కత్తులతో నరికి ... ఫాస్ట్ ఫుడ్ సెంటర్ నిర్వాహకురాలి దారుణ హత్య
తెలంగాణ రాష్ట్రంలో దారుణ హత్యలు చోటుచేసుకుంటున్నాయి. వివాహేతర సంబంధాలు చాలా మంది ఉసురు తీస్తున్నాయి. ఇక భార్యా భర్తల మధ్య పంచాయతీలు సైతం హత్యలకు కారణమవుతున్నాయి. ఇక తాజాగా భర్తకు దూరంగా ఉంటున్న ఒంటరి మహిళ మర్డర్ మిస్టరీగా మారింది . కరీంనగర్ జిల్లాలో దారుణం జరిగింది. ఒక మహిళను దుండగులు కత్తులతో దారుణంగా పొడిచి హతమార్చారు. భర్తతో విడిపోయి ఒంటరిగా జీవిస్తూ ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహిస్తున్న ఓ మహిళ దారుణ హత్యకు గురైన ఘటన స్థానికంగా కలకలం రేపింది.
పోలీసుల కథనం ప్రకారం.. సిద్దిపేటకు చెందిన అమల భర్తతో విభేదాల కారణంగా ఒంటరిగా ఉంటోంది. గత కొన్నాళ్లుగా కరీంనగర్లో ఓ ఫాస్ట్ఫుడ్ సెంటర్ నిర్వహిస్తోంది. అయితే ఆమెను ఆదివారం గుర్తు తెలియని వ్యక్తులు కొందరు కత్తులతో దారుణంగా పొడిచి చంపారు. చంపింది ఎవరు? ఎందుకు చంపారు? అన్న విషయాలు తెలియరాలేదు. కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు.
భర్తతో విభేదాలు ఉన్న కారణంగా భర్త ఈ ఘాతుకానికి పాల్పడ్డాడా ? లేక ఆస్తులకు సంబంధించిన వివాదాలు ఏమైనా ఉన్నాయా? అసలు ఈ ఘాతుకానికి పాల్పడిన వారు ఎవరు అన్న కోణంలో పోలీసులు విచారణ చేపట్టారు. సంఘటన స్థలంలో క్లూస్ టీమ్, డాగ్ స్క్వాడ్ లతో ఆధారాలు సేకరించే పనిలో పడ్డారు పోలీసులు.