నల్గొండ, ఆలంపూర్ స్థానాలకు ఉప ఎన్నికలు: తేల్చేసిన హరీష్రావు
హైదరాబాద్: తెలంగాణలోని నల్గొండ, ఆలంపూర్ అసెంబ్లీ స్థానాలకు ఉప ఎన్నికలు జరిగే అవకాశం ఉందని అధికార పార్టీ నేతలు అబిప్రాయపడుతున్నారు. కర్ణాటక రాష్ట్రానికి జరిగే ఎన్నికలతో పాటు ఈ రెండు స్థానాలకు కూడ ఎన్నికలు జరిగే అవకాశం ఉందని వారు భావిస్తున్నారు.నల్గొండ, ఆలంపూర్ స్థానాలు ఖాళీగా ఉన్నాయని అసెంబ్లీ కార్యాలయం ఎన్నికల సంఘానికి సమాచారం పంపిందని తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి హరీష్ రావు మంగళవారం నాడు ధృవీకరించారు
తెలంగాణ అసెంబ్లీలో గవర్నర్ ప్రసంగం సందర్భంగా హెడ్పోన్ విసిరేయడంతో మండలి ఛైర్మెన్ స్వామిగౌడ్ కంటికి గాయమైంది. ఈ ఘటనకు భాద్యులను చేస్తూ కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, సంపత్కుమార్ల శాసనససభ సభ్యత్వాలను రద్దు చేశారు.
చంపుతారామో అయినా బెదరను, స్పీకర్కు అధికారమే లేదు, కోర్టులో నాదే విజయం: కోమటిరెడ్డి
తమ శాసన.సభ సభ్యత్వాలను రద్దు చేయడంపై న్యాయపరమైన పోరాటం చేయాలని కాంగ్రెస్ పార్టీ నిర్ణయం తీసుకొంది. అయితే కాంగ్రెస్ పార్టీకి చెందిన సుమారు 11 మంది ఎమ్మెల్యేలను కూడ అసెంబ్లీ నుండి సస్పెండ్ చేశారు.
కర్ణాటకతో పాటు తెలంగాణలో ఉప ఎన్నికలు
కర్ణాటక రాష్ట్రంతో పాటు తెలంగాణలోని రెండు అసెంబ్లీ స్థానాలకు కూడ ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. తెలంగాణ రాష్ట్ర అసెంబ్లీ నుండి శాసనసభ్యత్వాలను కోల్పోయిన నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి, ఆలంపూర్ మాజీ ఎమ్మెల్యే సంపత్కుమార్లు ప్రాతినిథ్యం వహించిన స్థానాలకు ఉప ఎన్నికలు వచ్చే అవకాశం ఉంది. ఈ రెండు స్థానాలు ఖాళీ అయ్యాయని రాష్ట్ర శాసనసభ స్పీకఱ్ ఎన్నికల సంఘానికి సమాచారం పంపారని తెలంగాణ రాష్ట్ర శాసనసభ వ్యవహరాల శాఖ మంత్రి హరీష్ రావు చెప్పారు.
ఉప ఎన్నికలు వస్తే ఏం జరుగుతోంది
నల్గొండ, ఆలంపూర్ స్థానాలకు ఒకవేళ ఉప ఎన్నికలు కర్ణాటక రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలతో పాటు జరిగితే రాజకీయంగా టిఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు ప్రతిష్టాత్మకంగా తీసుకొనే అవకాశం లేకపోలేదు. తెలంగాణ అసెంబ్లీ ఎన్నికలకు ఈ ఉప ఎన్నికలు సెమీ ఫైనల్గా భావించే అవకాశం ఉంటుంది. ఉప ఎన్నికల్లో అధికారపార్టీకే కలిసొచ్చే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు చెబుతుంటారు. కానీ, ఒక వేళ ఎన్నికలే వస్తే ఈ ఎన్నికలు ప్రత్యేక పరిస్థితుల్లో జరిగే అవకాశం ఉన్నందున ఈ ఎన్నికల్లో ప్రజలు ఏ రకమైన తీర్పును ఇస్తారోననేది ఆసక్తిగా మారింది.
కెసిఆర్పై పోటీ చేస్తానని కోమటిరెడ్డి సవాల్
తెలంగాణ ముఖ్యమంత్రి కెసిఆర్ నల్గొండ ఎంపీ స్థానం నుండి పోటీ చేసినా కానీ, గజ్వేల్ నుండి తాను పోటీ చేసినా కానీ సునాయాసంగా సీఎం కెసిఆర్పై విజయం సాధిస్తానని నల్గొండ మాజీ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి పదే పదే ఇటీవల కాలంలో సవాల్ విసిరారు. ఒక వేళ ఉప ఎన్నికలే జరిగితే నల్గొండ స్థానంలో పోటీ తీవ్రంగా ఉండే అవకాశం లేకపోలేదు.ఈ స్థానం నుండి 1999 నుండి కోమటిరెడ్డి వెంకట్ రెడ్డి విజయం సాధిస్తూ వస్తున్నారు. అయితే దీంతో ఈ స్థానాన్ని కైవసం చేసుకొనేందుకు టిఆర్ఎస్ కూడ గట్టిగానే ప్రయత్నం చేయనుంది.
ప్రారంభమైన రాజకీయ వేడి
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల సందర్భంగా కాంగ్రెస్, టిఆర్ఎస్ సభ్యుల మధ్య చోటు చేసుకొన్న పరిణామాలు రాష్ట్రంలో రాజకీయ వాతావరణాన్ని వేడెక్కించాయి. కాంగ్రెస్ పార్టీకి చెందిన ప్రజా ప్రతినిధులు కూడ మూకుమ్మడిగా రాజీనామాలు చేయాలని భావిస్తున్నారు. అసెంబ్లీలో టిఆర్ఎస్ అనుసరించిన వైఖరిని నిరసిస్తూ రాజీనామాల నిర్ణయంపై ఎఐసిసి అనుమతిని కోరుతూ లేఖ పంపారు. ఎఐసిసి అనుమతిస్తే కాంగ్రెస్ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు కూడ రాజీనామాలు చేసే అవకాశం లేకపోలేదు. అయితే వారి రాజీనామాలు ఆమోదం పొందితే ఆ స్థానాలకు కూడ కర్ణాటక అసెంబ్లీతో పాటు ఎన్నికలు జరిగే అవకాశం లేకపోలేదని విశ్లేషకులు భావిస్తున్నారు.