సినీ ఫక్కీలో వ్యాపారి కిడ్నాప్: దర్యాప్తు ప్రారంభించిన పోలీసులు
వరంగల్: కుటుంబ సభ్యులతో ఇంట్లో ఉన్న వ్యాపారిని ఎవరో పిలుస్తున్నారంటూ చెప్పి, బయటకు వచ్చిన తర్వాత గుర్తు తెలియని దుండగులు కొంత మంది అతడిని కిడ్నాప్ చేసిన సంఘటన శనివారం ఉదయం రంగల్ జిల్లా మహబూబాబాద్లో చోటు చేసుకుంది.
పోలీసులు తెలిపిన కథనం ప్రకారం వివరాలిలా ఉన్నాయి. వరంగల్ పట్టణానికి చెందిన వెంశెట్టి సోమయ్య(56) ఎరువుల వ్యాపారం చేస్తూ జీవనం సాగిస్తున్నారు. ముగ్గురు సంతానం అమెరికాలో స్ధిరపడటంతో ఇంట్లో ప్రస్తుతం భార్య భర్తలు మాత్రమే ఉన్నారు.
శనివారం ఉదయం గుర్తు తెలియని కొందరు వ్యక్తులు వచ్చి సోమయ్యను బయటకు పిలిచి వ్యానులో ఎక్కించుకొని తీసుకెళ్లారు. బయటకు వెళ్లిన భర్త ఎంతకూ రాకపోవడంతో ఆందోళనతో ఆయన భార్య సంధ్యారాణి పోలీసులను ఆశ్రయించింది.
దీంతో కేసు నమోదు చేసుకున్న పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. గతంలో వెంశెట్టి సోమయ్య, వెంశెట్టి కృష్ణల మధ్య కోల్డ్స్టోరేజ్కు సంబంధించిన గొడవలు ఉండటంతో అతనిపై అనుమానం ఉన్నట్లు పోలీసులు దర్యాప్తుని ముమ్మరం చేశారు.