వార్ వన్ సైడేనా?: మహాకూటమి వైపు తాజా జాతీయ సర్వే, టిక్కెట్ల కోసం రచ్చరచ్చ
Recommended Video
హైదరాబాద్/న్యూఢిల్లీ: మహాకూటమిలో సీట్ల సర్దుబాటు ప్రక్రియ పూర్తిగా ముగియలేదు. కాంగ్రెస్ పార్టీ తీరుతో సీపీఐ, తెలంగాణ జన సమితిలు ఒకింత అసంతృప్తితో ఉన్నాయి. దీంతో కాంగ్రెస్ పెద్దలు ఆదివారం రంగంలోకి దిగి ఆ పార్టీల నేతలతో చర్చించారు. ఇప్పుడిప్పుడే సర్దుబాటు కొలిక్కి వస్తున్నట్లుగా కనిపిస్తోంది. పార్టీల మధ్య సీట్ల అంశం తేలే పరిస్థితులు వచ్చినప్పటికీ.. ఆయా నియోజకవర్గాల్లో ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు మాత్రం నిరనసలు తెలుపుతున్నారు.
ఎల్బీనగర్, మహబూబ్ నగర్, పఠాన్చెరు, వేములవాడ.. ఇలా పలు టిక్కెట్లు తమకే కేటాయించాలని ఆయా పార్టీలకు చెందిన ఆశావహులు నిరసనలు తెలుపుతున్నారు. ఇది పార్టీలకు మరింత చిక్కులు తెచ్చి పెడుతోంది. తమకు టిక్కెట్ ఇవ్వకుంటే స్వతంత్రంగానైనా బరిలోకి దిగుతామని హెచ్చరిస్తున్నారు. ఇది అన్ని పార్టీలకు ఇబ్బందిగా మారింది.
డిసెంబర్ 11న కొత్త ప్రభుత్వం
ఓ వైపు మహాకూటమిలో టిక్కెట్ల అంశం తేలలేదు. మరోవైపు, సర్వేలు మాత్రం కూటమికి అనుకూలంగా ఉన్నాయి. ఈ ఉత్సాహం కూటమి నేతల్లోను కనిపిస్తోంది. డిసెంబర్ 11న తెలంగాణలో కొత్త ప్రభుత్వం రాబోతుందని, సీట్ల సర్దుబాటు తమకు సమస్య కాదని, జాబితా విడుదలకు మరింత సమయం పడుతుందని ఏఐసీసీ కార్యదర్శి శ్రీనివాస్ ఆదివారం చెప్పారు. వార్ వన్ సైడ్ అవుతుందని తెరాస భావించిందని, కానీ కూటమి ఏర్పాటుతో కేసీఆర్ భయపడుతున్నారని తెలంగాణ టీడీపీ అధ్యక్షులు ఎల్ రమణ అన్నారు.
వ్యతిరేకత, పార్టీల కలయికకు తోడు సర్వేలు
కేసీఆర్ ప్రభుత్వంపై తీవ్ర వ్యతిరేకత ఉండటం, దానికి తోడు పార్టీలు కూటమిగా ఏర్పడి పోటీ చేయడం వంటి అంశాలు మహాకూటమి గెలుపుకు తోడ్పడుతాయని చాలామంది ఆశావహులు భావిస్తున్నారు. మరోవైపు, ఇటీవల సీ ఓటరు సర్వే కూటమి గెలుస్తుందని తెలిపింది. ఇది కూడా ఆశావహుల్లో, కూటమి పార్టీల్లో మరింత ఉత్సాహం తీసుకు వచ్చింది. ఎట్టి పరిస్థితుల్లోను టిక్కెట్ దక్కించుకోవాలని చాలామంది ఆశావహులు ప్రయత్నాలు చేస్తున్నారు.
