ వద్దకు రావాల్సిందేనని సంచలన వ్యాఖ్యలు చేశారు. దీనిని ఉద్దేశించి మోడీ మాట్లాడారు. ఓటు బ్యాంకు కోసమే తెరాస ముస్లీం రిజర్వేషన్లు అంటోందని చెప్పారు. తెలంగాణలో అభివృద్ధిని మరచి కుల రాజకీయాలు తెచ్చారని చెప్పారు. మజ్లిస్ నేతలు భారత్ మాతాకీ జై అనే నినాదాలు కూడా ఇవ్వనని చెబుతున్నారని మండిపడ్డారు.
సోనియాకు చెంచాగిరి చేసే వ్యక్తి మీకు ఏమైనా చేస్తారా?
ఎవరికీ తలవంచని నేతలు మీకు కావాలా వద్దా చెప్పాలని మోడీ ప్రశ్నించారు. తెలంగాణ సీఎం కేసీఆర్ అప్పుడు చంద్రబాబు వద్ద, ఆ తర్వాత సోనియా గాంధీ వద్ద అప్రెంటీస్గా చేస్తున్నాడని ఎద్దేవా చేశారు. కేసీఆర్, చంద్రబాబు వద్ద కేసీఆర్ పని చేశారని చెప్పారు. చంద్రబాబు వద్ద ఇంటర్న్షిప్ చేసి, సోనియా వద్ద అప్రెంటిస్ చేస్తున్నారన్నారు. అలానే పాలిస్తున్నారని చెప్పారు. చెంచాగిరి చేసే వ్యక్తి తెలంగాణకు ఏమైనా చేస్తాడా అని ప్రశ్నించారు. తెలంగాణలో అభివృద్ధిని మరిచి కుల రాజకీయాలు తెచ్చారని చెప్పారు. గత అయిదేళ్లుగా తెలంగాణ ప్రజల ఆకాంక్షలు నెరవేరాయా అని నిలదీశారు. తెలంగాణ యువకుల ఆకాంక్షలు నెరవేర్చేందుకు బీజేపీ కృషి చేస్తుందని చెప్పారు.
కాంగ్రెస్ పార్టీని వదలొద్దు
తెలంగాణలో ఒక్క కాంగ్రెస్ అభ్యర్థిని గెలవనీయవద్దని మోడీ చెప్పారు. బలిదానాలు తీసుకున్న కాంగ్రెస్ పార్టీకి డిపాజిట్లు దక్కవద్దని చెప్పారు. కాంగ్రెస్ పార్టీ రాష్ట్ర విభజన చేస్తే ఇప్పటికీ తగవులు ఆగలేదని చెప్పారు. జనం మీద బుల్లెట్లు పేల్చిన కాంగ్రెస్ పార్టీని వదలకూడదని చెప్పారు. ఇలాంటి వాళ్లను ఇంటికి పంపాల్సిన అవసరం ఉందని చెప్పారు. కాంగ్రెస్ రెండు రాష్ట్రాల మధ్య విద్వేషాలు రగిలించిందని చెప్పారు.
తెలంగాణ, ఏపీ అభివృద్ధికి కట్టుబడి ఉన్నాం
తెలంగాణ అభివృద్ధికి కేంద్రం కట్టుబడి ఉందని మోడీ చెప్పారు. అభివృద్ధికి అవసరమైన అన్ని వసతులు కల్పిస్తున్నామని చెప్పారు. తెలంగాణ, ఏపీ అభివృద్ధికి అవసరమైన అన్ని నిధులను మంజూరు చేస్తున్నామని చెప్పారు. తెలంగాణలో జాతీయ రహదారులు, రైలు మార్గాల ఏర్పాటుకు కేంద్రం కట్టుబడి ఉందని చెప్పారు. రోడ్డు, రైలుకు సంబంధించి 20కి పైగా ప్రాజెక్టులు ప్రస్తుతం రాష్ట్రంలో కొనసాగుతున్నాయని చెప్పారు. మౌలిక వసతులకు సంబంధించి 40 ప్రాజెక్టులు కొనసాగుతున్నాయని చెప్పారు. ఈ పనులకు కేంద్రం రూ.30వేల కోట్ల నిధులు అందిస్తోందన్నారు.
పటేల్ విగ్రహాన్ని సందర్శించండి
డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణంపై కేసీఆర్ ప్రభుత్వం ఎంత వరకు నెరవేర్చిందని మోడీ ప్రశ్నించారు. 2022 నాటికి ప్రతి ఒక్కరికి ఇండ్లు కట్టిస్తామని చెప్పారు. సబ్ కా సాత్, సబ్ కా వికాస్ అనే నినాదాన్ని బీజేపీ నమ్ముతోందని చెప్పారు. రైతుల సంక్షేమం గురించి మాట్లాడే అర్హత కాంగ్రెస్, తెరాసకు లేదన్నారు. ఈ దుస్థితికి వారే కారణమని చెప్పారు. మన తొలి ప్రధాని సర్దార్ వల్లభాయ్ పటేల్ అయి ఉంటే రైతులకు ఈ దుర్గతి పట్టేది కాదన్నారు. ఆనాడు సర్దార్ పటేల్ వల్ల తెలంగాణ విముక్తం అయిందని చెప్పారు. పటేల్ యోగధానం వల్లనే మనం భారత్ మాతాకీ జై అనే నినాదం ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. సర్దార్ పటేల్ పట్ల దేశవ్యాప్తంగా ప్రజల్లో ఆదరణ, ప్రేమ ఉన్నాయని చెప్పారు. వీలు చిక్కినప్పుడల్లా గుజరాత్లోని పటేల్ విగ్రహాన్ని సందర్శించి నివాళులు అర్పించాలని సూచించారు.