బిగుసుకుంటోన్న చిక్కుముడి: మొన్న భార్గవ్ రామ్..ఇప్పుడాయన కుటుంబం: అజ్ఙాతంలోకి: గాలింపు
హైదరాబాద్: రెండు తెలుగు రాష్ట్రాల్లో సంచలనం రేపిన బోయిన్పల్లి కిడ్నాప్ ఉదంతం చిక్కుముడి మరింత బిగుసుకుంటోంది. ఈ కేసులో ప్రధాన నిందితురాలిగా ఆరోపణలను ఎదుర్కొంటోన్న తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకురాలు, మాజీమంత్రి భూమా అఖిలప్రియ అరెస్టు కాగా.. ఆమె భర్త భార్గవ్ రామ్ అదృశ్యం అయ్యారు. ఒకవంక- పోలీసులు గాలింపు చర్యలను కొనసాగిస్తుండగానే.. మరోవంక భార్గవ్ రామ్ కుటుంబం అజ్ఙాతంలోకి వెళ్లినట్లు తెలుస్తోంది. ఆయన ఇంటి వద్ద పోలీసులను మోహరింపజేసినప్పటికీ.. కళ్లు గప్పి తప్పించుకున్నట్లు సమాచారం.
బోయిన్పల్లి కిడ్నాప్ వ్యవహారంలో అఖిలప్రియ అరెస్టయిన వెంటనే.. భార్గవ్ రామ్ అజ్ఙాతంలోకి వెళ్లిన విషయం తెలిసిందే. ఆయన ఆచూకీ తెలియరావట్లేదు. ఆయన కాల్ డేటా, సెల్ ఫోన్ సిగ్నళ్ల ఆధారంగా తొలుత బెంగళూరు, అనంతరం మైసూరుల్లో ఉన్నట్లు గుర్తించారు. తాజాగా మహారాష్ట్రకు వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. పుణేలో ఆయన సెల్ ఫోన్ సిగ్నల్స్ లభించినట్లు తెలుస్తోంది. రోజులు గడుస్తున్నప్పటికీ.. భార్గవ్ రామ్ ఆచూకీ తెలియకుండా పోవడంతో ఆయన తండ్రిని అదుపులోకి తీసుకోవడానికి పోలీసులు ప్రయత్నించినట్లు చెబుతున్నారు.
దీనికోసం హైదరాబాద్లో భార్గవ్ రామ్ ఇంటివద్ద స్పెషల్ టీమ్ పోలీసులను మోహరింపజేశారు. ఈ విషయం తెలుసుకున్న వెంటనే అప్రమత్తమైన భార్గవ్ రామ్ తండ్రి, ఇతర కుటుంబ సభ్యులు అజ్ఙాతంలోకి వెళ్లినట్లు చెబుతున్నారు. భార్గవ్ రామ్ ఆచూకీని తెలుసుకోవడానికి పోలీసులు తమను అరెస్ట్ చేస్తారనే భయాందోళనలకు గురి కావడం వల్లే వారు అజ్ఙాతంలోకి వెళ్లినట్లు అనుమానిస్తున్నారు. కాగా భార్గవ్ రామ్ ఎక్కడున్నాడనే విషయంపై పోలీసులకు స్పష్టత రాలేదు. తరచూ ఆయన ప్రదేశాలను మార్చుతున్నట్లు భావిస్తున్నారు.
ఇదిలావుండగా.. బోయిన్పల్లి కిడ్నాప్ వ్యవహారంలో అరెస్టయిన భూమా అఖిలప్రియకు సికింద్రాబాద్ న్యాయస్థానం బెయిల్ను మంజూరు చేయడానికి నిరాకరించింది. మూడు రోజుల పాటు కస్టడీకి అప్పగించింది. దీనిపై సికింద్రాబాద్ కోర్టు కొద్దిసేపటి కిందటే ఆదేశాలను జారీ చేసింది. భూమా అఖిలప్రియ కస్టడీ బుధవారం ముగుస్తుంది. అనంతరం మరోసారి కస్టడీ కోరుతూ పోలీసులు న్యాయస్థానాన్ని ఆశ్రయించే అవకాశాలు లేకపోలేదు. కస్టడీ ముగిసిన వెంటనే బెయిల్ మంజూరు చేయాలంటూ అఖిలప్రియ మరోసారి పిటీషన్ దాఖలు చేస్తారని అంటున్నారు.