‘ఈ నాన్న నాకు వద్దు’: మద్యానికి బానిసై రోజూ కొడుతున్నాడని పోలీసులకు బాలుడి ఫిర్యాదు
జమ్మికుంట: తన తండ్రి అందరు నాన్నల్లా తనతో ప్రేమగా ఉండకపోవడం, రోజూ మద్యం తాగి వచ్చి తీవ్రంగా కొడుతుండటంతో ఆ బాలుడు తీవ్ర మనో వేదనకు గురయ్యాడు. అతని బాధ పడలేక చివరకు 'ఈ నాన్న వద్దంటూ' పోలీసులను ఆశ్రయించాడు. ఈ ఘటన కరీంనగర్ జిల్లా జమ్మికుంటలో చోటు చేసుకుంది.
జమ్మికుంట నగర పంచాయతీలోని మోతుకులగూడెంకు చెందిన శ్రీనివాస్ అనే వ్యక్తి రోజూ మద్యం తాగొచ్చి ఇంట్లో గొడవ చేస్తుండేవాడు. రోజుటిలాగే శుక్రవారం కూడా పీకల దాకా మద్యం తాగి ఇంటికి వచ్చి కన్న కొడుకు శశికుమార్ను చితకబదాడు. దీంతో అతడికి తీవ్ర గాయాలయ్యాయి.
కన్నీరుమున్నీరుగా విలపించిన అతడు చివరకు జమ్మికుంట పోలీసులను ఆశ్రయించాడు. తన తండ్రి ప్రతి రోజు మద్యం తాగొచ్చి.. తనను, తన కుటుంబసభ్యులను తీవ్రంగా కొడుతున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేశాడు.
తనకు ఈ తండ్రి అవసరం లేదని తెలిపాడు. తనకు చదువుకోవాలని ఉన్నా.. తన తండ్రి తాగుడు కారణంగా చదువుకోలేకపోతున్నానంటూ పోలీసుల ముందు వాపోయాడు. తన చదువును కొనసాగించేందుకు హాస్టల్లో చేర్పించాలని జమ్మికుంట సీఐని వేడుకున్నాడు. దీంతో శ్రీనివాస్ను అదుపులోకి తీసుకున్న పోలీసులు.. అతడికి కౌన్సిలింగ్ ఇచ్చారు.