వీడని బిటెక్ విద్యార్థిని మృతి మిస్టరీ: రీపోస్టుమార్టంపై సందిగ్దత, శవం వెలికితీత వాయిదా
హైదరాబాద్: బీటెక్ విద్యార్థిని శ్రీయాప్రసాద్(19) మృతి మిస్టరీ ఇంకా వీడలేదు. రెండోసారి పోస్ట్మార్టమ్ చేసే విషయంపై సందిగ్ధత చోటు చేసుకుంది. కోర్టు ఆదేశాల మేరకు రీపోస్టమార్టమ్ నిర్వహించాలంటూ శ్రీయ కుటుంబ సభ్యులు పట్టుబడుతున్నారు.
మృతదేహాన్ని భద్రపరచాలని మాత్రమే కోర్టు చెప్పిందని, రీ పోస్ట్మార్టమ్ చేయాలని ఆ ఆదేశాల్లో లేదని వైద్యులు చెబుతున్నారు. దీంతో శుక్రవారం చేపట్టాల్సిన శ్రీయా ప్రసాద్ మృతదేహం వెలికితీత కార్యక్రమం మరోమా రు వాయిదా పడింది. నేరెడ్మెట్ వాయుపురి కాలనీకి చెం దిన శ్రీయాప్రసాద్ విశాఖపట్టణం గీతం యూనివర్సిటీలో బీటెక్ రెండో సంవత్సరం చదివేది.
గత నెల 12న ఆమె అక్కడే అనుమానాస్పద స్థితిలో మరణించింది. ఆమె ఆత్మహత్య చేసుకుని మరణించినట్లు విశాఖ పోలీసులు కేసు నమోదు చేశారు. పోస్టుమార్టమ్ నివేదికలో శ్రీయా 5 గంటలకు మరణించినట్లు తెలిపారు. అయితే అదే రోజు 5.30 గంటల సమయంలో స్నేహితురాలితో ఆమె ఫేస్బుక్ చాటింగ్ చేసినట్లు కుటుంబ సభ్యులు గుర్తించారు. దీంతో తన కుమార్తె మృతిపై వాస్తవాలు వెలికితీయాలంటూ శ్రీయ తల్లి యావన్ ప్రసాద్ హైకోర్టును ఆశ్రయించారు.
కోర్టు ఆదేశాల మేరకు శుక్రవారం ఉదయం మృత దేహాన్ని వెలికి తీసి పరీక్షలు నిర్వహించేందుకు ఏర్పాట్లు చేశారు. గాంధీ ఆసుపత్రి మార్చురీ ఇన్చార్జ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ డాక్టర్ కెవి. రమణమూర్తి, డాక్టర్ లక్ష్మణ్రావు శ్మశాన వాటికకు చేరుకున్నారు. అయితే, మృతదేహానికి రీపో్స్టమార్టమ్ చేయాలన్న స్పష్టత కోర్టు ఆదేశాల్లో లేదని వైద్యులు వెళ్లిపోయారు.
మృతదేహం వెలికితీతను వాయిదా వేస్తున్నట్లు అధికారులు ప్రకటించారు. దీనిపై మళ్లీ కోర్టును ఆశ్రయిస్తానని మృతురాలి తల్లి యావన్ ప్రసాద్ చెప్పారు. ఫోరెన్సిక్ నిపుణుల సూచనల మేరకు రీపో్స్టమార్టానికి ఉత్తర్వులు తీసుకు వస్తామన్నారు.