బడ్జెట్: రైల్వే కేటాయింపుల కోసం తెలంగాణ-ఏపీ ఎదురుచూపులు
న్యూఢిల్లీ: కేంద్ర బడ్జెట్ నేపథ్యంలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలు ఆసక్తిగా ఎదురు చూస్తున్నాయి. విభజన హామీలు, రాష్ట్రాలకు కేంద్రం ఇచ్చిన హామీలకు తోడు కేంద్రం చేయూత కోసం ప్రభుత్వాలు ఎదురు చూస్తున్నాయి. ఇదే సమయంలో రైల్వే బడ్జెట్ పైనా తెలుగు రాష్ట్రాలు కొండంత ఆశలు పెట్టుకున్నాయి.
బడ్జెట్లో తీపి కబురు ఛాన్స్: ఆదాయ పన్ను సర్దుబాటు, మళ్లీ తెరపైకి స్టాండర్డ్ డిడక్షన్
ఇప్పటి వరకు మూడు బడ్జెట్లు నిరాశ మిగిల్చాయని అంటున్నారు. ఈసారి అయినా కేటాయింపులు బాగుంటాయని భావిస్తున్నారు. ఇటీవల రైల్వే అధికారులు ఎంపీలతో భేటీ అయ్యారు. ఆలస్యంగా సమావేశంపై ఎంపీలు అప్పుడే తీవ్రంగా మండిపడ్డారు. బడ్జెట్కు ముందు నామమాత్రంగా సమావేశాలు జరుపుతున్నారనే ఆరోపణలు వినిపిస్తున్నాయి.
రాజధానిలో ఇలా
ఏపీకి మొత్తం ప్రాజెక్టుల కేటాయింపులు రూ. లక్ష కోట్లు కేటాయించాల్సి ఉండగా ఇప్పటికీ పదివేల కోట్లు రాలేదు. విభజన అనంతరం విజయవాడ కీలకంగా మారింది. ఈ నేపథ్యంలో కొత్త రైళ్లు ప్రాజెక్టులు రావాల్సి ఉన్నా పెద్దగా కేటాయింపులు లేవని అంటున్నారు. రెండేళ్ల క్రితం విజయవాడ తుళ్లూరు మధ్య కొత్తగా రైలు మార్గం ప్రకటించి నిధులు కేటాయించినా ఇప్పటికీ సర్వే పనులు ప్రారంభం కాలేదు.
ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్
కాజీపేట నుంచి విజయవాడ, దువ్వాడ నుంచి తడ వరకు చేపట్టిన థర్డ్ లైన్ పనులు మందకొడిగా సాగుతున్నాయని అంటున్నారు. ఈ పనులు పూర్తయితే సికింద్రాబాద్, విశాఖపట్నం మార్గాల్లో రద్దీ తగ్గుతుంది. విభజన చట్టంలో ఉన్న ఏపీకి ప్రత్యేక రైల్వే జోన్ హామీ ఇచ్చారు. సాంకేతిక కారణాలతో అది ఇప్పటి వరకు నెరవేరలేదు.
రైల్ నీర్ కార్యక్రమం
అయిదేళ్ల కిందట రైల్వే బడ్జెట్లో రైల్ నీర్ ప్రాజెక్టును ప్రకటించారు. ఆ బడ్జెట్లో దేశంలోని మరో 17 ప్రాంతాలకూ ఇచ్చారు. అవి ప్రారంభమై విజయవంతంగా నడస్తున్నాయి. విజయవాడలోనే ముందడుగు పడలేదు. ఈ ప్రాజెక్టు ప్రారంభమై ఉంటే ఎంతోమందికి ఉపాధి లభించి ఉండేది. ప్రయాణీకుల రద్దీ దృష్ట్యా విజయవాడ నుంచి ముంబై, హౌరా, రాజస్తాన్, నాగపట్నం, షిరిడీ, బెంగళూరు తదితర ముఖ్య ప్రాంతాలకు రైళ్ల ప్రతిపాదన కలగానే మిగిలింది.
స్టేషన్లలో సదుపాయాలు
విజయవాడ రైల్వే స్టేషన్లో పీపీపీ విధానంలో రూ.180 కోట్ల వ్యయంతో నిర్మించ తలపెట్టిన మల్టీ ఫంక్షనల్ కాంప్లెక్స్లు, వినోద కేంద్రాలు, అత్యాధునిక వెయిటింగ్ హాళ్లు ఇప్పటికీ ప్రారంభం కాలేదు. తెలంగాణ కూడా పలు కేటాయింపుల కోసం ఎదురు చూస్తోంది. వచ్చే ఏడాది ఎన్నికలు ఉండటంతో కేటాయింపులు ఉండవచ్చునని భావిస్తున్నారు. అలాగే, పలు స్టేషన్లలో సదుపాయాల కల్పన ఆవశ్యకత ఉంది.