వంతెనపైనుంచి బోల్తా పడిన బస్సు: 10మందికి గాయాలు
భద్రాద్రి కొత్తగూడెం: జిల్లాలోని బూర్గంపాడు మండలం రెడ్డిపాలెం వద్ద రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. సారపాక-నాగినేనిప్రోలు మార్గంలో ఆర్టీసీ బస్సు వాగు వంతెనపైనుంచి అదుపు తప్పి బోల్తా పడింది.
శనివారం ఉదయం నుంచి కురుస్తోన్న వర్షం కారణంగా దెబ్బతిన్న రోడ్డుపై గుంతలను తప్పించబోయి బస్సు అదుపుతప్పి ఒక్కసారిగా కింద పడింది. ఈ ప్రమాద సమయంలో బస్సులో 35 మంది ప్రయాణికులు ఉన్నట్లు సమాచారం. వీరిలో పది మందికి గాయాలైనట్లు తెలిసింది.
పోలీసులు, అధికారులు ఘటనాస్థలికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు. క్షతగాత్రులను భద్రాచలం ఏరియా ఆస్పత్రికి తరలించారు. బస్సు భద్రాచలం నుంచి విజయవాడకు వెళ్తండగా ఈ ప్రమాదం చోటుచేసుకుంది.
కాగా, భారీ వర్షాలతో జిల్లాలోని నదులు, వాగులు పొంగిపొర్లుతున్నాయి. లోతట్టు ప్రాంతాలు జలమయమయ్యాయి. వరదనీరు రోడ్లపైకి చేరుకోవడంతో వాహనదారులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు.