కారుతో సహా ఎత్తుకెళ్లి వ్యాపారిని దారుణంగా హత్య చేశారు
హైదరాబాద్: రంగారెడ్డి జిల్లా కీసర పోలీసుస్టేషన్ పరిధిలోని తిమ్మాయిపల్లి గ్రామంలో ఓ వ్యాపారవేత్తను దుండగులు అత్యంత దారుణంగా హత్య చేశారు. సీఐ పన్నాల గురువారెడ్డి కథనం ప్రకారం.. కరీంనగర్ జిల్లా వేములవాడ మండలం హన్మపురం గ్రామానికి చెందిన గౌరినేని కృష్ణమోహన్ (48) అల్వాల్లో నివాసం ఉంటున్నాడు.
కీసర మండలం తిమ్మాయిపల్లి గ్రామంలో ఉన్న బాలజీ మెటల్ ఇండస్ట్రీస్ పేరుతో కంపెనీ నడిపిస్తున్నాడు. దానికితోడు రియల్ఎస్టేట్ వ్యాపారాన్ని నిర్వహిస్తున్నాడు. శుక్రవారం ఉదయం 9.15 గంటలకు ఇంట్లో నుంచి కారులో తిమ్మాయిపల్లి గ్రామంలో ఉన్న తన క్రషర్ మిషన్ వద్దకు వస్తున్నాడు. గుర్తు తెలియని వ్యక్తులు తిమ్మాయిపల్లి చెరువు మీద కారును అడ్డగించారు.
బలవంతంగా కారులో అంతాయిపల్లి గ్రామానికి చేరువల్లోని చెట్ల పొదల్లోకి తీసుకెళ్లి తలమీద చాల బాది చంపేశారు. మృతదేహాన్ని రోడ్డుపై పడేశారు. అటుగా వెళ్తున్న వ్యక్తులు పోలీసులకు తెలిపారు. కీసర సీఐ పన్నాల గురువారెడ్డి ఆదేశాలతో ఎస్సైలు విష్ణువర్థన్రెడ్డి, వెంకట్రెడ్డిలు సంఘటన స్థలానికి వచ్చి వివరాలు తెలుసుకున్నారు.
మృతుడి భార్య శాంతిప్రియ తన భర్త స్నేహితుడే చంపి ఉంటాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. శ్రీనివాస్రావుతో పాటు రామకృష్ణారెడ్డి అనే వ్యక్తులు కలిసి తన భర్తను చంపి ఉంటారని పోలీసులకు ఫిర్యాదు చేసింది. సీఐ గురువారెడ్డి కేసు నమోదు చేసుకొని దర్యాప్తు చేస్తున్నారు.