చంద్రబాబు పై దూషణలు తెలంగాణలో ఓట్లు రాల్చుతాయా..?
హైదరాబాద్:తెలంగాణ ముఖ్యమంత్రి చంద్రశేఖర్ రావు ఏపీ సీయం చంద్రబాబు పై ఎందుకు తారా స్థాయిలో విరుచుకుపడుతున్నారు..? చంద్రబాబును దూషిస్తే తెలంగాణలో టీఆర్ఎస్ పార్టీకి ఓట్లు పడతాయా..? నాలుగున్నరేళ్లుగా చేసిన ప్రగతిని ఏకరువు పెట్టకుండా చంద్రబాబును టార్గెట్ చేస్తే అనుకున్న ఫలితాలు వస్తాయా..? ఓ పక్కన ఏపీ అభివ్రుద్దిలో ఉన్నత శిఖరాలు అధిరోహిస్తుంటే, సాటి సోదరుడు మాత్రం అవాకులు చవాకులూ మాట్లాడుతున్నాడు. సోదర భావతంతో అభివ్రుద్ది ఫలాలను ఆస్వాదిస్తూ ముందుకు వెళ్లాల్సింది పోయి మనోభావాలు దెబ్బతినేలా దూషించుకోవడం ఎంతవరకు సమంజసమనే చర్చ జరుగుతోంది.
కేసీఆర్ కు చంద్రబాబే ఓ ఆయుధంగా దొరికారా? బాబును తిడితే ఓట్లు పడతాయా?
రాష్ట్రం వచ్చిన తర్వాత తెలంగాణను దేశంలోనే అగ్రస్థానంలో నిలిపామని చెప్పుకుంటున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి, టీఆర్ఎస్ అధినేత కెసీఆర్ కు ఇప్పుడు చంద్రబాబే ఓ ఆయుధంగా దొరికారా? టీడీపీ, కాంగ్రెస్ పొత్తునే కెసీఆర్ నమ్ముకున్నారా? అంటే అవుననే అంటున్నాయి టీఆర్ఎస్ వర్గాలు. గత ఎన్నికల తరహాలోనే ఈ సారి కూడా సెంటిమెంట్ ను నమ్ముకుని రాజకీయంగా లబ్దిపొందేందుకు కెసీఆర్ ప్లాన్ రెడీ చేసుకున్నారు. చంద్రబాబుపై కెసీఆర్ తిడుతున్న తిట్లు అప్పుడే అయిపోలేదని, ఎన్నికల ప్రచారం ముగిసే వరకూ ఈ తిట్లు అలా కొనసాగుతూనే ఉంటాయని ప్రగతి భవన్ వర్గాలు తెలుపుతున్నాయి.
కేసులు రాజకీయ ప్రయోజనం కోసమేనా..?
కేసీఆర్ అనుసరిస్తున్న టార్గెట్ చంద్రబాబు అంతా ఓ పథకం ప్రకారం సాగుతున్న వ్యవహారమే అని చెబుతున్నారు టీఆరెఎస్ నేతలు. ఓటుకు నోటు కేసులో చంద్రబాబు పేరు ప్రస్థావనకు వచ్చినా కూడా కేసును అటకెక్కించటమే కాకుండా, అట్టహాసంగా నిర్వహించిన ఆయుత చండీయాగానికి చంద్రబాబును కరకట్టకెళ్ళి మరీ ఆహ్వానించి వచ్చిన కెసీఆర్ తర్వాత చంద్రబాబును కౌగిలించుకున్న సంగతి తెలిసిందే. అన్ని ఆధారాలు ఉన్నా, ఓటుకు నోటు కేసును నీరుగార్చి, ఇప్పుడు కొత్తగా ఓటుకు నోటు కేసులో నువు దొరికిన దొంగవు కావా? అని కెసీఆర్ బహిరంగ సభల్లో ప్రశ్నిస్తున్నారు. దీంతో తెలంగాణ ప్రజల్లో చంద్రబాబు పై ఎక్కడో అడుగున పడ్డ ఆగ్రహాన్ని మళ్లీ తవ్వి బయటకు తెచ్చే ప్రయత్నం చేస్తున్నారు చంద్రశేఖర్ రావు.
చంద్రబాబును విలన్ గా చిత్రీకరిస్తే తెలంగాణ ప్రజలు నమ్ముతారా..?
మరి ఓటుకు నోటు కేసులో ఆధారాలు ఉన్నా ప్రభుత్వం ఏమి చేసింది అంటే కెసీఆర్ దగ్గర సమాధానం ఉందా అంటే కేవలం రాజకీయ అవసరాల కోసం ఈ కేసును అలా అట్టిపెట్టుకున్నట్లు అర్థం అవుతుందని అధికార వర్గాలు వ్యాఖ్యానిస్తున్నాయి. చంద్రబాబుపై తెలంగాణ ప్రజల్లో కొంత వ్యతిరేకత ఉంటుందని దాన్ని మరింత రెచ్చగొట్టి ప్రభుత్వ వ్యతిరేకత కారణంగా వెళ్ళే ఓటును చంద్రబాబును బూచిగా చూపించి, కాంగ్రెస్ వైపు మళ్ళకుండా చేయటమే కెసీఆర్ ప్లాన్ అని చెబుతున్నారు. చంద్రబాబును తిట్టడం వల్ల ఆంధ్రా ప్రాంతానికి చెందిన వారి ఓట్లు పడకపోయినా పర్వాలేదు, ఈ వ్యక్తిగత ఎటాక్ ద్వారా తెలంగాణ ప్రజల్లో సెంటిమెంట్ పెంచేసి గుండుగుత్తగా స్థానికుల ఓట్లు దక్కించుకోవాలని చూస్తున్నారని తేటతెల్లం అవుతోంది.
బాబును అడ్డం పెట్టుకుని మళ్లీ సెంటిమెంటా..? ప్రజలు ఆదరిస్తారా..?
చంద్రబాబును దూషిస్తూ లబ్ది పొందాలనుకుంటున్న కెసీఆర్ ప్లాన్ ఎంత మేరకు వర్కవుట్ అవుతుందనేది ప్రశ్నార్ధకంగా మారింది. ఎన్నికల ప్రచారం ముగిసే వరకూ తెలంగాణ ప్రజలు కెసీఆర్ నుంచి పరుషమైన మాటలు వినాల్సిందేనని, ఇది అంతా పక్కా ప్లాన్ తో సాగుతుందని చెబుతున్నారు. అయితే కెసీఆర్ బహిరంగ సభల్లో చేస్తున్న విమర్శలు శ్రుతిమించాయనే అభిప్రాయం ఎక్కువ మందిలో వ్యక్తం అవుతోంది. అసలు రాష్ట్రం ఒదిలిపెట్టి ఎప్పుడో వెళ్లిపోయిన చంద్రబాబు గురించి ఎందుకు ప్రస్థావన అంటూ తెలంగణ ప్రజానికం ప్రశ్నిస్తోందట. తెలంగాణలో తనకు రాజకీయంగా ఎలాంటి పని లేదని, రాజకీయంగా ఎలాంటి పదవులు దక్కే అవకాశం లేదని చంద్రబాబు కార్యకర్తల సమావేశంలో తేల్చి చెప్పినా, చంద్రబాబు తెలంగాణలో ఏదో చేసేందుకు మాస్టర్ ప్లాన్ వేస్తున్నారని చంద్రశేఖర్ రావు తెగ భయపడిపోతున్నట్టు చర్చ జరుగుతోంది.