బీజేపి, టీఆర్ఎస్ పార్టీల మనీ,మద్యం రాజకీయాలకు బ్రేక్ వేయాలన్న కాంగ్రెస్.!ఈసీ కి మర్రి శశిధర్ రెడ్డి
దుబ్బాక/హైదరాబాద్ : దుబ్బాక ఉప ఎన్నిక పోలింగ్ కు సమయం సమీపించడంతో గులాబీ పార్టీతో పాటు బీజేపి పార్టీలు రెండూ అధికార దుర్వినియోగానికి పాల్పడే అవకాశాలు ఉన్నాయని తెలంగాణ కాంగ్రెస్ సందేహాలను వ్యక్తం చేస్తోంది. అధికారాన్ని అడ్డుపెట్టుకుని మనీ, మద్యాన్ని ఏరులై పారించే అవకాశాలు లేకపోలేదని అనుమానాలను కాంగ్రెస్ నేతలు వ్యక్తం చేస్తున్నారు. దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో ఉప ఎన్నికల ప్రక్రియ ప్రారంభం నుండి తెలంగాణ కాంగ్రెస్ పార్టీ అవకతవకల గురించి ఎన్నికల కమిషన్ దృష్టిని తీసుకొని వస్తున్నామని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి స్పష్టం చేసారు. మద్యం, మనీ అక్రమ పంపిణీని అడ్డుకోవాలని ఆయన ఈసీకి లేఖ రాసారు.
దుబ్బాక ఉపఎన్నిక పోలింగ్ ఏర్పాట్లు పూర్తి.!త్రిముఖ పోటీ తప్పదంటున్న విశ్లేషకులు.!
ఒక్క రాత్రిలో ఏదైనా జరగొచ్చు.. అక్రమ మద్యం, నగదు పంపిణీని అడుకోవాలంటున్న శశిధర్ రెడ్డి..
ఉప ఎన్నికకు సోమవారం చివరి రోజు కావడంతో, 146 గ్రామాలు మరియు దుబ్బాక మునిసిపాలిటీలలో భారీ మొత్తంలో అక్రమంగా నగదు మరియు మద్యం పంపిణీ చేయబడుతోందని తెలంగాణ కాంగ్రెస్ ఆరోపిస్తోంది. నగదు మరియు మద్యం పంపిణీ సోమవారం అర్ధరాత్రి వరకు కొనసాగే అవకశాలు ఉన్నాయని మాజీ మంత్రి మర్రి శశిధర్ రెడ్డి అనుమానాలను వ్యక్తం చేస్తూ దీనిపైన ప్రత్యేక దృష్టి కేంద్రీకరించాలని ఎన్నికల కమీషన్ కు ఆయన విజ్ఞప్తి చేసారు. ఓటర్లను ప్రభావితం చేయడానికి అన్ని రకాల వాహనాల కదలికలపై నిఘా విధించాలని ఆయన డిమాండ్ చేసారు. జిల్లా కలెక్టర్ బదిలీ మరియు పోలీసు పరిశీలకుల నియామకం ఉన్నప్పటికీ, నగదు మరియు మద్యం పంపిణీ నిరంతరాయంగా కొనసాగుతోందని శశిధర్ రెడ్డి ఆవేదన వ్యక్తం చేసారు.
వరద బాదితుల ఆర్ధిక సాయంలోనూ అవినీతే.. కార్పోరేటర్ల తీరుపై మండిపడ్డ దాసోజు శ్రవణ్..
ఇదిలా ఉండగా ప్రతిపక్ష కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేసినట్లు వరద బాదితులకు పరిహారం ఇవ్వలేదని ఏఐసీసీ జాతీయ అధికార ప్రతినిధి, దాసోజు శ్రవణ్ పేర్కొన్నారు. వరద బాధిత కుటుంబాలకు 10 వేలు లెక్కన ఇస్తామని చెప్పిన గులాబీ నేతలు, నగర పాలక అధికారులు అవినీతికి పాల్పడ్డారని మండిపడ్డారు. వరద బాదితులకు అందించే ఆర్థిక సాయంలో పెద్ద ఎత్తున దోపిడీ జరిగిందని శ్రవణ్ ఘాటుగా విమర్శించారు. ఒక్కో కార్పొరేటర్ సుమారు 10 లక్షల రూపాయల వరకు దండుకున్నారని ఆరోపించారు. ఇదే అంశాన్ని న్యాయస్థానం పిల్ గా స్వీకరించాలని కోరుతూ తాను పూర్తి వివరాలతో హైకోర్టు ప్రధాన న్యాయమూర్తికి లేఖ రాశానని తెలిపారు. వరద సహాయం పేరుతో జరుగుతున్న అవకతవకలపై ప్రజా ప్రయోజనాల పిటీషన్ వేసినట్టు శ్రవణ్ కుమార్ తెలిపారు.
