ట్విస్ట్లే ట్విస్ట్లు: వధువు జంప్, మరో యువతితో పెళ్ళికి ఏర్పాట్లు, పారిపోయిన వరుడు
బెంగుళూరు: పెళ్ళి సమయానికి వధూవరులు కన్పించకుండా పోయిన ఘటన ఆదివారం నాడు కర్ణాటక రాష్ట్రంలోని కోలారు జిల్లాలోని మాలూరులోని పద్మావతి కళ్యాణ మండపంలో చోటు చేసుకొంది. వధువు కన్పించకుండా పోవడంతో అదే ముహుర్తానికి వేరే అమ్మాయితో వివాహం చేయాలని అబ్బాయి తరపు బంధువులు నిర్ణయించారు. కానీ, వివాహ ముహుర్తానికి పెళ్ళి కొడుకు అదృశ్యమయ్యాడు.
అచ్చు సినిమాలో జరిగినట్టుగానే వివాహం తంతు చోటు చేసుకొంది. ప్రేమించిన ప్రియుడితో వధువు పారిపోయింది. అయితే దీనికి ప్రతిగా వధువు సోదరితో వివాహం చేయాలని నిర్ణయం తీసుకొంటే అబ్బాయి వివాహ సమయానికి లేకుండా పోయాడు.
వరుడు ఎందుకు పెళ్ళి చేసుకోకుండా వెళ్ళిపోయాడనే విషయం మాత్రం అర్ధం కావడం లేదు. వరుడు ఫోన్ కూడ స్విచ్చాఫ్ చేసి ఉంది. వివాహం చూసేందుకు వచ్చిన బంధువులు వెళ్ళిపోయారు.
పెళ్ళి సమయానికి వధువు జంప్
కర్ణాటక రాష్ట్రంలో మాలూరులో పద్మావతి కళ్యాణ మండపంలో వివాహ సమయానికి వధువు జంప్ అయింది. వివాహనికి వధువుతో పాటు వధువు కుటుంబసభ్యులు కూడ ఎవరూ రాలేదు.కర్ణాటక రాష్ట్రంలోని చన్నకల్లు గ్రామానికి చెందిన ఓ యువకుడికి బంగారుపేట తాలుకా నేర్నహళ్ళి గ్రామానికి చెందిన యువతికి వివాహం నిశ్చయమైంది. జనవరి 27న, వివాహ రిసెప్షన్ , జనవరి 28న, వివాహం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. అయితే రిసెప్షన్ సమయానికి వధువు రాకుండా జంప్ అయింది. తాను ప్రేమించిన యువకుడితో జంప్ అయిందని వరుడి కుటుంబసభ్యులు అనుమానిస్తున్నారు.
ముహుర్త సమయానికే మరో యువతితో వివాహనికి ఏర్పాట్లు
అయితే ముహుర్త సమయానికి వధువు రాకపోవడం, ఆ కుటుంబసభ్యులు కూడ ఫంక్షన్హల్ వద్దకు రాకపోవడంతో వరుడు కుటుంబసభ్యులు ఆరా తీశారు. అయితే విషయం తెలుసుకొన్న వరుడి కుటుంబసభ్యులు వధువు సమీప బంధువు కూతురితో వివాహం చేయాలని నిర్ణయం తీసుకొన్నారు. పెళ్ళి ఏర్పాట్లు మళ్ళీ చేశారు. కానీ, ఈ దఫా వరుడు ట్విస్టిచ్చాడు.
పెళ్ళి ముహుర్తానికి వరుడు జంప్
మరో యువతితో వరుడి వివాహనికి ఏర్పాట్లు చకచకా జరిగిపోయాయి. కానీ, ఆ సమయంలో షేవింగ్ చేసుకొని వస్తానని చెప్పి బయటకు వెళ్ళిన వరుడు అదృశ్యమయ్యాడు. ముహుర్త సమయం దాటిపోతున్నా వరుడి జాడ లేకుండా పోయాడు. వరుడి సెల్ఫోన్ కూడ స్విచ్చాఫ్ చేసి ఉంది.పెళ్ళి కొడుకు ఎందుకు జంప్ అయ్యాడనే విషయం మాత్రం తేలలేదు
ఇంటి ముఖం పట్టిన బంధువులు
వరుడు జంప్ కావడంతో ఏం చేయాలో తలలు పట్టుకొన్నారు కుటుంబసభ్యులు. ఎంతకీ వరుడు రాకపోవడంతో పెళ్ళి కాదని బంధవులు ఇళ్ళకు తిరిగి వెళ్ళారు. పెళ్ళి కోసం రెడీ చేసిన పిండి వంటలన్నీ ఫంక్షన్హల్లో ఉండిపోయాయి.