చైనా కంటే ఎక్కువ, నోట్ల రద్దుతో ఇబ్బందే కానీ..: ఇదీ ఆర్థిక సర్వే!
రూ.500, రూ.1000 నోట్ల వల్ల ఏర్పడిన నగదు కొరత ఏప్రిల్ నాటికి తీరుతుందని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మంగళవారం నాడు వార్షిక ఆర్థిక సర్వేను జైట్లీ పార్లమెంటు ముందుంచారు.
న్యూఢిల్లీ: రూ.500, రూ.1000 నోట్ల వల్ల ఏర్పడిన నగదు కొరత ఏప్రిల్ నాటికి తీరుతుందని కేంద్రమంత్రి అరుణ్ జైట్లీ అన్నారు. మంగళవారం నాడు వార్షిక ఆర్థిక సర్వేను జైట్లీ పార్లమెంటు ముందుంచారు.
2017-18ఆర్థిక సంవత్సరంలో వృద్ధి రేటు 6.5 - 7.5శాతం ఉంటుందని ఆర్థిక సర్వే తేల్చింది. రియల్ ఎస్టేట్ వ్యాపారం దెబ్బ తిన్నదని ఆర్థిక సర్వేలో ఉంది. ఉద్యోగ ఉపాధి రంగాలు ఈ ఏడాది దెబ్బ తిన్నాయని గుర్తించారు. ఆర్థిక సలహాదారు అరవింద సుబ్రహ్మణియన్ నేతృత్వంలో ఆర్థిక సర్వేను రూపొందించారు.
ఇందులోని కొన్ని అంశాలు..
భారత్ వాణిజ్య - స్థూల జాతీయోత్పత్తి నిష్పతి చైనా కంటే ఎక్కువగా ఉంది. నోట్ల రద్దు తాత్కాలికంగా అడ్డంకి మాత్రమే. దీర్ఘకాలంలో ఆర్థిక వ్యవస్థకు మేలు చేకూరుతుంది. దీని ప్రభావంతో వచ్చే ఏడాది వడ్డీ రేట్లు తగ్గుతాయి.
నిరుపేదలకు ఆసరా అందించేందుకు ఉద్దేశించిన యూనివర్సల్ బేసిక్ ఇన్కం (యూబీఐ) స్కీం ఆచరణ గురించి ఆర్థిక సర్వే ప్రస్తావించింది. అది పేదరిక నిర్మూలనకు ప్రభావవంతంగా పని చేస్తుందని సూచించింది.
జీఎస్టీ రాజ్యాంగ సవరణ భారతీయ మార్కెట్కు ఏకరూపతను తీసుకొస్తుంది. పన్నుల సరళీకరణ, నిర్వహణను పెంచుతుంది. జీఎస్టీ నుంచి ఆర్థికపరమైన లబ్ధి పొందేందుకు కొంత సమయం పడుతుంది. కార్మికుల వలస దేశంలో విపరీతంగా పెరుగుతుంది.
ఆర్థిక వ్యవస్థలో దూకుడు పెంచేందుకు, సామాజిక న్యాయం సాధించేందుకు సంస్కరణలను సమర్థిస్తోంది. 2016-17 స్థిరమైన మార్కెట్ ధరల వద్ద జీడీపీ రేటు7.1గా నమోదైంది. వ్యవసాయ రంగం వృద్ధిరేటు 2015-16తో పోలిస్తే 1.2శాతం ఎక్కువ ఉంది.