ప్రాణాలు పోతున్నా..: వాట్సప్ చూస్తూ బస్సు నడిపిన డ్రైవర్
కరీంనగర్: ఓ వైపు ప్రమాదాల్లో ప్రజల ప్రాణాలు పోతున్నా కొందరు డ్రైవర్లు మాత్రం తమ నిర్లక్ష్యాన్ని వీడటం లేదు. సెల్ఫోన్లు చూస్తూ వాహనాలు నడిపి జనాల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారు. తాజాగా, ఇలాంటి ఘటనే చోటు చేసుకుంది.
హుజురాబాద్ నుంచి జమ్మికుంట వెళుతున్న రూట్లో శ్రీనివాస్ అనే డ్రైవర్ సెల్ఫోన్ చూస్తూ బస్సును నడిపారు. ఓ చేత్తో సెల్ఫోన్లో వాట్సప్ అప్డేట్ చేసూకుంటూ మరో చేత్తో బస్సు స్టీరింగ్ పట్టుకుని నడుపుతున్నాడు.
ఈ దృశ్యం చూసిన ప్రయాణికులు హడలిపోయారు. ప్రమాదమేమీ జరగకపోయినప్పటికీ ఇంత నిర్లక్ష్యంగా వ్యవహరించడమేంటని ప్రశ్నించారు. ఈ దృశ్యాన్ని ఓ ప్రయాణికుడు వీడియో తీసి సోషల్ మీడియాలో పోస్టు చేయడంతో వైరల్గా మారింది. ఈ వీడియో మీడియాలో రావడంతో ఆర్టీసీతోపాటు పోలీసులు వెంటనే స్పందించారు. డ్రైవర్ శ్రీనివాస్ను ఆర్టీసీ అధికారులు విధుల నుంచి తొలగించారు. అంతేగాక, ప్రయాణికుల ప్రాణాలతో చెలగాటమాడిన శ్రీనివాస్పై పోలీసులు కేసు కూడా నమోదు చేశారు.
ఏడుగురి మరణానికి డ్రైవర్ నిర్లక్ష్యమే కారణం
కరీంనగర్ జిల్లా మానకొండూర్ మండలం చెంజర్ల వద్ద జరిగిన ఘోర రోడ్డు ప్రమాదంలో తప్పంతా బస్సు డ్రైవర్దేనని విచారణలో తేలింది. ఈ మేరకు గురువారం ఓ పోలీసు అధికారి తెలిపారు. రోడ్డు ప్రమాదంలో ఏడుగురి మృతికి కారణం లారీ డ్రైవర్, బస్సు డ్రైవర్గా భావించి కేసు నమోదు చేసిన పోలీసులు విచారణ చేపట్టారు.
బస్సు డ్రైవర్ అతివేగం, నిర్లక్ష్యంగా చోదనం ఉందని ప్రత్యక్ష సాక్షులు, ప్రయాణికులు పోలీసుల విచారణలో వెల్లడించారు. మంగళవారం హుజురాబాద్ నుంచి బయల్దేరిన ఆర్టీసీ బస్సు కొద్దిసేపటికే మరో వాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో పాఠశాల బస్సును ఢీకొనేది, తృటిలో ప్రమాదం తప్పింది. శంకరపట్నం దాటాక ఓ ద్విచక్రవాహనాన్ని అధిగమించబోయి రోడ్డు దిగింది. అయినప్పటికీ డ్రైవర్ వేగాన్ని తగ్గించలేదు. అంతలోనే రోడ్డు దాటుతున్న ఆవును తప్పించే క్రమంలో కల్వర్టును ఢీకొనే ప్రమాదం తప్పింది. దీంతో బస్సు మెల్లగా నడపాలని తాను సూచించడంతో డ్రైవర్ ఆగ్రహం వ్యక్తం చేశాడని ఓ ప్రయాణికుడు వాపోయాడు.
చెంజర్ల వద్ద ద్విచక్రవాహనాన్ని ఓవర్టేక్ చేస్తున్న సమయంలో బస్సు పూర్తిగా కుడి వైపునకు వచ్చింది. లారీని గమనించిన డ్రైవర్ తిరిగి ఎడమవైపు తిప్పడంతో ఓవర్టేక్ చేయబోయిన ద్విచక్రవాహనాన్ని ఢీకొంది. బస్సు ముందుభాగం ఎడమవైపు వెళ్లగా.. మధ్య భాగంలో లారీ ఢీకొన్నట్లు ప్రత్యక్ష సాక్షులు పోలీసులకు చెప్పారు. ఈవిషయమై పోలీస్ కమిషనర్ కమలాసన్రెడ్డిని వివరణ కోరగా డ్రైవర్ నిర్లక్ష్యంపై నివేదిక రూపొందించామని, త్వరలో వివరాలు వెల్లడిస్తామని వెల్లడించారు.