తెలంగాణకు ప్రతిష్టాత్మక అవార్డు, కేటీఆర్కు లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు
హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర ఐటీ శాఖ మంత్రి కల్వకుంట్ల తారక రామారావు ప్రముఖ మీడియా సంస్థ బిజినెస్ వరల్డ్ అవార్డుకు ఎంపికయ్యారు. ఆయన్ను ఈ సంస్థ ఇచ్చే లీడర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు వరించింది.
కేటీఆర్కు ఇప్పటికే పలు జాతీయ అవార్డులు వచ్చాయి. ఇప్పుడు ఇది మరో ప్రతిష్టాత్మక అవార్డు. ఈ అవార్డును డిసెంబర్ 20వ తారీఖున ఢిల్లీలో జరగనున్న జాతీయ స్మార్ట్ సిటీ సదస్సులో ప్రదానం చేయనుంది.
దీంతో పాటు ఉత్తమ పట్టణ మౌలిక వసతులు ఉన్న రాష్ట్రంగా తెలంగాణకు మరో అవార్డు దక్కింది. ఇందుకోసం ముఖ్యంగా తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన మిషన్ భగీరథ, పట్టణాల్లో హరితహారం, డబుల్ బెడ్రూం ఇళ్ల నిర్మాణం లాంటి అంశాలను పరిగణలోకి తీసుకున్నారు.
ఢిల్లీలో జరగనున్న ఈ సదస్సుకు రావాలని మంత్రి కేటీఆర్కు ఆహ్వానం అందింది. తెలంగాణ రాష్ట్రాన్ని దేశ యవనికపై నిలిపిన తీరుపై స్పందించిన ఆ మీడియా సంస్థ.. కేటీఆర్ను అభినందించింది. ఈ అవార్డులను కేంద్రమంత్రి హర్దీప్ సింగ్ పూరి అందించనున్నారు.