ఆగిన విద్యుత్ బస్సుల కొనుగోలు..! సబ్సిడి అంశంలో చేతులెత్తేసిన కేంద్రం..!!
హైదరాబాద్ : తెలంగాణ ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఎలక్ట్రానిక్ బస్సుల కొనుగోలుకు కేంద్రం అడ్డుకట్ట వేసింది. రవాణా వ్యవస్థలో గతంలో మెరుగైన సౌకర్యాల కోసం గతంలో ఇచ్చిన సబ్సిడీ ఇప్పుడు ఇవ్వడం సాద్యం కాదని కేంద్ర ప్రభుత్వం తేల్చి చెప్పింది. దీంతో వాయు, శబ్ద కాలూష్యం లేని బస్సులను నగరంలో నడపాలనుకున్న రవాణ సంస్థ ఆలోచనకు ఆదిలోనే హంస పాదు ఎదురైంది. కేంద్ర నిర్ణయంతో అవాక్కైన రవాణ వ్యవస్థ ప్రత్యామ్నాయ అవకాశాలపై ద్రుష్టి పెట్టినట్టు తెలుస్తోంది.
కేంద్రం సబ్సిడీలో కోత..! విద్యుత్ బస్సులకు బ్రేక్..!!
కేంద్రం సబ్సిడీలో కోత విధించడంతో విద్యుత్ బస్సుల కొనుగోలుకు బ్రేకులు పడ్డాయి. దేశవ్యాప్తంగా నగరాల్లో కాలుష్యాన్ని నియంత్రించేందుకు విద్యుత్ బస్సులను ప్రవేశ పెట్టాలని కేంద్రం నిర్ణయించింది. తొలిదశలో ఒక్కో బస్సుపై సుమారు కోటి రూపాయల వరకు సబ్సిడీ ఇచ్చేందుకు నిర్ణయించింది. ఈ పథకం కింద తెలంగాణ ఆర్టీసీకి వంద బస్సులను ఇస్తున్నట్లు ప్రకటించింది.
బస్సుల కొనుగోలుతో ఆర్థిక భారం..! కేంద్రం సబ్సిడి ఇవ్వక పోతే ఇబ్బందే..!!
అంతే కాకుండా అనంతరం 40 బస్సులను మంజూరు చేసింది. రెండున్నర నెలలుగా ఆ బస్సులు హైదరాబాద్లో తిరుగుతున్నాయి. మిగిలిన 60 బస్సుల కొనుగోలుకు టెండర్లను ఆహ్వానించింది. టీఎస్ఆర్టీసీ సబ్సిడీని కోరుతూ కేంద్రానికి లేఖ రాసింది. గతంలో విద్యుత్ బస్సులను పరిశీలించిన ప్రభుత్వం దశలవారీగా అయిదు వందల బస్సులను ఆర్టీసీకి సమకూర్చేందుకు నిర్ణయించింది. అయితే కేంద్రం తాజాగా సబ్సిడీలో కోత విధించటంతో కథ మళ్లీ మొదటికి వచ్చింది.
60 బస్సుల లీజ్ ఒప్పందం..! గందరగోళంలో అదికారులు..!!
విద్యుత్ బస్సులను ప్రోత్సహించేందుకు కేంద్రం తొలుత ఫేమ్-1 పేరుతో పథకాన్ని ఆవిష్కరించింది. తాజాగా ఫేమ్-2 పేరుతో మరో పథకాన్ని చేపట్టింది. ఈ పథకం కింద గతంలో ఇచ్చిన సబ్సిడీ మొత్తాన్ని కోటి రూపాల నుంచి 60 లక్షల రూపాయలకు తగ్గించింది. ఫేమ్-1 పథకాన్ని ముగించామని, ఆ పథకంలో పేర్కొన్న ప్రకారం సబ్సిడీ ఇప్పుడు ఇవ్వడం సాధ్యం కాదని కేంద్రం స్పష్టం చేసింది. దీంతో 60 బస్సుల కొనుగోలుపై అధికారులు సందిగ్ధంలో పడ్డారు. ఆ బస్సుల కోసం పిలిచిన టెండర్లను నిలిపివేసినట్లు సమాచారం. నిధుల కొరతతో ఆర్టీసీ లీజు ప్రాతిపదికన ఆ బస్సులను తీసుకుంటోంది.
వంద మినీ బస్సులు..! అర్థం కాని కేంద్ర ప్రభుత్వం వ్యవహారం..!!
గతంలో విమానాశ్రయానికి 38 బస్సులు మాత్రమే నడిచేవి. తాజాగా వచ్చిన 40 విద్యుత్ బస్సులతోపాటు మరో 20 వోల్వో బస్సులను కలిపి ఆర్టీసీ 60 బస్సులను విమానాశ్రయానికి నడుపుతోంది. హైదరాబాద్లో మెట్రో రైళ్ల రాకపోకలు పెరిగిన నేపథ్యంలో అనుసంధానత కోసం మినీ విద్యుత్ బస్సులను నడపాలని నిర్ణయించింది. అందుకోసం వంద బస్సులను కొనుగోలు చేయాలని భావించింది. కేంద్రం సబ్సిడీలో కోత విధించటంతో అధికారులు ఈ విషయంలోనూ పునరాలోచనలో పడినట్లు సమాచారం.