భూమా అఖిలప్రియ నో బెయిల్: ఆ ఒక్క అవకాశానికి కోర్టు ఓకే: సెషన్స్ కోర్టుకు వెళ్లేలా
హైదరాబాద్: తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి భూమా అఖిలప్రియకు మళ్లీ చుక్కెదురైంది. ఆమెకు బెయిల్ ఇవ్వడానికి సికింద్రాబాద్ న్యాయస్థానం నిరాకరించింది. ఆమె దాఖలు చేసుకున్న బెయిల్ పిటీషన్ను కొట్టివేసింది. నాంపల్లి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటీషన్ను దాఖలు చేయడానికి అవకాశం కల్పించింది. బెయిల్ కోసం సెషన్స్ కోర్టులో పిటీషన్ దాఖలు చేయడానికి అనుమతి ఇచ్చింది. దీనితో ఆమె తరఫు న్యాయవాది సెషన్స్ కోర్టులో బెయిల్ పిటీషన్ దాఖలు చేయనున్నట్లు తెలుస్తోంది.
బీజేపీలో ఉంటేనే హిందువులుగా గుర్తిస్తారా?: వైఎస్ జగన్లో మోడీ తరహా నాయకత్వం: మంత్రి అవంతి
రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం సృష్టించిన బోయిన్పల్లి కిడ్నాప్ ఉదంతంలో భూమా అఖిలప్రియ ప్రధాన నిందితురాలిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్నారు. ప్రస్తుతం పోలీసుల అదుపులో ఉన్నారు. అనారోగ్య కారణాలను చూపుతూ..తనకు బెయిల్ మంజూరు చేయాలంటూ ఆమె దాఖలు చేసిన పిటీషన్పై శనివారం విచారణ చేపట్టిన సికింద్రాబాద్ న్యాయస్థానం సోమవారం నాటికి వాయిదా వేసిన విషయం తెలిసిందే.
తాజాగా- ఈ ఉదయం అఖిలప్రియ బెయిల్ పిటిషన్పై ఆమె తరఫు న్యాయవాదితో పాటు కౌంటర్ పిటీషన్ను దాఖలు చేసిన పోలీసుల వాదనలను న్యాయస్థానం ఆలకించింది. అఖిలప్రియ అనారోగ్యంతో బాధపడుతున్నారని, ఆమెకు బెయిల్ మంజూరు చేయాలంటూ అడ్వొకేట్ అభ్యర్థించారు. అఖిలప్రియ రాజకీయంగా పలుకుబడి ఉన్న నాయకురాలు కావడం వల్ల బెయిల్ ఇస్తే.. సాక్ష్యాధారాలను ప్రభావితం చేయగలరని పోలీసుల తరఫు న్యాయవాది వాదించారు.
ఈ కేసులో మరింత లోతుగా విచారణ చేపట్టాల్సి ఉందని పేర్కొన్నారు. అఖిల ప్రియ భర్త భార్గవ్ రామ్ అజ్ఙాతంలోనే ఉన్నారని, ఆయన గురించి ఆరా తీయాల్సిన అవసరం ఉందని చెప్పారు. కొత్తగా మరో 15 మందిని అరెస్ట్ చేసినందున.. కేసు తీవ్రత మరింత పెరిగినట్టయిందని, ఈ సమయంలో ఆమెకు బెయిల్ ఇవ్వడం సరికాదని అన్నారు. పోలీసుల తరఫు న్యాయవాది వాదనలతో ఏకీభవించిన సికింద్రాబాద్ కోర్టు.. బెయిల్ ఇవ్వడానికి నిరాకరించింది. అదే సమయంలో నాంపల్లి సెషన్స్ కోర్టులో బెయిల్ పిటీషన్ను దాఖలు చేసుకోవచ్చని తెలిపింది.