చివరకు బర్రెలను , గొర్రెలను కూడా విడిచిపెట్టలేదుగా ... తెలంగాణాలో పశువుల పంపిణీలో స్కామ్ ?
గొల్ల, కురుమల ఆర్థిక పరిస్థితుల మెరుగుదల లక్ష్యంతో తెలంగాణ ప్రభుత్వం సబ్సిడీ ధరకు పాడి పశువుల పంపిణీ చేపట్టింది. అయితే అలా చేస్తున్న పశువుల పంపిణీలో సైతం భారీ కుంభకోణాలు వెలుగు చూస్తున్నాయి. రాష్ట్ర ప్రభుత్వం 2018 జులైలో ప్రవేశపెట్టిన పాడి గేదెల పంపిణీ కార్యక్రమానికి గ్రహణం పట్టింది. సబ్సిడీ మీద పశువులు ఇస్తుండటంతో పశు సంవర్ధక శాఖాధికారులు, పశు వైద్యులు సైతం చేతివాటం చూపిస్తూ ప్రభుత్వ ఆశయానికి తూట్లు పొడుస్తున్నారు.
పశువుల పంపిణీలోనూ భారీ స్కామ్.. అర్హుల కంటే అనర్హులకే పథకం ద్వారా లబ్ది
తెలంగాణలో గొర్రెలు మరియు గేదెల పంపిణీలో భారీ కుంభకోణం జరుగుతోంది. అర్హుల కంటే అనర్హులకే పథకం ద్వారా లబ్ది చేకూరుతుంది. గొల్ల మరియు కురుమల వర్గాలకు సహాయం చేయడానికి, తెలంగాణ ప్రభుత్వం గొర్రెలు మరియు గేదెలను సబ్సిడీ రేటుకు అర్హత ఉన్నవారికి పంపిణీ చేయడానికి ప్రణాళిక చేసింది . ఇప్పటికే గేదెల, గొర్రెల పంపిణీలో జరిగిన అవకతవకలను ప్రభుత్వం గమనించి, నిందితులను అదుపులోకి తీసుకున్నప్పటికీ, ఏదో ఒకవిధంగా ఈ పథకం దుర్వినియోగం అవుతూనే ఉంది . కాబట్టి అవకతవకలను నిర్మూలించే ప్రతిపాదనలు తీసుకురావాలని తెలంగాణ సిఎం కెసిఆర్ పశుసంవర్ధక అధికారులను కోరారు. అధికారులు రెండు సిఫారసులతో ముందుకు వచ్చారు. మొదటిది గొర్రెలు మరియు గేదెల పంపిణీ కోసం టెండర్లను ఆహ్వానించడం మరియు రెండవది సబ్సిడీ మొత్తాన్ని నేరుగా లబ్ధిదారులకు జమ చేయడం.
పశు పోషణకు చేయూత ఇవ్వాలనే నిర్ణయం .. పశు సంవర్ధక శాఖలోని అధికారుల చేతివాటం
మొదటి దశలో, ప్రభుత్వం 70.10 లక్షల గొర్రెలను 3,67,020 మందికి ఇచ్చింది , కాని రెండవ దశలో కేవలం ఐదు లక్షల పశువుల పంపిణీ మాత్రమే జరిగింది. ప్రభుత్వం తన మొదటి దశ పంపిణీలో పశు వైద్యులు మరియు ఈ పథకాన్ని దోపిడీ చేసిన అధికారుల వల్ల నష్టం జరిగినట్టు గుర్తించింది . అందుకే అవకతవకలపై ప్రత్యేకమైన దృష్టి పెట్టింది. పాడి రైతులకు ప్రభుత్వం సబ్సిడీపై పంపిణీ చేస్తున్న ఒక్కో గేదె విలువ రూ.80 వేలుగా నిర్ణయం చేశారు . ఇందులో ఎస్సీ, ఎస్టీ పాడి రైతులకు 75 శాతం, బీసీ, మైనార్టీలు, ఓసీలకు 50 శాతం సబ్సిడీ కింద పంపిణీ చేయాలని నిర్ణయించారు. ఈ పథకం కింద గేదెను తీసుకోవాలనుకున్న ఎస్సీ, ఎస్టీ పాడి రైతులు రూ.20 వేలు, ఇతరులు రూ.40 వేలు తమ వాటా కింద డీడీల రూపంలో చెల్లించాలి . మిగతా వాటాను ప్రభుత్వం భరిస్తుంది .
చివరకు బర్రెలను, గొర్రెలను వదలని అవినీతి తిమింగలం .. నీరుగారుతున్న ప్రభుత్వ లక్ష్యం
గేదెల పంపిణీకి వస్తున్న అధికారులు, మధ్యవర్తులతో కలిసి దీనిని చాలా వరకు దుర్వినియోగం చేశారు. గేదెల కోసం దరఖాస్తుల దగ్గర నుండీ కొనుగోలు వరకు అంతా ప్లాన్ ప్రకారమే చేస్తున్నారు. పశు పోషణ ప్రభుత్వ లక్ష్యం అయితే ఈ పథకం నుండి తమకు ఎలాంటి ఆర్ధిక లబ్ది చేకూరుతుంది అనేది ప్రధాన లక్ష్యంగా అధికారులకు మారింది అనేది నిజమైన లబ్దిదారుల నుండి వస్తున్న ప్రధాన ఆరోపణ . ఇక అధికారులు, పశు వైద్యులు , మధ్యవర్తులు కలిసి పశువుల పంపిణీలో వచ్చే సబ్సిడీని కూడా వదలటం లేదు అనేది నిజమైన పశు పోషకుల ఆవేదన . ఇక ప్రభుత్వం దీనిఅపి దృష్టి పెట్టింది. ఒక్కో గేదెను తక్కువ ధరకు కొని ఇక రికార్డులలో వారు గేదెను రూ .80,000 కు కొనుగోలు చేసినట్లు నమోదు చేసుకుంటున్నారు. అయితే వాస్తవానికి బహిరంగ మార్కెట్లో రూ .30,000 కంటే ఎక్కువ ఖర్చు పెట్టలేదని ఇలా పెద్ద మొత్తంలో భారీ కుంభకోణం చేసినట్టు సర్కార్ గుర్తించింది.అసలు నిరుపేదలైన వారి కోసం పెట్టిన పశువుల పంపిణీ పథకం కూడా అధికారుల అవినీతితో నీరు గారిపోతుంది. ప్రభుత్వ లక్ష్యానికి తూట్లు పొడుస్తుంది అని సమాచారం .