అభయ్ కిడ్నాప్, హత్య కేసులో ట్విస్ట్: ముక్కులో పేపర్లు కుక్కి చంపారు
హైదరాబాద్: నిత్యం రద్దీగా ఉండే సికింద్రాబాద్ రైల్వే స్టేషన్కు సమీపంలో గల ఆల్ఫా హోటల్ వద్ద ఓ సూట్కేస్లో బాలుడి మృతదేహంతో లభ్యం కావడం కలకలం రేపింది. మృతుడిని 15 బాలుడు అభయ్గా గుర్తించారు. హైదరాబాదులోని పాతబస్తీలో బుధవారం అతను అపహరణకు గురయ్యాడు.
సికింద్రాబాదులోని రోడ్డుపై బుధవారం అర్ధరాత్రి గోపాలపురం పోలీస్స్టేషన్ పరిధిలో శవం ఉన్న సూట్కేసు కనిపించింది. కిడ్నాపర్లు బాలుడి చేతులు, కాళ్లు కట్టేసి, మూతికి ప్లాస్టర్ వేసి సూట్కేస్లో కుక్కారు. ఈ సూట్కేసును అర్ధరాత్రి 12 గంటల సమయంలో పెట్రోల్బంకు సమీపంలో కిడ్నాపర్లు వదిలేసి వెళ్లినట్లు భావిస్తున్నారు.
బుధవారం మధ్యాహ్నం పాతబస్తీలోని షాహినాత్గంజ్కు చెందిన అభయ్ కిడ్నాప్నకు గురయ్యాడు. రాత్రి 11 గంటలు దాటిన తర్వాత కిడ్నాపర్లు బాలుడి తండ్రి రాజ్కుమార్కు ఫోన్ చేసి ఓసారి పది కోట్లు ఇవ్వాలని, మరోసారి ఐదు కోట్లు ఇవ్వాలని డిమాండ్ చేశారు.
తండ్రి అందుకు నిరాకరించడంతో బాలుడిని చంపి మృతదేహాన్ని కాటన్ బాక్స్లో పెట్టి సికింద్రాబాదు ఆల్ఫా హోటల్ సమీపంలో వదిలి వెళ్లారు. కిడ్నాపర్లను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నించారు.
అభయ్ కిడ్నాప్, హత్య కేసులో కొత్తకోణాలు వెలుగు చూస్తున్నాయి. తెలిసివారే ఈ పని చేసి ఉంటారని భావిస్తున్నారు. ఉద్దేశ్యవూర్వకంగానే పది నిమిషాల్లో పది కోట్ల రూపాయలు కావాలని డిమాండ్ చేశారని అంటున్నారు. పోలీసులు సిసిటీవీ ఫుటేజీని పరిశీలించగా ఓ వ్యక్తి ద్విచక్రవాహనంపై అభయ్ని తీసుకుని వెళ్తున్న దృశ్యం కనిపించింది.
దాంతో తెలిసినవారే దారుణానికి ఒడిగట్టి ఉంటారని భావిస్తున్నారు. పోలీసులు సెల్ ఫోన్ను ట్రాక్ చేయడానికి ప్రయత్నించగా, దుండగులు భువనగిరి పారిపోయినట్లు తెలిసింది. దుండగులను పట్టుకోవడానికి పోలీసులు ప్రయత్నిస్తున్నారు.
ముక్కులో పేపర్లను కుక్కి ఊపిరాడకుండా చేసి అభయ్ని చంపేసినట్లు తేలింది. అభయ్ మృతదేహాన్ని పోలీసులు బంధువులకు అప్పగించారు. అతన్ని చంపేసిన తర్వాత తండ్రికి దుండగులు నల్లగొండ జిల్లా భువనగిరి నుంచి ఫోన్ చేశారు. వారు దక్షిణ్ ఎక్స్ప్రెస్ రైల్లో పారిపోయినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు.
అభయ్ని అతని తండ్రి వద్ద పనిచేసే వ్యక్తి వాహనంపై ఎక్కించుకుని వెళ్లినట్లు చెబుతున్నారు. తెలిసిన వ్యక్తి కావడంతో అభయ్ అతనితో వెళ్లినట్లు సమాచారం. హంతకుల కోసం పోలీసులు విజయవాడ సహా పలు ప్రాంతాల్లో గాలిస్తున్నారు. తండ్రికి ఫోన్ చేసి డబ్బులు అడిగిన వ్యక్తి ఫోన్ నెంబర్ ఆధారంగా కూడా దర్యాప్తు సాగుతోంది.
కిడ్నాపర్ అభయ్ తండ్రితో హిందీలో మాట్లాడాడు. ఐదు కోట్లు ఎక్కడి నుంచి తెస్తానని అభయ్ తండ్రి అన్నాడు. ఎక్కువ మాట్లాడకు, చివరి మాటగా ఐదు కోట్లు తీసుకుని రా అని కిడ్నాపర్ హెచ్చరించాడు.