'అనాథ ఆశ్రమానికి పంపించండి.. అన్నయ్యల వద్దకు వద్దు': జగిత్యాలలో అమానవీయ ఘటన
ముగ్గురు అన్నయ్యలకు వివాహం అయింది. ఇటీవలే డిగ్రీ పూర్తి చేసిన గీత కొంతకాలం స్థానిక పాఠశాలలో టీచర్ గా పనిచేసింది.
Recommended Video
జగిత్యాల: తల్లిదండ్రులు చనిపోవడంతో.. ఆ యువతి అన్నయ్యల వద్దే ఉంటోంది. టీచర్ గా పనిచేస్తూ సొంత కాళ్ల మీదే బతుకుతోంది. అయితే కారణాలేంటో తెలియదు గానీ ఇటీవల అన్నా వదినలతో విబేధాలు ఏర్పడ్డాయి. ఆ విభేదాలు ఆమె చేతులకు తాళం వేసి నిర్బంధించేదాకా వచ్చాయి.
స్థానికుల సమాచారంతో విషయం పోలీసుల దాకా వెళ్లింది. యువతి మాత్రం తాను అన్నా వదినల వద్ద కంటే అనాథశ్రమంలోనే ఉంటానని చెబుతోంది. దీంతో ఆ యువతికి ఎదురైన కష్టాన్ని చూసి స్థానికులు కూడా చలించిపోతున్నారు.
జగిత్యాల వాణినగర్లో ఘటన
జగిత్యాల పట్టణంలోని వాణినగర్ లో ఈ ఘటన చోటు చేసుకుంది. కాలనీకి చెందిన చిట్యాల గీత తన అన్నలైన చిట్యాల నారాయణ, రమేష్, శ్రీనివాస్ల ఇంట్లో ఉంటోంది. అమ్మ-నాన్నలు చనిపోవడంతో అన్నయ్యలే ఆమె సంరక్షణను చూస్తున్నారు.
చేతులకు గొలుసులు
ముగ్గురు అన్నయ్యలకు వివాహం అయింది. ఇటీవలే డిగ్రీ పూర్తి చేసిన గీత కొంతకాలం స్థానిక పాఠశాలలో టీచర్ గా పనిచేసింది. ఆ తర్వాత ఆమె చేతులకు తాళాలు వేసి ఇంట్లోనే బంధించారు. బుధవారం ఆమె ఇంట్లో నుంచి తప్పించుకుని బయటకు రావడంతో.. విషయం వెలుగుచూసింది. ఇటీవల అన్న, వదినల వేధింపులు ఎక్కువయ్యాయని కాలనీవాసులతో వాపోయింది.
అనాథశ్రమానికి వెళ్తానని:
విషయం తెలుసుకున్న స్థానికులు ఆ ఇంటి వద్ద గుమిగూడారు. తాను ఇంటికి వెళ్లనని, అన్న వదినల వద్దకు కాకుండా అనాథ ఆశ్రమానికి వెళ్తానని, దయచేసి తనను అక్కడికే పంపించాలని కన్నీటిపర్యంతమవుతూ కాలనీవాసులను వేడుకుంది. విషయం తెలుసుకున్న స్థానిక కౌన్సిలర్ గుగ్గిల్ల హరీష్ అక్కడికి చేరుకుని వివరాలు తెలుసుకున్నారు.
గీతకు కౌన్సెలింగ్
అనంతరం పోలీసులకు ఫిర్యాదు చేయడంతో.. సీఐ ప్రకాశ్ గీత అన్న వదినలను పిలిపించి విచారించారు. గీతకు కొంతకాలంగా ఆరోగ్యం బాగాలేదని, పొరుగింటివారిపై దాడి చేసినందుకే చేతులకు తాళాలు వేశామని చెప్పారు. ప్రస్తుతం గీతకు కౌన్సెలింగ్ ఇస్తున్నట్టు తెలుస్తోంది. అనంతరం ఆమెను రీహాబిటేషన్ సెంటర్కు తరలిస్తారని తెలుస్తోంది.