తెలంగాణ బడ్జెట్ .. లక్షా 82 వేల 17 కోట్లు
తెలంగాణ అసెంబ్లీలో 2018-2019కి సంబంధించి ఓట్ ఆన్ అకౌంట్ బడ్జెట్ ను సీఎం కేసీఆర్ ప్రవేశపెట్టారు. తెలంగాణ రాష్ట్రంలో సీఎం బడ్జెట్ ప్రవేశపెట్టడం ఇదే తొలిసారి. ఇటీవల మంత్రివర్గ విస్తరణ జరిగినా .. ఎవరికీ ఆర్థికశాఖ కేటాయించకపోవడంతో అసెంబ్లీలో స్వయంగా కేసీఆర్, మండలిలో మంత్రి ఈటల రాజేందర్ ప్రగతి పద్దును చదివి వినిపించారు. ఉమ్మడి రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్రం వివక్షకు గురైందన్నారు సీఎం కేసీఆర్. నీళ్లు, నిధులు, నియామకాలతోపాటు సంక్షేమ రంగాలు పడకేశాయని విమర్శించారు. గత పాలకుల నిర్లక్ష్యం వల్లే అన్నిరంగాల్లో తెలంగాణ వెనుకబడిందని ప్రస్తావించారు. అధికారం చేపట్టిన 9 నెలల్లోనే విద్యుత్ సమస్యను అధిగమించామని పేర్కొన్నారు.
విద్యుత్ సమస్య తీరడంతో వ్యవసాయం, పరిశ్రమలకు నిరంతరం కరెంట్ ఇవ్వగలుగుతున్నామని చెప్పారు. అతి తక్కువ కాలంలో అభివృద్ధి పథంలో నడిచి మిగతా రాష్ట్రాలకు ఆదర్శంగా నిలిచామని .. యావత్ దేశానికి తెలంగాణ మోడల్ గా నిలువడం గర్వకారణమన్నారు. వివిధ అంశాల్లో నిర్ణీత లక్ష్యంతో ముందుకుసాగుతూ .. తక్కువ సమయంలో డెవలప్ సాధించామని పేర్కొన్నారు. ఒకప్పుడు తెలంగాణ వృద్ధి దేశ సగటు కన్నా తక్కువగా ఉండేదని .. రాష్ట్రం ఏర్పడిన తర్వాత రెండు రెట్టు పెరిగిందనే విషయాన్నే బడ్జెట్ ప్రసంగంలో ప్రత్యేకంగా ప్రస్తావించారు కేసీఆర్. ప్రభుత్వం చేపట్టిన సంక్షేమ పథకాలే తిరిగి టీఆర్ఎస్ అధికారం చేపట్టేందుకు దోహదపడిందన్నారు.