అక్కతో గొడవపడుతున్నాడని సొంత బావనే పైకి పంపించిన బామ్మర్ది
హైదరాబాద్: అక్కతో గొడవ పడుతున్నాడని బావను సొంత బావమరిదే హతమార్చిన సంఘటన బాలానగర్ పరిధిలోని పోలీస్ ష్టేషన్లో చోటు చేసుకుంది. సీఐ భిక్షపతిరావు తెలిపిన వివరాల ప్రకారం.. మహారాష్ట్రకు చెందిన లక్ష్మణ్రావు(54) నగరానికి వలస వచ్చి హైదరాబాద్లో స్థిరపడ్డాడు.
కాగా, లక్ష్మణ్రావుకు ఐడీపీఎల్ కంపెనీలో పనిచేసి రిటైరయ్యారు. లక్ష్మణ్రావు మొదటి భార్యకు ఇద్దరు కుమారులు అరవింద్, అర్జున్ ఉన్నారు. కాగా మొదటి భార్య మృతి చెందడంతో కొన్నేళ్ల క్రితం చంద్రకళను ప్రేమించి పెళ్లి చేసుకున్నాడు. చంద్రకళకు ఇద్దరు కుమార్తెలు ఉన్నారు.
లక్ష్మణ్రావు రిటైర్మెంట్ తర్వాత కంపెనీ నుంచి వచ్చిన డబ్బుతో చింతల్ వాజీపేయినగర్లో ఓ ఇంటిని కొనుగోలు చేశాడు. మిగిలిన డబ్బుని కూతుళ్ల పేరిట ఫిక్సిడ్ డిపాజిట్ చేశాడు. అప్పటి నుంచి భార్యభర్తల మధ్య గొడవ ప్రారంభమైంది.
కంపెనీ నుంచి వచ్చిన నగదును తమకు ఇవ్వకుండా ఇంటిని కొనుగోలు చేయడాన్ని జీర్ణించుకోలేని భార్య తరుచూ భర్తతో గొడవకు దిగేది. ఈ నేపథ్యంలో ఇద్దరి మధ్య గొడవలు తారాస్థాయికి చేరి వేరువేరుగా జీవిస్తున్నారు.
గత ఏడాదిన్నర నుంచి భర్త ఐడీపీఎల్కాలనీలోని క్వార్టర్లలో ఇద్దరు కుమారులతో కలిసి నివాసం ఉంటుండగా భార్య చంద్రకళ వాజీపేయినగర్లోని లక్ష్మణ్రావు కొనుగోలు చేసిన ఇంట్లో కూతుళ్లతో కలిసి ఉంటుంది. అయినా సరే భార్యభర్తలు తరచూ ఫోన్లో గొడవపడేవారు.
ఈ క్రమంలో శనివారం భార్యభర్తల మధ్య గొడవ చోటు చేసుకుంది. దీంతో అల్వాల్లో మెకానిక్గా పనిచేసే సోదరుడు గోపాల్కు చంద్రకళ ఈ విషయాన్ని చెప్పింది. దీంతో కోపోద్రిక్తుడై బావ లక్ష్మణ్రావుకు ఫోన్ చేశాడు. ఈ క్రమంలో లక్ష్మణ్రావు ఐడీపీఎల్ కాలనీకి రమ్మని ఫోన్ చేశాడు.
ఈ క్రమంలో గోపాల్ ఐడీపీఎల్ కాలనీ రాగానే ఇద్దరి మధ్య మాటామాటా పెరిగింది. గోపాల్ అతని వెంట తెచ్చుకున్న సంచులు కుట్టే దబ్బడంతో లక్ష్మణ్రావు ఛాతిపై విచక్షణారహితంగా పొడిచాడు. దీంతో తీవ్రగాయాలైన లక్ష్మణ్రావును చికిత్స నిమిత్తం ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గ మధ్యలో మృతి చెందాడు.
ఈ ఘటనపై సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్థలానికి చేరుకుని మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం గాంధీ ఆసుపత్రికి తరలించారు. అనంతరం కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు.