హుజూర్నగర్ ఉప ఎన్నిక నోటిఫికేషన్ విడుదల చేసిన ఈసీ .. ఇక సమరమే !!
హుజూర్నగర్ అసెంబ్లీ ఉప ఎన్నికకు ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ నెల 30 వరకు నామినేషన్లను స్వీకరించనున్నట్టు ఎలక్షన్ కమిషన్ తెలిపింది. హుజూర్నగర్ తహసీల్దార్ ఆఫీసులో ఈ నామినేషన్లను స్వీకరించనున్నారు. అక్టోబర్ 21న హుజూర్ నగర్ ఉప ఎన్నిక జరగనుంది. ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసిన నేపథ్యంలో రిటర్నింగ్ ఆఫీసు వద్ద భారీ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు.
100 మీటర్ల వరకూ నిషేధ ఆంక్షలు విధించనున్నట్టు ఎన్నికల కమిషన్ తెలిపింది. నామినేషన్ దాఖలు చేసేందుకు 1+4 సభ్యులను మాత్రమే అనుమతించనున్నట్టు ఈసీ స్పష్టం చేసింది. ఇక దాఖలు చేసిన నామినేషన్లను అక్టోబర్ 1న పరిశీలిస్తారు. అక్టోబర్ 21న ఎన్నిక జరుగుతుంది. 24న ఎన్నికల ఫలితాలు ప్రకటించనుంది.
గత ఎన్నికల్లో హుజూర్ నగర్ నియోజకవర్గం నుండి పోటీచేసిన ఉత్తమ్ కుమార్ రెడ్డి విజయం సాధించారు. అయితే ఆయన ఆ తర్వాత పార్లమెంట్ ఎన్నికల్లో ఎంపీ గా విజయం సాధించడంతో హుజూర్ నగర్ ఎమ్మెల్యే స్థానానికి రాజీనామా చేశారు. దీంతో అక్కడ ఉప ఎన్నిక అనివార్యమైంది. ఇది కాంగ్రెస్ పార్టీ సిట్టింగ్ స్థానం కావడంతో కాంగ్రెస్ పార్టీకి, తెలంగాణ రాష్ట్రంలో అధికారంలో ఉండటంతో టిఆర్ఎస్ పార్టీకి చాలా ప్రతిష్టాత్మకంగా మారనుంది. ఎన్నికల కమిషన్ నోటిఫికేషన్ కూడా విడుదల చేయడంతో హుజూర్ నగర్లో రాజకీయం వేడెక్కింది.