తెలంగాణ శాసనమండలి పక్షంలో విలీనం అయిన కాంగ్రెస్ శాసనమండలి పక్షం
రాజకీయాల్లో నేతలు పార్టీలు మారడం కామన్. కానీ ప్రజలు ఎన్నుకున్న ప్రజాప్రతినిధులు మారడం మరోసారి చర్చనీయాంశమైంది. ఇది తెలంగాణలో మరోసారి రుజువైంది.తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీ రెండవసారి అధికారంలోకి వచ్చాక కాంగ్రెస్ పార్టీ నుంచి వలసలు మొదలయ్యాయి. కాంగ్రెస్ పార్టీ నుంచి ఎమ్మెల్సీలుగా ఉన్న నలుగురు కాంగ్రెస్ సభ్యులు టీఆర్ఎస్ కండువా కప్పుకున్నారు. ఉదయం మండలి ఛైర్మెన్ స్వామి గౌడ్ను ఆకుల లలిత, సంతోష్ కుమార్, ప్రభాకర్ రావు, దామోదర్ రెడ్డిలు కలిసి తెలంగాణ రాష్ట్రసమితిలో కాంగ్రెస్ శాసనమండలి పక్షం విలీనం చేయాల్సిందిగా కోరుతూ లేఖ ఇచ్చారు. శుక్రవారం ఉదయం ఇచ్చిన లేఖను అదే రోజు సాయంత్రం టీఆర్ఎస్ శాసనమండలిలో కాంగ్రెస్ శాసనమండలి పక్షం విలీనం చేస్తూ కౌన్సిల్ బులిటెన్ విడుదల చేసింది.
భారత రాజ్యాంగంలోని 10వ షెడ్యూల్ 4వ పారాను అనుసరించి కాంగ్రెస్ శాసనసభాపక్షంను తెలంగాణ రాష్ట్రసమితిలోకి విలీనం చేస్తున్నట్లు శాసనసభ కార్యదర్శి బులిటెన్ విడుదల చేశారు. ఇందులో భాగంగా ఆకుల లలిత, సంతోష్ కుమార్, ఎమ్మెస్ ప్రభాకర్ రావు, కూచుకుల్ల దామోదర్ రెడ్డిలు ఇకపై తెలంగాణ రాష్ట్ర సమితి ఎమ్మెల్సీలుగా పరిగణించబడుతారని ఆ ప్రకారంగా వారికి మండలిలో స్థానం కేటాయించడం జరుగుతుందని బులిటెన్ ద్వారా తెలియజేశారు.
ఇదిలా ఉంటే ఎన్నికలకు ముందు టీఆర్ఎస్ పార్టీకి చెందిన నలుగురు ఎమ్మెల్సీలు కూడా కాంగ్రెస్ పార్టీ తీర్థం పుచ్చుకున్నారు. దీనిపై శాసనమండలి నేత పాతూరి సుధాకర్ వారి సభ్యత్వాన్ని రద్దు చేయాల్సిందిగా మండలి ఛైర్మెన్ స్వామిగౌడ్కు వినతి పత్రాన్ని అందజేశారు. వారిని అనర్హులుగా ప్రకటించాలని అందులో పేర్కొన్నారు. అయితే ఆ అంశం ఇంకా పెండింగ్లో ఉంది. మరి ఇలాంటి నేపథ్యంలో కాంగ్రెస్ పార్టీలో చేరిన టీఆర్ఎస్ ఎమ్మెల్సీలు తమను కాంగ్రెస్ శాసన మండలి సభ్యులుగా గుర్తించాలని మండలి ఛైర్మెన్ను కోరితే అందుకు ఆయన అంగీకరిస్తారో లేదో వేచి చూడాలి.
కాంగ్రెస్ ఎమ్మెల్సీ సభ్యులను టీఆర్ఎస్లో విలీనం చేయడంపై స్పందించారు కాంగ్రెస్ నేత పొంగులేటి సుధాకర్ రెడ్డి. ప్రజాస్వామ్యంలో ఇదొక విచిత్రమైన పరిస్థితి అని ఆయన వ్యాఖ్యానించారు. ఇది నైతికమా అనైతికమా అనేది నాయకులే చెప్పాలని పొంగులేటి అన్నారు.