కాళేశ్వరం విస్తరణకు బ్రేక్.. తెలంగాణా సర్కార్ కు ఎన్జీటీ షాక్
జాతీయ గ్రీన్ ట్రిబ్యునల్ (ఎన్జిటి) తెలంగాణా ప్రభుత్వానికి షాక్ ఇచ్చింది .కాళేశ్వరంప్రాజెక్ట్ కు సంబంధించి పర్యావరణ అనుమతులలో అతిక్రమణలు జరిగినట్లుగా నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ పేర్కొంది . కేంద్ర జలవనరుల శాఖ ఆదేశాలకు అనుగుణంగా విస్తరణ పనులు చేపట్టాలని తెలిపింది. ఆదేశాలు ఇచ్చిన తర్వాతనే తదుపరి పనులు చేపట్టాలని అప్పటివరకు విస్తరణ పనులు ఆపాలని నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ ఆదేశించింది.
రాయలసీమ ఎత్తిపోతలపై ఎన్జీటీలో తెలంగాణ రీ పిటీషన్ .. విచారణకు ఎన్జీటీ గ్రీన్ సిగ్నల్
కేంద్ర పర్యావరణ శాఖ తన బాధ్యతను సరిగా నిర్వర్తించలేదన్న నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్
కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టుకు పర్యావరణ అనుమతి విషయంలో కేంద్ర పర్యావరణ శాఖ తన బాధ్యతను సరిగా నిర్వర్తించలేదని పేర్కొన్న గ్రీన్ ట్రిబ్యునల్ దీంతో నష్టం ఎంతవరకు ఉందో అంచనా వేయడానికి ఒక కమిటీని ఏర్పాటు చెయ్యాలని పేర్కొంది . నెల రోజుల్లో కమిటీ వేయాలని , ఏడుగురు సభ్యుల నిపుణుల కమిటీని ఏర్పాటు చేసి, 2008-2017 వరకు జరిగిన నష్టాన్ని పూడ్చేందుకు తీసుకోవాల్సిన చర్యలపై 6 నెలల్లో కమిటీ నివేదిక ఇవ్వాలని ఎన్జీటీ స్పష్టంచేసింది. నష్ట నివారణ , ఉపశమనం మరియు పునరావాస చర్యలను సూచించాలని గ్రీన్ ట్రిబ్యునల్ పర్యావరణ మరియు అటవీ మంత్రిత్వ శాఖలను ఆదేశించింది.
కాళేశ్వరం విస్తరణ పనులకు బ్రేక్ .. కేంద్రం ఆదేశాల మేరకే నిర్ణయాలు
ఎన్జిటి చైర్పర్సన్ జస్టిస్ ఆదర్శ్ కుమార్ గోయెల్ నేతృత్వంలోని ధర్మాసనం, పర్యావరణ క్లియరెన్స్ విషయంలో కేంద్ర పర్యావరణ శాఖ తీరును తీవ్రంగా తప్పుబట్టింది .కాళేశ్వరం ప్రాజెక్టు విస్తరణ పనులకు బ్రేక్ వేసిన నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్, ప్రాజెక్టు విస్తరణ ప్రతిపాదనలు కూడా అందజేయాలని సిడబ్ల్యుసి కి ఆదేశించింది . అపెక్స్ కౌన్సిల్ అనుమతి లేకుండా కొత్త ప్రాజెక్టులను చేపట్టవద్దని ఇప్పటికే కేంద్ర జల శక్తి శాఖ తెలంగాణ ప్రభుత్వానికి లేఖ రాయగా, కేంద్ర ప్రభుత్వం నిర్ణయం మేరకే రాష్ట్ర ప్రభుత్వం నడుచుకోవాలని స్పష్టం చేసింది జాతీయ హరిత ట్రిబ్యునల్.
నిపుణుల కమిటీ .. నష్టాన్ని అంచనా వేసేలా ఆదేశం
ప్రాజెక్టు విస్తరణకు పర్యావరణ అనుమతులు అవసరం లేదని వ్యాఖ్యానించటం సరైంది కాదని పేర్కొంది . ప్రాజెక్టు విస్తరణ వల్ల పర్యావరణం పై ప్రభావం పడుతుందని, నిపుణులతో కమిటీ వేసి నష్టాన్ని అంచనా వేయాల్సి ఉంటుందని ధర్మాసనం వ్యాఖ్యానించింది. పర్యావరణ మరియు ఇతర చట్టబద్ధమైన అనుమతులు లేకుండా ఈ పథకం నిర్మాణం ప్రారంభమైందని ఆరోపించిన తెలంగాణకు చెందిన మొహమ్మద్ హయత్తుద్దీన్ దాఖలు చేసిన పిటిషన్పై ట్రిబ్యునల్ తీర్పు ఇచ్చింది.
Recommended Video
కాళేశ్వరం ప్రాజెక్ట్ పై నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ లో పలు పిటీషన్లు .. విచారించిన ఎన్జీటీ
అటవీ పరిరక్షణ చట్టాన్ని ఉల్లంఘించి అటవీ ప్రాంతాల్లో చెట్లు నరికివేయడం, పేలుడు, సొరంగ కార్యకలాపాలు వంటి అటవీసంపదను నాశనం చేసే కార్యకలాపాలను నిషేధించాలని న్యాయవాదులు సంజయ్ ఉపాధ్యాయ మరియు సాలిక్ షఫిక్ ద్వారా దాఖలు చేసిన పిటిషన్ పై కూడా ధర్మాసనం విచారణ జరిపింది . 21,000 కోట్ల రూపాయల అంచనా వ్యయంతో ముందస్తు పర్యావరణ క్లియరెన్స్ పొందకుండా కాళేశ్వరం లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్టు విస్తరణకు టెండర్ల ప్రతిపాదన మరియు ఖరారుపై ఎన్జిటిని సంప్రదించిన తుమ్మనపల్లి శ్రీనివాస్ తో పాటు మరికొందరు మరో పిటిషన్ దాఖలు చేశారు. ఈ నేపధ్యంలో నేషనల్ గ్రీన్ ట్రిబ్యునల్ తెలంగాణా ప్రభుత్వానికి షాక్ ఇచ్చి విస్తరణా పనులకు బ్రేక్ వేసింది.