అన్నా-చెల్లెళ్ల మధ్య అనైతిక సంబంధం: వరుడిపై హత్యాయత్నం వెనుక విస్తుపోయే విషయం..
వరంగల్/రఘునాథ్పల్లి: మరో రెండు రోజుల్లో పెళ్లి.. ఇంతలో వరుడిపై హత్యాయత్నం?.. వధువుతో ఫోన్ కాల్ మాట్లాడుతున్న సమయంలోనే ఈ అఘాయిత్యం!.. అనేక అనుమానాలకు తావిచ్చిన ఈ ఘటనలో పోలీసులు త్వరగానే నిజాలను చేధించారు. వధువు ప్రమేయంతోనే ఈ హత్యాయత్నం జరిగినట్టుగా నిర్దారించారు. అంతేకాదు.. మరో విస్తుగొలిపే విషయం కూడా విచారణలో వెలుగుచూసింది.
పెట్రోలు పోసి నిప్పంటించారు..:
వరుడు యాకయ్య తనతో ఫోన్ కాల్ మాట్లాడుతుండగా.. సిగ్నల్ సరిగా లేదని బయటకు వచ్చి మాట్లాడాలని వధువు పదేపదే కోరింది. దీంతో యాకయ్య బయటకొచ్చి ఫోన్ మాట్లాడుతుండగానే.. మాస్కులు ధరించి బైక్స్పై వచ్చిన నలుగురు యువకులు అతనిపై పెట్రోల్ పోసి నిప్పంటించి పరారయ్యారు. వధువు పదేపదే బయటకురావాలని కోరడంతో.. ఘటనలో ఆమెపైనే అనుమానాలు వ్యక్తమయ్యాయి.చివరకు పోలీసుల విచారణలోనూ అదే తేలింది.
వధువు పైనే అనుమానం..:
పోలీసులు వధువు కాల్ డేటాను పరిశీలించడంతో పాటు ఆమెను విచారించారు. కాల్ డేటాలో యాకయ్యకు ఆమె ఏ టైమ్లో ఫోన్ చేసింది?, అంతకు ముందు ఫోన్ ఎవరితో మాట్లాడింది ? అనే వివరాలను సేకరించారు. యాకయ్య కంటే ముందు పెద్దమ్మ కొడుకుతో ఆమె మాట్లాడినట్టు గుర్తించారు. రాత్రి 11:45గం. ఐదుసార్లు ఆమె యాకయ్యకు ఫోన్ చేయడంపై వారికి అనుమానం కలిగింది. ఇదే విషయంపై గట్టిగా ప్రశ్నించారు.
అన్నా చెల్లెళ్ల మధ్య అనైతిక సంబంధం..:
పోలీసులు తమదైన శైలిలో విచారించడంతో వధువు అసలు విషయం చెప్పింది. తాను, తన పెద్దమ్మ కుమారుడు గత మూడేళ్లుగా ప్రేమించుకుంటున్నామని, పెళ్లి కూడా చేసుకోవాలనుకుంటున్నామని చెప్పింది. యాకయ్యతో పెళ్లి కుదరడంతో అతని అడ్డు తొలగించడానికే హత్యాయత్నం చేసినట్టు అంగీకరించింది.
గాంధీ ఆసుపత్రిలో బాధితుడు:
పెళ్లిపై కలలు కంటున్న తరుణంలో అనూహ్యంగా వరుడు యాకయ్యపై హత్యాయత్నం జరగడం అతని కుటుంబాన్ని తీవ్రంగా కలచివేసింది. ప్రస్తుతం అతను 50శాతం కాలిన గాయాలతో సికింద్రాబాద్ గాంధీ ఆస్పత్రిలో చికిత్సపొందుతున్నాడు.
మహిళల ఆందోళన:
అభంశుభం తెలియని యాకయ్యపై పెట్రోల్ పోసి నిప్పంటించినందుకు స్థానిక మహిళలు భగ్గమంటున్నారు. ఘటనను నిరసిస్తూ దాదాపు 50 మంది మహిళలు పోలీస్ స్టేషన్ ఎదుట బైఠాయించేందుకు ప్రయత్నించారు. కొంతమందికి పోలీసులు నచ్చజెప్పి వెనక్కి పంపించగా.. మరో 20మంది మాత్రం అక్కడే ఆందోళనకు దిగారు. నిందితులను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.