పట్టపగలే నడిరోడ్డుపై యువతిని కిరాతంగా హత్య చేసిన ప్రేమోన్మాది
హైదరాబాద్: ఆదిలాబాద్ జిల్లా భైంసాలోని భూపాల్ నగర్లో దారుణం జరిగింది. ప్రేమించలేదన్న నెపంతో యువతి గొంతుకోసి దారుణంగా హత్య చేసిన సంఘటన శనివారం చోటు చేసుకుంది. వివరాల్లోకి వెళితే.... మహేష్ అనే యువకుడు తన ఇంటికి ఎదురుగా ఉన్న సంధ్య (16) అనే బాలికను గత కొంతకాలంగా ప్రేమిస్తున్నాడు.
ఇటీవలే బాలిక తల్లిదండ్రులు ఆమెకు వేరొకరితో నిశ్చితార్ధం చేశారు. సంధ్య తనకు దక్కదని బాలికపై మరితంగా కక్ష్య పెంచుకున్న మహేష్ శనివారం సంధ్య ఇంటికి సమీపంలోని ఉన్న షాపుకు వెళ్లి తిరిగి వస్తుండగా పట్టపగలే నడిరోడ్డుపై బాలికపై దాడి చేసి కొడవలితో గొంతు కోసి హత్య చేశాడు.
ఈ ఘటనలో సంధ్య అక్కడికక్కడే ప్రాణాలను విడిచింది. అనంతరం మహేష్ అక్కడి నుంచి పరారయ్యాడు. అందరూ చూస్తుండగానే మహేష్ ఈ దాడికి పాల్పడటం కలకలం సృష్టించింది. వెంటనే గ్రామస్థలు పోలీసులకు సమాచారమిచ్చారు. సమాచారం అందుకున్న డీఎస్పీ అందెరాములు, సీఐ రఘు సంఘటనా స్థలాన్ని పరిశీలించారు.
సంధ్య మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సమీప ఆసుపత్రికి తరలించారు. కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు. పరారీలో ఉన్న నిందితుడు మహేష్ కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మట్టిపెళ్లలు పడి ఇద్దరు కూలీలు మృతి
మట్టిపెళ్లలు విరిగిపడి ఇద్దరు కూలీలు మృతి చెందిన సంఘటన ఖమ్మం జిల్లా ఇల్లందు మండలం జెకెఓసి నిర్వాసితుల కాలనీలో శనివారం చోటు చేసుకుంది. మట్టి లోడుచేసేందుకు ధనియాలపాడు తండా గ్రామానికి చెందిన ముగ్గురు వ్యక్తులు ట్రాక్టర్ తీసుకుని వెళ్లారు.
ట్రాక్టర్ ద్వారా మట్టిని తీస్తుండగా.. ఒక్కసారిగా మట్టి పెళ్లలు కూలీలపై పడటంతో ఇద్దరు అక్కడికక్కడే మృతి చెందారు. మరొకరికి తీవ్ర గాయాలు కావడంతో ప్రభుత్వ ఆసుపత్రికి తరలించారు. అక్రమంగా మట్టిని తరలిస్తున్నప్పటికీ సింగరేణి అధికారులు, సెక్యూరిటి సిబ్బంది పట్టించుకోకపోవడం వల్లనే ఈ ప్రమాదం జరిగిందని స్థానికులు ఆరోపించారు.