సమైక్య ఏపీలో ప్రాజెక్టులు: తెలంగాణకు రూ.1500 కోట్లు ఎగ్గొట్టిన బిల్డర్లు
హైదరాబాద్: తెలంగాణ ప్రభుత్వానికి బిల్డర్లు రూ.1500 కోట్ల మేర ఎగవేయగా, వాటిని వసూలు చేసేందుకు కేసీఆర్ ప్రభుత్వం నడుం బిగించింది. 2001 నుంచి పలువురు బిల్డర్లు డబ్బులు ఎగవేశారని తెలుస్తోంది. ఉమ్మడి ఏపీలో హైదరాబాద్ సహా పలుచోట్ల బిల్డర్లు ప్రభుత్వంతో కలిసి జాయింట్ వెంచర్లు ప్రారంభించారు.
వాణిజ్య, నివాస ప్రాజెక్టుల పైన ఐదు శాతం షేర్ ఇవ్వనున్నట్లు ప్రభుత్వంతో ఒప్పందం కుదుర్చుకున్నారు. అయితే, దానిని వారు పాటించలేదు. దాదాపు తొమ్మిది మందికి పైగా బిల్డర్ల నుంచే రూ.600 కోట్లు రావాల్సి ఉందని తెలుస్తోంది. వాటిని వసూలు చేసేందుకు ప్రభుత్వం రంగం సిద్ధం చేసింది.
పలు జాయింట్ వెంచర్లు బిల్డర్లు, ఏపీ హౌసింగ్ బోర్డు మధ్య ఉన్నాయి. ఇందులో 19 జాయింట్ వెంచర్లు 2004 నుంచి 2008 మధ్య ప్రారంభమైనవి.
ఇందులో ఒకటి మాత్రమే పూర్తయింది. మిగతావి వివిధ దశల్లో ఉన్నాయి. కొన్ని మధ్యలోనే ఆగిపోయాయి. సంవత్సరాల తరబడి అలాగే ఉండటంతో తెలంగాణ ప్రభుత్వం ఆ సొమ్మును రాబట్టే ప్రయత్నం చేస్తోంది. దీని పైన కేబినెట్ సబ్ కమిటీ వేసేంది. ఆ కేబినెట్ సబ్ కమిటీ సూచనల ప్రకారం నడవనుంది.