కూటమికి సర్వే ఆనందం
రాజస్థాన్లో కాంగ్రెస్కు 145 సీట్లు, బీజేపీకి 45 సీట్లు, మధ్యప్రదేశ్లో బీజేపీకి 107 సీట్లు, కాంగ్రెస్కు 116 సీట్ల సింపుల్ మెజార్టీ, చత్తీస్గఢ్లో కాంగ్రెస్కు 41 సీట్లు, బీజేపీకి 43 సీట్లు, మిజోరాంలో కాంగ్రెస్కు 12 సీట్లు, మిజో నేషనల్ ఫ్రంట్కు 17 సీట్లు, జోరమ్ పీపుల్స్ మూవ్మెంట్కు 9 సీట్లు వస్తాయని సీ ఓటరు సర్వేలో తేలింది. ఇదే సర్వే తెలంగాణలో కూటమికి అధికారం దక్కే అవకాశాలు ఉన్నట్లుగా పేర్కొంది. తెలంగాణలో 119 నియోజకవర్గాలకు గాను టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ, తెలంగాణ జన సమతికి కూటమికి 64 సీట్లు వస్తాయని తేలింది. ఈ సర్వే కూటమిలో మరింత ఉత్సాహం నింపింది. కూటమి కుదిరితే ప్రచారంలోకి దిగితే మరిన్ని సీట్లు వస్తాయని భావిస్తున్నారు.
సీట్లే చిక్కులు
ఇప్పటికే టీఆర్ఎస్ 107 మంది అభ్యర్థులను ప్రకటించి ప్రచారంలో దూసుకుపోతోంది. కానీ కూటమిలో కచ్చితంగా సీట్లు వస్తాయనే అభ్యర్థులు తప్ప మిగతా చోట్ల గందరగోళంగా ఉంది. మరికొన్నింటిల్లో రెండు మూడు పార్టీలు టిక్కెట్లు అడుగుతున్నాయి. ఉదాహరణకు ఎల్బీ నగర్లో గత ఎన్నికల్లో టీడీపీ అద్భుత విజయం సాధించిందని, ఇక్కడ కాంగ్రెస్ గతంలో తమకంటే 32వేల తక్కువ ఓట్లు తెచ్చుకుందని, అలాంటి కాంగ్రెస్కు వద్దని, తమకే ఇవ్వాలని టీడీపీ నేతలు చెబుతున్నారు. కొత్తగూడెం కోసం ఓ వైపు సీపీఐ, మరోవైపు కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. సీపీఐ నుంచి కూనంనేని సాంబశివ రావు, కాంగ్రెస్ నుంచి వనమా వెంకటేశ్వర రావు కోరుకుంటున్నారు. 2014లో ఎన్నికల్లో తెరాసతో లాలూచీ పడి కూనంనేని అయిదో స్థానంలో నిలిచారని, ఆయనకు కనీసం డిపాజిట్ దక్కలేదని, అలాంటి నేతకు కొత్తగూడెం టిక్కెట్ వద్దని వనమా అంటున్నారు. ఇక్కడ కాంగ్రెస్ గెలిచే అవకాశాలు 80 శాతం ఉన్నాయని చెబుతున్నారు. తాను 30వేల మెజార్టీతో గెలుస్తానని చెప్పారు.
నియోజకవర్గాల కోసం టీడీపీ, కాంగ్రెస్, సీపీఐ పాట్లు
సీపీఐ మొత్తంగా తమకు ఐదు స్థానాలు కోరుతోంది. వాటిలోను తాము కోరుకున్న టిక్కెట్లు ఇవ్వాలని డిమాండ్ చేస్తోంది. తెలంగాణ జన సమితి 8 సీట్లతో పాటు నియోజకవర్గాలపై పట్టుబడుతోంది. తెలుగుదేశం పార్టీ తమకు ఇస్తామన్న 14 సీట్లలో కూకట్పల్లి, శేరిలింగంపల్లి, ఉప్పల్, ఖమ్మం, సత్తుపల్లి, అశ్వారావుపేట, వరంగల్ ఈస్ట్, మక్తల్, మహూబ్ నగర్ స్థానాలను అడుగుతోంది. వీటిపై ఏకాభిప్రాయం కుదిరిందని తెలుస్తోంది. మరో రెండు స్థానాలపై కొలిక్కి రాలేదు. ఎల్బీ నగర్, సనత్ నగర్, జూబ్లీహిల్స్, రాజేంద్ర నగర్ స్థానాలను కూడా ఇవ్వాలని టీడీపీ డిమాండ్ చేస్తోంది. మక్తల్లో కొత్తకోట దయాకర్ రెడ్డి బరిలోకి దిగే అవకాశముంది. రావుల చంద్రశేఖర రెడ్డి వనపర్తి కోరుకుంటున్నారు. ఆ సీటు రాకుంటే ఆయన బరిలోకి దిగే అవకాశం లేదు. అలా కాకుంటే మహబూబ్ నగర్ తీసుకొని ఇక్కడ ఎర్ర శేఖర్ను బరిలోకి దింపే అవకాశముంది.