బ్రేకింగ్ ... తెలంగాణా హోం మంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్... అపోలోలో చికిత్స
తెలంగాణరాష్ట్రంలోనూ కరోనా వైరస్ విజృంభిస్తోంది. తెలంగాణ రాష్ట్ర హోంమంత్రి మహమూద్అలీకి కరోనాపాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తోంది. ఇప్పటికే తెలంగాణ రాష్ట్రంలో ముగ్గురు ఎమ్మెల్యేలకు కరోనా పాజిటివ్ వచ్చిన విషయం తెలిసిందే. ఇక ఇప్పుడు తాజాగా తెలంగాణ హోం శాఖ మంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్ నమోదుకావడం తెలంగాణ మంత్రులకు టెన్షన్ పుట్టిస్తోంది.
Recommended Video
తెలంగాణలో రాజకీయ నాయకులను వెంటాడుతున్న కరోనా
తెలంగాణ రాష్ట్రంలో కరోనా వైరస్ రాజకీయ నాయకులను వెంటాడుతున్న పరిస్థితి ఆందోళనకరంగా మారింది. ఏకంగా రాష్ట్ర హోంమంత్రి మహమూద్ అలీకే కరోనా పాజిటివ్ నిర్ధారణ కావడం ఆందోళన కలిగిస్తోంది. ఇప్పటివరకు తెలంగాణ రాష్ట్రంలో జనగామ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డి, నిజామాబాద్ అర్బన్ ఎమ్మెల్యే వి గల గణేష్ గుప్తా, నిజామాబాద్ రూరల్ ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్ లకు కరోనా పాజిటివ్ నిర్ధారణ కాగా ఇక ఇప్పుడు రాష్ట్ర హోంశాఖ మంత్రికే కరోనా పాజిటివ్ వచ్చినట్లుగా తేలింది. గత కొద్ది రోజులుగా అనారోగ్యంతో ఉన్న ఆయన ఆస్తమాతో తీవ్రంగా ఇబ్బంది పడుతున్న నేపథ్యంలో ఒక ప్రైవేటు ఆసుపత్రిలో చేరి వైద్య చికిత్స పొందుతున్నారు.
హోం శాఖా మంత్రి మహమూద్ అలీకి కరోనా పాజిటివ్.. ఆస్పత్రిలో చేరిక
కొద్దిరోజులుగా హోంశాఖ మంత్రి మహమూద్ అలీకి సంబంధించిన గన్ మెన్ లకు, ఆయన వ్యక్తిగత సిబ్బందికి కరోనా పాజిటివ్ నమోదైన విషయం తెలిసిందే. ఇక ఇదే సమయంలో ప్రస్తుతం ఆయన ఆస్థమాతో ఇబ్బంది పడుతూ అపోలో ఆస్పత్రిలో చికిత్స పొందుతున్నారని సమాచారం. హోం మంత్రి మహమూద్ అలీ గత మూడు రోజులుగా అనారోగ్యంతో బాధపడుతూ ఆసుపత్రిలో చేరిన నేపథ్యంలో టెస్టులు నిర్వహించగా తాజాగా ఆయనకు కరోనా పాజిటివ్ నిర్ధారణ అయినట్లుగా తెలుస్తుంది.
కరోనా కట్టడి చర్యల పర్యవేక్షణ కోసం నేడు తెలంగాణలో కేంద్ర బృందం పర్యటన
కరోనా కేసులు పెరుగుతున్న నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా మళ్లీ లాక్ డౌన్ విధించే దిశగా ఆలోచన చేస్తున్నారు. ముఖ్యంగా చూసినట్లయితే హైదరాబాద్ లో కొద్దిరోజుల పాటు రోజుకు రెండు మూడు గంటలు మినహాయింపు ఇచ్చి 24 గంటలు లాక్ డౌన్ విధించేలా నిర్ణయం తీసుకోవాలని ఆలోచిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఇక ఇప్పటికే దీనిపై జిహెచ్ఎంసి అధికారులు కసరత్తును చేస్తున్నట్లుగా సమాచారం. రాష్ట్రంలో కరోనా కట్టడి చర్యల పర్యవేక్షణ కోసం కేంద్ర బృందం నేడు పర్యటిస్తున్నది .బి ఆర్ కే భవన్ లో ఆరోగ్య శాఖ అధికారులతో భేటీ అయ్యి కరోనా పరిస్థితిపై సమీక్షించి,ఈరోజు మధ్యాహ్నం గాంధీ ఆస్పత్రికి వెళ్లనున్నారు కేంద్ర బృందం.
విపరీతంగా కరోనా కేసులు .. లాక్ డౌన్ విధిస్తారా ?
ప్రస్తుతం తెలంగాణ రాష్ట్రంలో కరోనా కేసులు ఇబ్బడిముబ్బడిగా పెరుగుతున్నాయి. ఆదివారం ఒక్కరోజు 943 మంది కరోనా నిర్ధారణ కాగా ఇప్పటివరకు రాష్ట్రవ్యాప్తంగా కేసుల సంఖ్య 14,419కి చేరింది. ఇక కరోనాతో మరణించిన వారి సంఖ్య 247 కి పెరిగింది. ఏదేమైనా తెలంగాణ రాష్ట్రంలో కేసులు పెరుగుతున్న దృష్ట్యా సీఎం కేసీఆర్ త్వరలో కరోనా కట్టడికి మరోమారు లాక్ డౌన్ విధిస్తారు అనే చర్చ తెలంగాణ రాష్ట్రంలో జరుగుతోంది.