రంగారెడ్డి జిల్లాలో దారుణ హత్య .. హతమార్చి ,శరీర భాగాలు ముక్కలుగా కోసి ..ఆపై
రంగారెడ్డి జిల్లాలో దారుణ ఘటన చోటుచేసుకుంది. ఒక వ్యక్తిని హతమార్చి, శరీర భాగాలను మూడు ముక్కలుగా నరికి పాడుబడ్డ బావి వద్ద పడేశారు గుర్తుతెలియని దుండగులు. జిల్లేడు చౌదరిగుడా మండల పరిధిలోని కాస్లాబాద్ గ్రామంలో జరిగిన ఈ దారుణ ఘటనలో కాస్లాబాద్ గ్రామానికి చెందిన తట్టే పల్లి రాజు అనే వ్యక్తిని గుర్తుతెలియని వ్యక్తులు హతమార్చారు. హత్య చేసి అతని శరీర భాగాలను మూడు ముక్కలు చేసి తల ఒక చోట, మొండెం ఒక చోట, కాళ్లు మరోచోట గోనెసంచిలో కట్టి పడేసారు.
మూడు రోజుల తర్వాత ఈ ఘటన వెలుగులోకి రావడంతో పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. అసలు రాజును చంపిందెవరు, హత్య చేయడానికి గల కారణాలేంటి? ఆర్థిక లావాదేవీలా ? లేక భూ తగాదాలా ? అన్న కోణంలో కూడా దర్యాప్తు చేస్తున్నారు . మరికొన్ని శరీర భాగాలు లభించకపోవడంతో వాటి కోసం కూడా పోలీసులు గాలింపు చేపట్టారు. అసలు ఇంత కిరాతకంగా హతమార్చిన దుండగులు ఎవరు అన్నది ఇప్పుడు పోలీసులకు మిస్టరీగా మారింది.
రంగారెడ్డి జిల్లాలో ఇటీవల భూ వివాదాలు పెద్ద ఎత్తున కొనసాగుతున్నాయి. ఈ నేపధ్యంలో మృతుడు రాజు హత్యలో భూ తగాదాలు ఏమైనా ఉన్నాయా అన్నది దర్యాప్తు చేస్తున్నారు. మృతదేహాన్ని పోస్ట్ మార్టం నిమిత్తం రంగారెడ్డి ప్రభుత్వ ఆస్పత్రికి తరలించారు . పోస్ట్ మార్టం రిపోర్ట్ అనంతరం ఈ కేసులో మరిన్ని కీలక విషయాలు తెలిసే అవకాశం ఉంది . అంతే కాదు సంఘటనా స్థలంలో క్లూస్ టీం , డాగ్ స్క్వాడ్ లతో క్లూస్ సేకరిస్తున్నా పోలీసులు ఈ మర్డర్ మిస్టరీని చేదించే పనిలో ఉన్నారు.