పరీక్ష రాసిన తర్వాతే పెళ్ళి,వరుడి సూచన మేరకే ఇలా....
ఓ వైపు పరీక్ష, మరో వైపు అదే సమయానికి పెళ్ళి, అయితే ఈ విషయంలో వరుడు సలహ మేరకు పరీక్ష రాసిన తర్వాతే పెళ్ళి పీటల మీద కూర్చొంది ఓ వధువు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకొంది.
కరీంనగర్:ఓ వైపు పరీక్ష, మరో వైపు అదే సమయానికి పెళ్ళి, అయితే ఈ విషయంలో వరుడు సలహ మేరకు పరీక్ష రాసిన తర్వాతే పెళ్ళి పీటల మీద కూర్చొంది ఓ వధువు. ఈ ఘటన కరీంనగర్ జిల్లాలో చోటుచేసుకొంది.
కరీంనగర్ జిల్లా చొప్పదండి మండలం ఆర్నకొండకు చెందిన తమ్మిడి లింగయ్య,రాజవ్వ దంపతుల కూతురు రమకు ,గొల్లపల్లి మండలం లింగాపూర్ కు చెందిన చెన్నాల్ల గణేష్ కు వివాహన్ని నిర్ణయించారు రెండు కుటుంబాల పెద్దలు.
గురువారం ఉదయం పదిన్నర గంటలకు వివాహ ముహుర్తంగా నిర్ణయించారు.అయితే రమ బిఎస్ సి ఫైనలియర్ చదువుతోంది.అయితే గురువారం నాడు రమ గణితం పరీక్ష రాయాల్సి ఉంది. ఉదయం 9 గంటల నుండి 12 గంటల వరకు ఈ పరీక్ష సమయం.
అయితే ఈ విషయమై రెండు కుటుంబాల పెద్దలు చర్చించారు.అయితే పెళ్ళికొడుకు సూచన మేరకు పరీక్ష రాసిన తర్వాతే వివాహం చేసుకోవాలని నిర్ణయించుకొన్నారు .
దీంతో రమ ఉదయంపూట పరీక్ష రాసి వచ్చింది. పరీక్ష హల్ నుండి తిరిగివచ్చిన తర్వాత పెళ్ళికూతురుగా ముస్తాబై పెళ్ళిపీటలపై కూర్చొంది.నిర్ణీత ముహుర్తం కంటే ఆలస్యంగా పెళ్ళి జరిగింది. అయితే పరీక్షకే తొలి ప్రాధాన్యత ఇచ్చిన పెళ్ళికొడుకును స్థానికులు అభినందించారు.