వంతెనపై నుంచి ఆర్టీసీ బస్సు బోల్తా: ఒకరు మృతి
హైదరాబాద్: మహబూబ్నగర్ జిల్లాలోని కొమ్మిరెడ్డిపల్లి వద్ద జాతీయ రహదారిపై ఆర్టీసీ బస్సు వంతెనపై నుంచి బోల్తాపడింది. ఈ సంఘటనలో ఒకరు మృతి చెందగా, 20 మంది తీవ్ర గాయాలయ్యాయి. హైదరాబాద్ నుంచి తాడిపత్రికి వెళుతుండగా ఈ ప్రమాదం జరిగింది.
అనంతపురం జిల్లా తాడిపత్రి డిపోకు చెందిన ఆర్టీసీ బస్సు 35 మంది ప్రయాణికులతో సోమవారం రాత్రి హైదరాబాద్ నుంచి తాడిపత్రికి బయలు దేరింది. ఈ క్రమంలో అర్ధరాత్రి దాటిన తర్వాత కొమ్మిరెడ్డిపల్లి గ్రామంలోని వంతెన వద్దకు రాగానే బస్సు బోల్తా పడింది.
సమాచారం అందుకున్న పోలీసులు హుటాహుటిన సంఘటనా స్ధలానికి చేరుకున్నారు. క్షతగాత్రులను మహబూబ్నగర్ ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఇద్దరి పరిస్థితి విషమంగా ఉంది.
డివైడర్ను ఢీకొన్న కారు, ఇద్దరు మహిళలు మృతి
శంషాబాద్ విమానాశ్రయ ప్రధాన రహదారిపై వేగంగా వెళ్తున్న కారు అదుపుతప్పి డివైడర్ను కొట్టింది. ఈ ప్రమాదంలో ఇద్దరు మహిళలు అక్కడికక్కడే మృతి చెందారు. కారులో ప్రయాణిస్తున్న మరో నలుగురికి గాయాలయ్యాయి.
సమాచారం అందుకున్న పోలీసులు సంఘటనా స్ధలానికి క్షతగాత్రులను సమీపంలోని ఆసుపత్రికి తరలించారు. క్షతగాత్రుల్లో ఒకరి పరిస్ధితి విషమంగా ఉందని సమాచారం.