పండుగ పూట విషాదం.. అన్నాచెల్లెళ్లు మృతి...పెద్దన్నకు రాఖీ కట్టి తిరిగొస్తుండగా..
రాఖీ పండుగ రోజు వనపర్తి జిల్లాలో విషాదం చోటు చేసుకుంది. రోడ్డు ప్రమాదం రూపంలో మృత్యువు అన్నాచెల్లెళ్లను కబళించింది. పండుగ పూట సంతోషంగా గడపాల్సిన అన్నాచెల్లెళ్లు మృత్యువాత పడటంతో ఆ కుటుంబంలో విషాదం నెలకొంది.
వివరాల్లోకి వెళ్తే.. వనపర్తి జిల్లా చిన్నంబావి మండలం లక్ష్మీపల్లి గ్రామానికి చెందిన అన్నాచెల్లెళ్లు తూంకుంట దామోకర్,నందిని,లక్ష్మీ సోమవారం బైక్పై పెద్దదగడ గ్రామానికి వెళ్లారు. అక్కడ పెద్ద సోదరుడికి రాఖీ కట్టి తిరిగి వస్తుండగా వీరి బైక్ను కొల్లాపూర్ డిపోకి చెందిన ఆర్టీసీ బస్సు ఢీకొట్టింది. దీంతో దామోదర్,నందిని తీవ్రంగా గాయపడి అక్కడికక్కడే ప్రాణాలు విడిచారు. తీవ్రంగా గాయపడ్డ లక్ష్మిని పోలీసులు ఆస్పత్రిలో చేర్చారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు. ప్రమాదం గురించి తెలిసి కుటుంబ సభ్యులు బోరున విలపించినట్లు సమాచారం.
నల్గొండ జిల్లాలోనూ రాఖీ పండుగ రోజు విషాదం చోటు చేసుకుంది. అనుముల మండలం హజారి గూడెంలో ఇద్దరు అన్నాదమ్ములు దారుణ హత్యకు గురయ్యారు. ఇంటి బయట నిద్రిస్తుండగా గుర్తు తెలియని వ్యక్తులు పదునైన ఆయుధాలతో దాడి చేసి హత్య చేశారు. మృతులు జానపాటి సత్యనారాయణ,అతని సోదరుడిగా సమాచారం.మరో సోదరుడు హరిపై కూడా దాడి జరగ్గా.. అతను తప్పించుకున్నట్లు సమాచారం.
ఏడాది క్రితం హరి భార్యతో అక్రమ సంబంధం పెట్టుకున్న ఓ యువకుడు హత్యకు గురైనట్లు తెలుస్తోంది. ఆ కేసులో హరి సోదరులు జైలుకు వెళ్లి ఇటీవలే విడుదలైనట్లు సమాచారం. వచ్చిన కొద్దిరోజులకే ఇలా ఇద్దరూ హత్యకు గురవడం గమనార్హం. పోలీసులు దీనిపై కేసు నమోదు చేసుకుని దర్యాప్తు ప్రారంభించారు.