ఉత్తమ్ ఇలాఖాలో ఉపఎన్నిక: టీఆర్ఎస్ అభ్యర్థి మళ్లీ ఆయనే..!
రెండు రాష్ట్రాలతో పాటు పలు రాష్ట్రాల్లో ఉపఎన్నికలు నిర్వహించేందుకు కేంద్ర ఎన్నికల సంఘం నోటిఫికేషన్ విడుదల చేసింది. దీంతో మళ్లీ ఎన్నికల హడావుడి ప్రారంభం కానుంది. మహారాష్ట్ర, హర్యానా రాష్ట్రాలతో పాటు తెలంగాణలోని హుజూర్నగర్ అసెంబ్లీ నియోజకవర్గంకు కూడా అక్టోబర్ 21న ఉపఎన్నిక జరగనుంది. దీంతో మళ్లీ తెలంగాణలో ఎన్నికల వాతావరణం కనిపిస్తోంది. ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకున్న ఈ స్థానం 2018లో కాంగ్రెస్ పార్టీ దక్కించుకుంది. తెలంగాణ పీసీసీ అధ్యక్షుడు ఉత్తమ్కుమార్ రెడ్డి టీఆర్ఎస్ అభ్యర్థి సైదిరెడ్డి పై స్వల్ప మెజార్టీతో గెలిచారు.
ఉత్తమ్కుమార్ రెడ్డి 2019 లోక్సభ ఎన్నికల్లో నల్గొండ ఎంపీ స్థానం నుంచి పోటీ చేసి గెలిచారు. అప్పటి వరకు హుజూర్ నగర్ అసెంబ్లీ ఎమ్మెల్యేగా ఉన్న ఆయన ఆ స్థానానికి రాజీనామా చేశారు. ఇక అప్పటి నుంచి హుజూర్ నగర్ అసెంబ్లీ స్థానం ఖాళీగా ఉంది. దీంతో ఆ స్థానానికి కేంద్ర ఎన్నికల సంఘం ఎన్నికల నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ సారి హుజూర్నగర్ టీఆర్ఎస్ అభ్యర్థిగా 2018లో పోటీచేసిన సైదిరెడ్డినే బరిలో నిలపాలని సీఎం కేసీఆర్ డిసైడ్ అయ్యారు. స్వల్ప తేడాతో ఉత్తమ్పై ఓటమిపాలైన సైదిరెడ్డి.. ఈ సారి కచ్చితంగా గెలుస్తారనే విశ్వాసం వ్యక్తం చేశారు సీఎం కేసీఆర్.
హుజూర్నగర్ నల్గొండ జిల్లాలో ఎంతో ప్రాముఖ్యతమైన నియోజకవర్గం. ఈ స్థానంను అన్ని పార్టీలు ఎంతో ప్రతిష్టాత్మకంగా తీసుకుంటాయి. ఇక 2018 ఎన్నికల్లో హుజూర్నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థి ఉత్తమ్కుమార్ రెడ్డికి 92,996 ఓట్లు వచ్చాయి . టీఆర్ఎస్ అభ్యర్థి సానంపూడి సైదిరెడ్డికి 85530 ఓట్లు పోలయ్యాయి. దీంతో 7,466 ఓట్ల స్వల్ప మెజార్టీతో ఉత్తమ్కుమార్ రెడ్డి సైదిరెడ్డిపై గెలుపొందారు. హుజూర్నగర్ నుంచి కాంగ్రెస్ అభ్యర్థిగా ఉత్తమ్కుమార్ రెడ్డి భార్య పద్మావతిని బరిలో దింపే అవకాశం ఉంది. అయితే దీనిపై ఎలాంటి స్పష్టమైన ప్రకటన రాలేదు. 2014 ఎన్నికల్లో ఉత్తమ్కుమార్ రెడ్డి అప్పటి టీఆర్ఎస్ అభ్యర్థి శంకరమ్మపై విజయం సాధించారు. అయితే ఈ సారి ఉపఎన్నికను గులాబీ దళం చాలా సీరియస్గా తీసుకున్నట్లు సమాచారం. హుజూర్నగర్ నియోజకవర్గంలో ప్రచారంకు సీఎం కేసీఆర్తో పాటు పలువురు స్టార్ క్యాంపెయినర్లు దిగే అవకాశం ఉంది.