బోయిన్పల్లి కిడ్నాప్ కేసు : అఖిల సోదరుడి ప్రమేయం...? ఆ హీరో సినిమా స్పూర్తితో...?
రాష్ట్రంలో సంచలనం రేకెత్తించిన బోయినపల్లి కిడ్నాప్ కేసులో ఏ1 నిందితురాలైన మాజీ మంత్రి అఖిలప్రియ సోదరుడు జగత్ విఖ్యాత రెడ్డి ప్రమేయం కూడా ఉన్నట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. కిడ్నాప్ ప్లాన్ను అమలు చేయడానికి ముందు జగత్ విఖ్యాత రెడ్డి కూడా కిడ్నాపర్లతో మాట్లాడినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. ప్రస్తుతం జగత్ విఖ్యాత రెడ్డి కారు డ్రైవర్ పోలీసుల అదుపులోనే ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఒకసారి జగత్ విఖ్యాత రెడ్డిని విచారించిన పోలీసులు.. అతని డ్రైవర్ చెప్పిన ఆధారాలతో మరోసారి విచారించే అవకాశం కనిపిస్తోంది.
ఈ కేసుకు సంబంధించి మంగళవారం(జనవరి 12) గోవాలో హైదరాబాద్ పోలీసులు నలుగురు నిందితులను అరెస్ట్ చేశారు. ప్రస్తుతం వీరిని హైదరాబాద్ తరలిస్తున్నారు. కేసులో కీలక నిందితులుగా భావిస్తున్న భార్గవ్ రామ్,గుంటూరు శ్రీనుల ఆచూకీ మాత్రం ఇంకా దొరకలేదు. ప్రస్తుతం ఈ ఇద్దరి కోసం పోలీసులు విస్తృతంగా గాలిస్తున్నారు.
మరోవైపు ఏ1 అఖిలప్రియను మంగళవారం రెండో రోజు విచారించినట్లు డీసీపీ వెల్లడించారు. ఆమె ఆరోగ్య పరిస్థితి బాగానే ఉందని చెప్పారు. నిందితుల సెల్ టవర్ లొకేషన్, కాల్ డేటా తదితర వివరాలపై పోలీసులు అఖిలప్రియను ప్రశ్నించినట్లు తెలుస్తోంది. ఇందులో కొన్నింటికి మాత్రమే సమాధానమిచ్చిన అఖిలప్రియ... మిగతావాటికి సమాధానం దాటవేసినట్లు తెలుస్తోంది.
ప్రవీణ్ రావు సోదరుల కిడ్నాప్ కోసం కిడ్నాపర్లకు బాలీవుడ్ హీరో అక్షయ్ కుమార్ సినిమాను అఖిలప్రియ,ఆమె గ్యాంగ్ రిఫర్ చేసినట్లు కథనాలు వస్తున్నాయి. నిందితుల్లో ఒకరైన భార్గవ రామ్ సోదరుడు చంద్రహాస్ ఈ విషయంలో కిడ్నాపర్లకు ట్రైనింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. ఆ సినిమాలో ని సన్నివేశాలను చూపించి... అలాగే నటించాల్సిందిగా కిడ్నాపర్లకు చంద్రహాస్ సూచించినట్లు తెలుస్తోంది. యూసుఫ్గూడలోని ఎంజీఎం స్కూల్లో చంద్రహాస్ కిడ్నాపర్లకు శిక్షణ ఇచ్చినట్లు సమాచారం. అఖిల ప్రియ ఆదేశాలకు అనుగుణంగానే ఇదంతా జరిగినట్లు తెలుస్తోంది.
ఈ కేసులో ఏ2గా ఏవీ సుబ్బారెడ్డిని, ఏ3గా అఖిలప్రియ భర్త భార్గవ్ రామ్ను చేర్చిన సంగతి తెలిసిందే. భార్గవ రామ్ పోలీసులకు దొరికితే అన్ని విషయాలు బయటకు వచ్చే అవకాశం ఉన్నది.