ఎంపీగా ఓడినా కవితకు బంపర్ ఆఫర్ ... మినిస్టర్ చాన్స్ అంటూ పార్టీలో జోరుగా చర్చ
Recommended Video
తెలంగాణాలో జరిగిన లోక్సభ ఎన్నికల ఫలితాలలో తెలంగాణా సీఎం కేసీఆర్ కుమార్తె కల్వకుంట్ల కవిత ఓటమి పాలయ్యారు. నిజామాబాద్ పార్లమెంట్ నియోజకవర్గం నుండి ఎన్నికల బరిలోకి దిగిన కవిత బీజేపీ అభ్యర్థి ధర్మపురి అరవింద్ చేతిలో ఓటమి పాలయ్యారు. పసుపు రైతులు 176 మంది ఎన్నికల బరిలోకి దిగటం కవితకు నష్టం చేసింది. తెలంగాణలో 16 స్థానాలు గెలుచుకుని కేంద్రంలో చక్రం తిప్పుతాం అని భావించిన కేసీఆర్కు చివరకు ఊహించని పరాభావం ఎదురైంది.
కేసీఆర్ కుమార్తె కవితనే ఓటమి పాలు కావటం తెలంగాణా రాష్ట్రంలోనే కాదు దేశ వ్యాప్తంగా చర్చనీయాంశం అయ్యింది. అయితే ముందస్తు అసెంబ్లీ ఎన్నికలలో భారీ విజయాన్ని నమోదు చేసుకున్న టీఆర్ఎస్, లోక్సభ ఎన్నికలలో కాస్త వెనుకబడిపోవడం చూస్తుంటే ప్రజలలో అప్పటికి, ఇప్పటికి కాస్త వ్యతిరేకత ఏర్పడిందనే చెప్పాలి. దాని ప్రభావమే స్వయానా కేసీఆర్ కూతురు కవిత ఓటమి. అయితే నిజామాబాద్లో ఓడిపోయిన కవిత రాజకీయ భవితవ్యం ఏంటి ? అన్న చర్చ పార్టీ శ్రేణుల్లో జోరుగా సాగుతుంది. కవితకు తెలంగాణ కేబినెట్లో స్థానం కలిపించబోతున్నారన్న వార్తలు తాజాగా తెరపైకి వచ్చాయి.
అయితే కవితకు ఎమ్మెల్సీ కోటాలో మంత్రి పదవి ఇవ్వబోతున్నారంటూ పార్టీలో చర్చలు నడుస్తున్నాయట. కేసీఆర్ తలచుకుంటే ఏదైనా సాధ్యమే అని అందరూ భావిస్తున్నారట . అయితే దీనిపై మాత్రం ఇంకా ఎలాంటి అధికారిక ప్రకటన చేయలేదు టీఆర్ఎస్. ఏది ఏమైనా ప్రస్తుత రాజకీయ పరిస్థితులను బట్టి చూస్తుంటే కవితకు మంత్రి పదవి ఇచ్చే ఛాన్సెస్ ఎక్కువగానే ఉన్నట్టు కనిపిస్తుంది.