సనత్ నగర్లో వారి ఓట్ల తొలగింపు, తలసానికి గెలుపు భయం: మర్రి
హైదరాబాద్: సనత్ నగర్ అసెంబ్లీ నియోజకవర్గంలో ఓటర్ల జాబితా నుంచి పలువురిని చట్టవిరుద్ధంగా తొలగిస్తున్నారని కాంగ్రెస్ పార్టీ సీనియర్ నేత మర్రి శశిధర్ రెడ్డి బుధవారం నాడు ఆరోపించారు. తొలగించిన ఓటర్ల జాబితాను, వారి పేర్లతో సహా వెబ్ సైట్లో పెట్టాలని ఆయన డిమాండ్ చేశారు.
మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ ఉప ఎన్నికలకు భయపడుతున్నారని ఎద్దేవా చేశారు. ఓటర్ల తొలగింపు అంశాన్ని తాము ఈసి భన్వర్ లాల్ దృష్టికి తీసుకు వెళ్లినట్లు చెప్పారు. గ్రేటర్ పరిధిలో అర్హులైన ఓటర్ల జాబితాను తొలగిస్తున్నారని భన్వర్లాల్కు ఫిర్యాదు చేశారు. గవర్నర్ కూడా పక్షపాతం చూపిస్తున్నారన్నారు.
కెసిఆర్ మభ్యపెడుతున్నారు: జానా రెడ్డి
ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర రావు ప్రజలను మభ్యపెడుతూ కాలం వెళ్లదీస్తున్నారని సిఎల్పీ నేత జానా రెడ్డి వరంగల్ జిల్లాలో మండిపడ్డారు.
కాంగ్రెస్ పార్టీ హయాంలో ప్రవేశ పెట్టిన సంక్షేమ పథకాల పేర్లు మార్చి అమలు చేస్తున్నారన్నారు. పేదల కోసం టిఆర్ఎస్ చేస్తుందేమీ లేదన్నారు. ప్రజలు బుద్ధి చెప్పే రోజు వస్తుందన్నారు.
కెజి టు పిజి విద్యావిధానంపై కెసిఆర్ సమీక్ష
ముఖ్యమంత్రి కెసిఆర్ కెజి టు పిజి విద్య పైన బుధవారం సచివాలయంలో సమీక్ష నిర్వహించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడారు. రాష్ట్రంలో వివిధ శాఖల కింద పనిచేస్తున్న రెసిడెన్సియల్ విద్యా సంస్థలన్నింటిని ఒకే గొడుకు కిందకు తేవాలన్నారు.
నియోజకవర్గానికి సగటున 10 రెసిడెన్షియల్ స్కూళ్లు ఉండే విధంగా రాష్ట్ర వ్యాప్తంగా 1,190 రెసిడెన్షియల్ ఏర్పాటు చేయాలన్నారు. నాలుగవ తరగతి వరకు పిల్లలు తల్లిదండ్రుల సమక్షంలోనే చదువాలన్నారు. ఇందుకోసం గ్రామస్థాయిలో పాఠశాలలు నెలకొల్పాలని చెప్పారు.
ఐదు నుంచి ఆంగ్ల మాద్యమంలో బోధన చేయాలని, 12వ తరగతి వరకు పేద విద్యార్థులకు ఉచిత విద్యా బోధన చేయాలన్నారు. ఎస్సీ, ఎస్టీ విద్యార్థులందరికీ ప్రవేశాలు కల్పించాలన్నారు. 12వ తరగతి తర్వాత కూడా విద్యార్థులు ఏ కోర్సులు ఎంచుకుంటున్నారు, ఎలాంటి విద్య, వసతి సౌకర్యాలు కల్పించాలనే దానిపై సమగ్ర విధానం రూపొందించాలన్నారు.
అన్ని పాఠశాలల్లో ఒకే రకమైన విద్యా వసతి సౌకర్యాలు కల్పించాలన్నారు. రెసిడెన్సియల్ స్కూళ్లలో, హాస్టళ్లలో విద్యార్థులకు గ్రాముల చొప్పున కాకుండా ఎవరు ఎంత తింటే అంత అన్నం పెట్టాలన్నారు. చదువు అంటే మెడిసిన్, ఇంజనీరింగ్ మాత్రమే అన్న భావన పోవాలన్నారు. విద్యా విధానంలో మార్పు రావాలన్నారు.
ఓర్వలేక విమర్శలు: ఈటెల
ప్రభుత్వం చేస్తున్న అభివృద్ధిని చూసి ఓర్వలేక విపక్షాలు విమర్శలు చేస్తున్నాయని మంత్రి ఈటెల రాజేందర్ కరీంనగర్ జిల్లాలో అన్నారు. ప్రతిపక్ష నేతల నియోజకవర్గాలను సైతం అభివృద్ధి చేస్తున్నామన్నారు. కాంగ్రెస్ నేతలు పదవులు లేకుండా బతకలేరన్నారు.
తెలంగాణ కాలుష్య నియంత్రణ మండలి సభ్యుల నియామకం
కాలుష్య నియంత్రణ మండలిలో స్థానిక సంస్థల ప్రతినిధులు, అనధికారిక సభ్యులను తెలంగాణ ప్రభుత్వం నియమించింది. అటవీ, పర్యావరణ శాఖ ఉత్తర్వులు జారీచేసింది.
స్థానిక సంస్థల కోటా నుంచి కరీంనగర్ జడ్పీటీసీ ఛైర్మన్ తుల ఉమ, బీబీనగర్ ఎంపీపీ ప్రణీత, ఘట్కేసర్, గుడిహత్నూర్, చిర్రకుంట జడ్పీటీసీలు సంజీవరెడ్డి, కేశవ రావు, కొయ్యాల ఈమాజీలను సభ్యులుగా నియమించారు. అనధికారిక సభ్యుల కోటాలో పారిశ్రామిక సంక్షేమ సంస్థ ప్రతినిధి ఎస్వీ రఘు, శ్రీని ఫుడ్పార్క్కు చెందిన గడ్డం రాజేందర్, పర్యావరణవేత్త కొలను ప్రదీప్ రెడ్డిలను సభ్యులుగా నియమించారు.