రైతు వ్యతిరేకులుగా మోదీ, కేసీఆర్.. అందుకే సంతకాల సేకరణ అంటున్న కాంగ్రెస్..
ఇదిలా ఉండగా తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు, ప్రధాని నరేంద్ర మోదీ ఇద్దరు కూడా వ్యవసాయ, రైతు వ్యతిరేక కార్యక్రమాలకు పాల్పడుతున్నారని, లు.. ఈ విషయాలపై రైతులలో చైతన్యం తీసుకొస్తామని మాజీ మంత్రి కోదండరెడ్డి స్పష్టం చేసారు. అందుకోసం మంగళవారం నుండి 10వ తేదీ వరకు మండలానికి 2 వేల మంది రైతులతో సంతకాల సేకరణ కార్యక్రమాన్ని చేపడుతున్నామని తలిపారు.కేంద్రంలో వ్యవసాయ సంక్షేమానికి వ్యతిరేకంగా మూడు బిల్లులు తెచ్చారని, దీని వల్ల వ్యవసాయం కార్పొరేట్ శక్తుల చేతిలో కీలు బొమ్మలుగా మారే ప్రమాదం ఉందని, రైతులు వ్యాపారుల చేతిలో నష్టపోయే ప్రమాదం ఉందని, అందువల్ల ఈ బిల్లులను వ్యతిరేకిస్తూ సంతకాల సేకరణ చేయనున్నామని కోదండరెడ్డి వివరించారు.
మంగళవారం మహబూబ్ నగర్ కు మనిక్కమ్..రైతు సంతకాల సేకరణ కార్యక్రమంలో పాల్గొననున్న ఠాగూర్..
కాగా నవంబర్ మూడున మంగళవారం ఏఐసీసీ ఇంచార్జి మనిక్కమ్ ఠాగూర్ మహబూబ్ నగర్ లో జరిగే రైతు సంతకాల సేకరణ కార్యమలలో పాల్గొనబోతున్నట్టు తెలుస్తోంది. ఆయన తోపాటు ఏఐసీసీ కార్యదర్శులు వంశీచంద్ రెడ్డి, సంపత్ కుమార్, డీసీసీ కొత్వాల్ పాల్గొనబోతున్నారు. అలాగే రైతుల సంతకాల సేకరణ కార్యక్రమంలో నల్గొండలో టీపీసీసీ అధ్యక్షులు ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఎంపీ కోమటి రెడ్డివెంకట్ రెడ్డి, జానారెడ్డి, ఖమ్మంలో సీఎల్పీ నేత భట్టి విక్రమార్క, రేణుక చౌదరి, సంభాని చంద్ర శేఖర్, మల్కాజిగిరి లో ఎంపీ, టీపీసీసీ వర్కింగ్ ప్రసిడెంట్ రేవంత్ రెడ్డి, కరీంనగర్ లో పొన్నం ప్రభాకర్, జగిత్యాలలో జీవన్ రెడ్డి, సిరిసిల్లలో పొన్నాల లక్ష్మయ్య, సంగారెడ్డి లో జెట్టి కుసుమ కుమార్, ఎమ్యెల్యే జగ్గారెడ్డి, సిద్దిపేటలో దామోదర్ రాజా నర్సింహా, ములుగు లో సీతక్క, రంగారెడ్డి లో కొండా విశ్వేశ్వరరెడ్డి, జనగమలో దాసోజు శ్రవణ్, నగర్ కర్నూల్.లో మల్లు రవి, భూపాల్పల్లి లో శ్రీధర్ బాబు తదితరులు పాల్గొనబోతున్నట్టు టీపిసిసి పేర్కొంది.