వెబ్సైట్లో సాన్నిహిత్యంగా ఉన్న ఫోటోలు పెట్టిన మాజీ ప్రియుడు, బీటెక్ యువతి ఆత్మహత్యాయత్నం
నిజామాబాద్/హైదరాబాద్: నిజామాబాద్ జిల్లా మాక్లూర్లో దారుణం జరిగింది. మాజీ ప్రియుడి వేధింపులతో బీటెక్ విద్యార్థిని ఒకరు ఆత్మహత్యాయత్నం చేసింది. గతంలో తాము సాన్నిహిత్యంగా ఉన్న ఫోటోలు, వెబ్సైట్లో పెట్టి బ్లాక్ మెయిల్ చేశాడు మాజీ ప్రియుడు. అంతేకాదు, బాధితురాలి ఫోన్ నెంబర్లతో పాటు కొందరు స్నేహితుల నెంబర్లు కూడా వెబ్ సైట్లో పెట్టాడు.
తనను కాదని ఇతరులను ఎవరినైనా చేసుకుంటే మరిన్ని ఫోటోలు అప్ లోడ్ చేస్తానని బెదిరించాడు, బ్లాక్ మెయిల్ చేశాడు. దీంతో ఆమె ఆత్మహత్యాయత్నం చేసింది. నిందితుడి పేరు ప్రసాద్గా తెలుస్తోంది. అతని తీరుతో మనస్తాపానికి గురైన బాధితురాలు కిరోసిన్ పోసుకొని ఆత్మహత్యాయత్నం చేసింది. కాలిన గాయాలతో ఆమె ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతోంది.
మరో షాకింగ్ విషయం ఏమంటే, నిందితుడు ప్రసాద్కు ఇప్పటికే పెళ్లయింది. ఇద్దరు పిల్లలు ఉన్నారు. బాధితురాలికి, ఇతనికి గతంలో పరిచయం ఉంది. ఈ పరిచయాన్ని అడ్డు పెట్టుకొని అతను బ్లాక్ మెయిల్ చేశాడు. ఆమెతో పాటు ఆమె స్నేహితురాలి ఫోన్ నెంబర్లు కూడా వెబ్ సైట్లో పెట్టాడు.
యూసఫ్గూడలో యువతి దారుణహత్య
హైదరాబాద్లోని యూసఫ్గూడలో ఓ యువతి దారుణ హత్యకు గురైంది. గుర్తు తెలియని దుండగులు బంగారం దుకాణంలో గొంతుకోసి హత్య చేశారు. మృతురాలిని 19 ఏళ్ల వెంకటలక్ష్మిగా పోలీసులు గుర్తించారు. వెంకటలక్ష్మి కుటుంబం కొన్నేళ్ల క్రితం హైదరాబాద్ వచ్చింది. నిందితుల కోసం పోలీసులు గాలిస్తున్నారు.
మధ్యాహ్నం రెండున్నర గంటలకు దుకాణ యజమానికి వెంకటలక్ష్మి ఫోన్ చేశారు. దుకాణంలోని సీసీ కెమెరాలు పని చేయడం లేదని చెప్పారు. మధ్యాహ్నం రెండున్నర గంటలకు కొందరు వ్యక్తులు వచ్చారని కూడా చెప్పారు. ఇదే విషయాన్ని యజమాని తన సోదరికి మధ్యాహ్నం రెండున్నర గంటలకు చెప్పారు. మూడున్నర గంటల సమయంలో హత్య జరిగినట్లుగా పోలీసులు అనుమానిస్తున్నారు. పరిచయస్తులే ఈ హత్యకు పాల్పడి ఉంటారని భావిస్తున్నారు. ముగ్గురు హత్య చేసి ఉంటారని భావిస్తున్నారు.