డీలర్ల మాయాజాలం: భారీ డిస్కౌంట్ అన్నారు.. బంధువులు, స్నేహితులకే అమ్మేసుకున్నారు
భారీ ఆఫర్ల కారణంగా తక్కువ ధరకే బైక్లు వస్తాయని ఆశపడిన కొనుగోలుదారులకు నిరాశే మిగిలింది. ఊహించని విధంగా డీలర్లు రాత్రికి రాత్రే ఈ వాహనాలలో అధిక భాగం తమ వారికి అమ్మేసుకున్నారు.
హైదరాబాద్: సుప్రీంకోర్టు తీర్పు నేపథ్యంలో బీఎస్3 వాహనాలపై ప్రకటించిన ఆకర్షణీయ ఆఫర్లు ఊహించని పరిణామాలకు దారి తీశాయి. పాపం.. కొనుగోలుదారులు తమకు తక్కువ ధరకే బైక్లు వస్తాయని ఆశపడ్డారు.
కానీ ఊహించని విధంగా డీలర్లు.. రాత్రికి రాత్రే ఈ వాహనాలను తమ బంధువులు, స్నేహితులు, పరిచయస్తులకు.. బ్లాక్లో అమ్మేశారు. దీంతో శుక్రవారం మధ్యాహ్నానికే ఇటు తెలంగాణా, అటు ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోని వివిధ వాహన షో రూంలలో ఉన్న బీఎస్3 వాహనాలు ఖాళీ అయిపోయాయి.
ఆఫర్లతో వినియోగదారుల పరుగులు...
ఏప్రిల్ 1 నుంచి బీఎస్ 3 వాహనాల అమ్మకం.. రిజిస్ట్రేషన్లు నిషేధిస్తూ సుప్రీం కోర్టు తీర్పు ఇవ్వడంతో వాహన సంస్థలు తమ షోరూంలలో మిగిలి ఉన్న వాహనాలపై భారీ ఆఫర్లు ప్రకటించాయి. దీంతో హైదరాబాద్, విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, ఇతర ప్రధాన నగరాల్లోని షోరూమ్లకు కోనుగోలుదారులు పరుగులు పెట్టారు.
ఒక్క రోజులో 40 వేల వాహనాలు...
ఈ రెండు రాష్ట్రాల్లో కేవలం గురువారం రాత్రి.. శుక్రవారాల్లోనే 40 వేల బీఎస్3 వాహనాలు అమ్ముడయ్యాయి. వీటిలో ద్విచక్ర వాహనాలే అధికంగా ఉన్నాయి. ఈ వాహనాల విలువ రూ.600-700 కోట్ల వరకు ఉంటుందని అధికారులు విశ్లేషించారు.
ఉదయానికే నో స్టాక్ బోర్డులు...
ఒక్కో బైక్పై రూ.2000 నుంచి రూ.3 లక్షల వరకు ఆఫర్లు ప్రకటించడంతో ఆయా కంపెనీల షోరూంల నిర్వాహకులు తమ స్నేహితులు, బంధువులకే మొత్తం వాహనాలను అమ్మేసుకున్నారు. ఉదయానికే నో స్టాక్ బోర్డులు పెట్టేశారు. కొందరు డీలర్లయితే కంపెనీలు ప్రకటించిన డిస్కౌంట్లను తగ్గించి అమ్మారు. దీంతో కొన్ని షోరూమ్లలో కోనుగోలుదారులు, డీలర్లకు మధ్య తీవ్ర వాగ్వాదం జరిగింది.
పోటెత్తిన పైరవీలు, ఫోన్ కాల్స్...
మరికొందరు డీలర్లయితే రద్దీని తట్టుకోలేక షోరూమ్లను మూసేశారు. రవాణాశాఖ, పోలీసు, ఇతర ప్రముఖుల నుంచి షోరూంల నిర్వాహకులకు బీఎస్3 వాహనాలను తమవారికి ఇవ్వాలంటూ ఫోన్లు వెళ్లాయి. అయినా అప్పటికే ఉన్న వాహనాలన్నీ బ్లాక్ మార్కెట్కి చేరిపోయాయి.
కొనుగోలుదారులుకు తీవ్ర నిరాశ
ఇక శుక్రవారం భారీ ఆఫర్లతో వాహనాలను కొనుగోలు చేయొచ్చని భావించిన కొనుగోలుదారులుకు తీవ్ర నిరాశ ఎదురైంది. షో రూంల వద్ద భారీగా బారులుతీరినా.. వాహనాలు లేక.. వట్టి చేతులతో వెనుదిరగాల్సి వచ్చింది.
డీలర్ల ఆనందం...
సుప్రీం కోర్టు తీర్పుతో తాము తీవ్ర ఆందోళన చెందామని.. అయితే గురువారం వాహన తయారీ సంస్థలు భారీ ఆఫర్లను ప్రకటించడంతో ఉన్న వాహనాలు రాత్రికి రాత్రే అమ్ముడైపోయాయని చాలామంది డీలర్లు తెలిపారు. ఇలాంటి ఆఫర్లను ఇప్పటి వరకు ఎప్పుడూ చూడలేదన్నారు.
రవాణా శాఖకు జాక్ పాట్...
రవాణా శాఖ లెక్కల ప్రకారం.. సాధారణంగా తెలంగాణలో రోజుకు 3500 వాహనాలు అమ్ముడవుతాయి. కానీ ఈ రెండ్రోజుల్లో మాత్రం.. 20 వేలకుపైగా బీఎస్-3 వాహనాలు అమ్ముడయ్యాయి. అసలే పెద్దనోట్ల రద్దుతో టార్గెట్లను చేరుకుంటామా? లేదా? అన్న డైలమాలో ఉన్న రవాణా శాఖకు సుప్రీంకోర్టు తీర్పు పెద్ద జాక్ పాట్ గా మారింది. కేవలం ఈ రెండు రోజుల్లోనే వాహన జీవితకాల పన్ను ద్వారా రవాణా శాఖకు రూ.40 కోట్ల ఆదాయం వచ్చింది.