కుటుంబ స్వార్థం కోసమే బై పోల్.. రాజగోపాల్పై జగదీశ్ రెడ్డి విసుర్లు
ఇప్పుడు అంతా మునుగోడు చర్చే.. అవును బై పోల్ గురించి అధికార, విపక్షాల మధ్య డైలాగ్ వార్ జరుగుతుంది. ఉప ఎన్నిక గురించి మంత్రి జగదీశ్ రెడ్డి హాట్ కామెంట్స్ చేశారు. బై పోల్ వెనుక రూ.22 వేల కోట్ల కుంభకోణం ఉందని కామెంట్స్ చేశారు. ఓ కుటుంబ స్వార్థం కోసం, వ్యాపార అభివృద్ధి కోసం మునుగోడుకు ఉప ఎన్నిక తీసుకొచ్చారని విమర్శలు చేశారు.
మునుగోడులో గెలుపు కోసం ఏ పార్టీ ఎన్ని ప్రయత్నాలు చేసిన గెలుపు సాధించేది మాత్రం టీఆర్ఎస్ అని విశ్వాసంతో ఉన్నారు. అసంతృప్తులతో టీఆర్ఎస్ పార్టీకి వచ్చే నష్టం ఏమీ లేదన్నారు. తమ పార్టీలో అసంతృప్తులు పెరుగుతున్నారని.. వారంతా బీజేపీలో చేరతారని బండి సంజయ్ చేసిన కామెంట్స్ను ఉద్దేశించి ఈ విధంగా స్పందించారు.
మునుగోడులో గెలుపు కోసం టీఆర్ఎస్, కాంగ్రెస్,బీజేపీలో ఎవరి వ్యూహాల్లో వారు ఉన్నారు. పోటా పోటీగా సభలు నిర్వహించి తమ సత్తా చాటనున్నారు. ఉప ఎన్నికలో పోటీ చేయాలా? లేదా వేరే ఏ పార్టీకి మద్దతు ఇవ్వాలా? అనే డైలామాలో కమ్యూనిస్టులు ఉన్నారు. తమతో కమ్యూనిస్టులు కలిసి వస్తే కలుపుకుపోవటానికి టీఆర్ఎస్ సిద్ధంగా ఉందని మంత్రి జగదీశ్ రెడ్డి కమ్యూనిస్టులకు హింట్ ఇచ్చారు. మునుగోడుకు ఉప ఎన్నికల రావటానికి కారణాలు ఏమిటో టీఆర్ఎస్ మునుగోడులో నిర్వహించే సభలో సీఎం కేసీఆర్ చెబుతారని తెలిపారు.
బై పోల్ ప్రధానంగా బీజేపీ, టీఆర్ఎస్ మధ్య ఉండనుంది. కాంగ్రెస్ పార్టీ కూడా పోటీలో ఉండనుంది. త్రిముఖ పోరు ఉన్నప్పటికీ.. బీజేపీ, టీఆర్ఎస్ మాత్రం పత్రిష్టాత్మకంగా తీసుకున్నాయి. ఇప్పటినుంచే జోరుగా కసరత్తు చేస్తున్నాయి. పార్టీలో ఉన్న అసంతృప్తులను కూల్ చేస్తున్నారు. తమ పార్టీ ఎలాగైనా గెలవాలనే ధీమాతో ఉన్నారు.